తెలంగాణ

telangana

By

Published : Oct 10, 2020, 10:05 AM IST

ETV Bharat / city

జాగ్రత్తగా వాడుకుందాం.. విద్యుత్తు బిల్లు తగ్గించుకుందాం

కొవిడ్‌ మహమ్మారి అన్ని రంగాలపై ప్రభావం చూపింది. భవిష్యత్తు కోసం దాచుకున్న సొమ్మును సైతం బయటకు తీయాల్సి వస్తోంది. ఇప్పటికే ఆరునెలలు గడిచింది. ఖర్చులు తగ్గించుకోకపోతే మున్ముందు మరిన్ని కష్టాలు పడక తప్పదన్న ఆలోచన అందరిలోనూ మొదలైంది. నిత్యావసరాల్లో ఒకటైన విద్యుత్తు వాడకం తగ్గించుకోవడం ద్వారా కొంత సొమ్మును ఆదా చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఎలా తగ్గించుకోవచ్చో పొదుపు మంత్రంలో చూద్దాం..

over consumption of electricity in telanagan
జాగ్రత్తగా వాడుకుందాం.. విద్యుత్తు బిల్లు తగ్గించుకుందాం

విద్యుత్తు వినియోగాన్ని బట్టి పంపిణీ సంస్థ స్లాబులుగా విభజించి ఛార్జీలు వసూలు చేస్తోంది. నెలలో వంద యూనిట్ల వరకు వాడితే బిల్లు రూ.202.50 వస్తుంది. ఒక్క యూనిట్‌ అదనంగా వాడినా స్లాబు మారి రూ.334.30 అవుతుంది. ఇంధన సుంకం, సేవా రుసుము అదనం. యూనిట్లు వంద దాటకుండా చూసుకుంటే నెలకు రూ.131.80, ఏడాదికి రూ.1581.6 ఆదా చేసుకోవచ్ఛు 200 యూనిట్ల వరకు విద్యుత్తు బిల్లు రూ.760 వస్తుంది. ఒక్క యూనిట్‌ ఎక్కువ వాడినా బిల్లు రూ.1007.20 అవుతుంది. అంటే నెల బిల్లు 247.20 పెరుగుతుందన్న మాట.

