తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా వ్యథలు: ఎంత కష్టం...బతుకు పాఠం

దశాబ్దాలుగా బోధనా రంగంలో ఉన్న  ప్రైవేటు ఉపాధ్యాయుల జీవితాలు కరోనా ప్రభావంతో తలకిందులయ్యాయి. జీతం సరిపోకున్నా... పిల్లల జీవితాలను చక్కదిద్దుతున్నామనే సంతృప్తితోనే ముందుకు సాగుతున్న వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఆంధ్రప్రదేశ్​లో 14 వేల 550 ప్రైవేటు విద్యా సంస్థలు ఉండగా వాటిలో సుమారు 1.20 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేసే వారు. వీరందరి పరిస్థితి కరోనాకు ముందు... తర్వాత అన్నచందంగా తయారైంది. పాఠశాలలు మూతపడడం, జీతాలు ఇవ్వలేమని, యాజమాన్యాలు ఉద్యోగాల నుంచి తొలగించడంతో నానాఅవస్థలు పడుతున్నారు. ఈ జీవన పోరాటంలో ముందుకు సాగలేక కొందరు అలసి పోతుండగా.. మరికొందరు ఏదో ఒక పనిచేస్తూ కష్టాలతో కుస్తీ పడుతున్నారు. ఈసారి ఉపాధ్యాయ దినోత్సవానికీ దూరమవనున్నారు. అలాంటి వారి దయనీయ స్థితిపై ‘ఈటీవీ భారత్​’ ప్రత్యేక కథనం.

By

Published : Sep 2, 2020, 9:07 AM IST

Updated : Sep 2, 2020, 9:16 AM IST

TEACHER
TEACHER

విద్యారంగంపై కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రైవేటు టీచర్లను ఉపాధి కూలీలుగా మార్చింది. రేపటి తరాన్ని తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేక యాజమాన్యాలు వారిని తొలగిస్తుంటే.. పొట్ట కూటి కోసం వారు వీధి వ్యాపారులగా, కూలీలుగా మారుతున్నారు. తరగతి గదిలో పాఠాలు చెప్పాల్సినవారు... తట్ట, పార పట్టుకుని పొలంలో పనులకు వెళ్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ప్రైవేటు టీచర్ల దయనీయస్థితి ఇది.

  • దుస్తులు అమ్ముతూ...

ఏపీలోని నెల్లూరుకు చెందిన మీరామొహీ యుద్దీన్‌ ఉపాధ్యాయ ఉద్యోగం పోవడం వల్ల రోడ్డుపక్కన దుస్తులు విక్రయిస్తున్నారు. టీషర్టులు, ప్యాంట్లు అమ్ముతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు దుస్తులను రోడ్డుపక్కన పెట్టుకుని ఎదురుచూస్తారు. ఎవరైనా కొంటే ఆరోజు ఇల్లు గడుస్తుంది. లేదంటే ఇక చెప్పేదేముంది.

  • ఆకలి తీరుస్తున్న ‘సంకల్పం’

రాజమహేంద్రవరానికి చెందిన ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడు ఉద్యోగం పోవడం వల్ల తనకు తెలిసిన పౌరోహిత్యం చేపట్టారు. గోదావరి గట్టున సంకల్పాలు చేయిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.
* కాకినాడకు చెందిన మరో గణిత ఉపాధ్యాయుడు ప్రైవేటు ఆస్పత్రిలో సెక్యూరిటీగార్డుగా పని చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో పీపీఈ కిట్లు ధరించి, ఆసుపత్రి భద్రత విధులు నిర్వర్తిస్తున్నారు.

  • పాతికేళ్లుగా బోధన...కూలీగా వేదన

ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కోటయ్యనగర్‌కు చెందిన తాటితోటి రమణయ్యను కరోనా రోజు కూలీగా మార్చేసింది. 25 ఏళ్లుగా ప్రైవేటు ఉపాధ్యాయుడిగా పనిచేసిన రమణయ్య ఇప్పుడు నిత్యం కూలికి వెళ్తున్నారు. గత నెల వరకు ఉపాధి హామీ పనులు చేయగా ఇప్పుడవి ఆగిపోవడం వల్ల ఎక్కడ పని దొరికితే అక్కడికి వెళుతున్నారు. కరోనా ముందువరకు రూ.18వేల జీతం వచ్చేది.

  • బాధను దిగమింగి... బాధితులకు సహాయకారిగా...

నెల్లూరు పట్టణానికి చెందిన కాటుబోయిన శ్రీనివాసులు 27 ఏళ్లుగా ప్రైవేటు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. మార్చి వరకు నెలకు రూ.27 వేల జీతం వచ్చేది. కరోనాతో పాఠశాల మూతపడగా ఉద్యోగం పోయింది. కుటుంబ పోషణ నిమిత్తం నెల్లూరు ఆస్పత్రిలో కొవిడ్‌-19 రోగులకు సహాయకారిగా మారారు. వారికి భోజనాలు, ఆహార పదార్థాలను తీసుకువచ్చి అందిస్తున్నారు. ఇక్కడ రూ.9 వేల వరకు జీతం వస్తోంది. పిల్లల చదువులు, ఇంటి కోసం తీసుకున్న రుణం ఎలా తీర్చాలో తెలియడం లేదని వాపోతున్నారు.

  • ముప్పిరిగొన్న సమస్యలు... రోజుకు మూడు రకాల పనులు

తాను పనిచేస్తున్న పాఠశాల మూత పడటం వల్ల గుంటూరుకు చెందిన బద్రినారాయణ ఉద్యోగం పోయింది. అప్పుడు నెలకు రూ.20 వేల జీతం వచ్చేది. ప్రస్తుతం కుటుంబ పోషణకు రోజుకు మూడు రకాల పనులు చేస్తున్నారు. ఉదయం కూరగాయల అమ్మకం, తర్వాత ఇంటి వద్దనే కిరాణ దుకాణం నిర్వహణ, సాయంత్రం భార్యతో కలిసి మిర్చిలు, మైసూరు బజ్జీలు వేయడం వేస్తున్నారు.

  • పిండిగిర్నితో నష్టాలు.. చిత్రకారుడిగా కష్టాలు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ప్రశాంత్‌బాబు ఉద్యోగం పోవడం వల్ల మొదట్లో అప్పులు చేసి పిండిగిర్ని వ్యాపారం చేపట్టారు. నష్టాలు రావడంతో దాన్ని మూసేశారు. ఆగస్టు నుంచి ఆన్‌లైన్‌ తరగతులు మొదలవడం వల్ల రెండు తరగతులు చెప్పేందుకు అనుమతి వచ్చింది. రూ.4 వేలు వస్తున్నాయి. అవి ఏమాత్రం సరిపోకపోవడం వల్ల ఇళ్లల్లో రంగులు, బొమ్మలు వేసే పనులకు వెళ్తున్నారు.

ఇలా ఇంకెన్నో జీవితాలు కరోనా సంక్షోభం వల్ల కొట్టుమిట్టాడుతున్నాయి. చేయడానికి పనుల్లేక చాలా మంది ఉపాద్యాయులు కూలీ పనులకు వెళ్తున్నారు.

ఇవీ చూడండి: సైన్స్‌ సొసైటీ వినూత్న ప్రయోగం.. రోబోటిక్ శానిటైజ‌ర్ తయారీ

Last Updated : Sep 2, 2020, 9:16 AM IST

ABOUT THE AUTHOR

...view details