తెలంగాణ

telangana

By

Published : Sep 11, 2020, 11:05 PM IST

ETV Bharat / city

మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యం: ఏపీ సీఎం జగన్

మహిళలను లక్షాధికారులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. మహిళల ఆర్థిక సాధికారత సహా వారి అభ్యుదయం కోసం రాష్ట్రంలో పలు పథకాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల హామీ మేరకు వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్.. ఎన్నికల నాటి వరకు పొదుపు సంఘాల మహిళలకు ఉన్న రుణాల చెల్లింపు ప్రారంభించారు. 4 విడతల్లో చెల్లింపులు చేస్తామన్న హామీ మేరకు.. తొలి విడత మొత్తాన్ని శుక్రవారం మహిళల ఖాతాల్లో జమ చేశారు. ప్రభుత్వం అందిస్తోన్న సాయంతో మహిళలు స్వయం ఉపాధి కల్పించుకుని తమ కాళ్లపై నిలబడి ఆర్థిక పరిపుష్టి సాధించాలని సీఎం ఆకాంక్షించారు.

మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యం: ఏపీ సీఎం జగన్
మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యం: ఏపీ సీఎం జగన్

పొదుపు సంఘాల్లో మహిళల రుణాలు తిరిగి చెల్లించేందుకు వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కంప్యూటర్​పై బటన్ నొక్కి రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాల రుణాలను విడుదల చేశారు. 2019 ఏప్రిల్ 11 నాటికి ఉన్న అప్పుల్ని 4 విడతల్లో చెల్లిస్తామని ఎన్నికల ముందు సీఎం హామీ ఇచ్చారు. ఈ మేరకు తొలివిడతగా 6,792 కోట్ల నిధులను మహిళల ఖాతాల్లో జమ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,71,302 స్వయం సహాయక బృందాల్లోని 87,74,674 మంది మహిళలకు లబ్ధి చేకూరింది. 4 ఏళ్లలో 27,168 కోట్ల మహిళల రుణాలను చెల్లించనున్నట్లు సీఎం జగన్ తెలిపారు.

మహిళల ఇష్ట ప్రకారమే...

వైఎస్ఆర్ ఆసరా కింద ఇస్తున్న డబ్బును ఎలా ఖర్చు చేసుకోవాలనే అంశాన్ని మహిళలకే వదిలేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. ఇచ్చిన డబ్బుని మహిళలు సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవాలని కోరారు. స్వయం ఉపాధి కల్పించడంలో సహకరించేందుకు పలు మల్టీ నేషనల్ సంస్థలతో అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు. వ్యాపారాలు చేసుకోవడం సహా స్వయం ఉపాధి కల్పించడానికి ఆయా సంస్థలు, బ్యాంకులు అన్నిరకాలుగా సహకరిస్తాయన్నారు. శిక్షణ, సాంకేతిక సహకారం, మార్కెటింగ్, తక్కువ ధరకే వస్తువులను ఇప్పించడంలో సహకరిస్తాన్నారు. సాయం కావాల్సిన మహిళలు మెప్మా, సెర్ప్ అధికారులకు లేదా 1902 నంబర్​కు ఫోన్ చేయవచ్చని అన్నారు.

మహిళా ఆర్ధిక సాధికారతే లక్ష్యం

మహిళలను లక్షాధికారులను చేయడమే తన లక్ష్యమని ఏపీ సీఎం జగన్ అన్నారు. అందరికీ సంక్షేమం అందాలని, సంతోషంగా ఉండాలని మహిళల కోసం 15 నెలల కాలంలో వివిధ పథకాలను తీసుకువచ్చామన్నారు. బిడ్డ కడుపులో పడిననాటి నుంచి 6 ఏళ్ల వరకు పోషణ కోసం 'వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ' తీసుకువచ్చామన్నారు. అంగన్ వాడీ కేంద్రాల్లో ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా మార్పు చేస్తున్నట్లు తెలిపారు.

అమ్మఒడి.. విద్యాదీవెన

6 ఏళ్ల నుంచి ఇంటర్ వరకు పిల్లల చదువు కోసం అమ్మ ఒడి అమలుచేస్తున్నామన్నారు. 82 లక్షల మంది పిల్లలకు అమ్మఒడి ద్వారా మేలుచేశామన్నారు. పిల్లలు బాగా చదువుకుంటేనే కుటుంబాలు పేదరికం నుంచి బయటపడతాయన్న సీఎం.. వారి చదువు కోసం ఫీజు రీయింబర్స్​మెంట్, విద్యాదీవెన పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.

సున్నా వడ్డీ పథకం..

పొదుపు సంఘాల మహిళలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. 45-60 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకం అమలు చేస్తున్నామని సీఎం చెప్పుకొచ్చారు.

దేశంలోనే ప్రథమం...

దేశంలో ఎక్కడా లేని రీతిలో నామినేటెడ్ పదవుల్లో 50 శాతం మహిళలకు ఇస్తున్నామన్న సీఎం, మహిళల రక్షణ కోసం దిశ చట్టం కోసం బిల్లును ఆమోదించామన్నారు. త్వరలో మహిళలపేరిట 30 లక్షల ఇళ్ల పట్టాలిస్తున్నామన్నారు. మద్య నియంత్రణ చర్యలు తీసుకుని మహిళల సంతోషంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఇవీ చూడండి : ఏఐసీసీ ప్రధాన కార్యదర్శుల జాబితాలో సీనియర్లకు ఉద్వాసన

ABOUT THE AUTHOR

...view details