ఏ ఉపకరణంపై ఎలాంటి జాగ్రత్త అవసరం

  • వాషింగ్‌ మెషిన్‌: ఎప్పటి దుస్తులు అప్పుడు ఉతికేయడం చాలామందికి అలవాటు. పూర్తిగా లోడు అయ్యాకే వాషింగ్‌ మెషిన్‌ ఉపయోగించాలి. రోజువారీ దుస్తులకు వేడి నీరు అవసరంలేదు.
    గీజర్​తో బేజార్​ కాకండి!
  • గీజర్‌: గీజర్‌ ఉన్న ఇళ్లలో 200 యూనిట్లు దాటడంతో బిల్లు రూ.వెయ్యిపైనే వస్తుంటుంది. బిల్లు తగ్గాలంటే ఇంట్లోవారు వెనువెంటనే స్నానాలు చేయాలి. థెర్మోస్టాట్‌ 50-60 డిగ్రీ సెంటీగ్రేడ్‌ ఉండేలా చూసుకోవాలి. రెండు స్నానాల గదులుంటే ఒకటే గీజర్‌ నీటిని వాడేలా పైపులు ఉండాలి.
  • రిఫ్రిజిరేటర్‌: పాత ఫ్రిజ్‌లకు కరెంట్‌ ఎక్కువ కాలుతుంది. డీప్‌ఫ్రిజ్‌లో మంచు గడ్డ కడుతోందంటే కాలం చెల్లినట్లే. పాతదాంతో 166 యూనిట్లు కాలితే కొత్త ఫ్రిజ్‌తో వంద యూనిట్ల లోపే వస్తుంది. బిల్లులో నెలకు రూ.300కు పైగా ఆదా అవుతుంది. ఫ్రిజ్‌కు, గోడకు మధ్య ఎక్కువ ఖాళీ స్థలం ఉండేలా చూడాలి.
    ఎల్​ఈడీ బల్బులే నయం
  • దీపాలు: నాణ్యమైన ఎల్‌ఈడీ బల్బులు, ట్యూబ్‌లైట్లతో విద్యుత్తు వినియోగం తక్కువగా ఉంటుంది. 10, 20, 22 వాట్స్‌వి సరిపోతాయి. పగలు కిటికీలు తెరవాలి. రాత్రుళ్లు మనం ఎక్కడుంటే అక్కడే బల్బులు వేసుకోవాలి. కొత్త ఇళ్లలో సెన్సర్‌తో పనిచేసే బల్బులు మంచిది. ట్యూబ్‌లైట్లలో త్రీ ఇన్‌ వన్‌ వచ్చాయి. ఒకసారి స్విచ్‌ వేస్తే తెలుపు, రెండోసారి వామ్‌ వైట్‌, మూడోసారి తక్కువ వెలుతురుతో వెలుగుతాయి.
  • ఏసీ: సాధారణ రోజుల్లోనూ ఏసీల వినియోగం పెరుగుతోంది. 18-19 డిగ్రీల మధ్య కాకుండా, 24-26 డిగ్రీలు ఉండేలా చూసుకుంటే విద్యుత్తు వినియోగం గణనీయంగా తగ్గుతుంది. ఏసీతోపాటు ఫ్యాన్‌ వేసుకోవడం మేలు. అలానే ఏసీ గదిలో అనవసర వస్తువులు ఉంటే తీసేయాలి.
  • మెక్రోఓవెన్‌: వండే పదార్థాన్ని బట్టి సమయాన్ని నిర్దేశించుకోవాలి. మధ్యలో తరచూ తెరిచి చూడటం వల్ల ఉష్ణోగ్రత 25 డిగ్రీలకు పడిపోతుంది. మళ్లీ వేడెక్కేందుకు అధిక విద్యుత్తు ఖర్చవుతుంది.

టీవీ చూసేటప్పుడు ఎక్కువ వెలుతురు అవసరం లేదు. డిమ్‌ లైట్‌ వేసుకోవచ్ఛు ప్రస్తుతం మార్కెట్లో దొరికే లైట్‌ డిమ్మర్లతో సగం విద్యుత్తు ఆదా అవుతుంది. బల్బుకు విద్యుత్తు ప్రవాహాన్ని తగ్గిస్తాయి. స్మార్ట్‌ బల్బులూ వచ్చాయి. వైఫై ఆధారంగానూ, రిమోట్‌తోనూ పనిచేస్తాయి. యాప్‌ ఉంటే మొబైల్‌ నుంచీ నియంత్రించొచ్ఛు విద్యుత్తు ఆదా అయ్యేలా సర్దుబాటు చేసుకోవచ్చు.

శ్రీనాథ్‌రెడ్డి, డీఈ, మేడ్చల్‌, టీఎస్‌ఎస్పీడీసీఎల్‌

లాక్‌డౌన్‌లో విద్యుత్తు బిల్లు నెలకు రూ.1500 నుంచి రూ.2 వేలు వచ్చేది. అంతే..పొదుపు బాట పట్టాం. గృహోపకరణాలను అత్యవసరమైతేనే వాడుతున్నాం. ఏసీకి బదులు ఫ్యాన్‌ వాడుతున్నాం. అనవసరంగా లైట్లు వేయడం లేదు. వాషింగ్‌ మెషిన్‌, మిక్సీలు, గ్రైండర్‌ వాడకం చాలావరకు తగ్గించాం. బిల్లు నెలకు రూ.500లోపు వచ్చేలా చూసుకుంటున్నాం.

పి.భానుశ్రీ, నిజాంపేట

ఇదీ చదవండిఃలెక్కతప్పుతున్న విద్యుత్ బిల్లు రీడింగ్.. ఆందోళనలో ప్రజలు

ABOUT THE AUTHOR

...view details