తెలంగాణ

telangana

By

Published : Apr 23, 2022, 8:29 PM IST

ETV Bharat / city

'మహిళలకు రక్షణ కల్పించటంలో విఫలం'.. జగన్​కు చంద్రబాబు ఘాటు లేఖ

మహిళలకు రక్షణ కల్పించడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఈ మేరకు సీఎం జగన్​కు లేఖ రాసిన చంద్రబాబు.. మహిళలపై హింస పెరిగేందుకు ప్రభుత్వ ఉదాసీన వైఖరే కారణమని దుయ్యబట్టారు. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒకచోట మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

cbn-letter-to-am-jagan-over-attacks-on-womens
cbn-letter-to-am-jagan-over-attacks-on-womens

ఏపీలో మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్​కు మూడు పేజీల లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదో ఒకచోట మహిళలపై దాడులు, అత్యాచార ఘటనలు జరగటం బాధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల పట్ల హింస, అత్యాచారాలు పెరగడటానికి ఘటనల పట్ల ప్రభుత్వ ఉదాసీన వైఖరే కారణమని లేఖలో మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని చెప్పడానికి విజయవాడ ఆసుపత్రిలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. కూతురు కనిపించటం లేదని స్వయంగా పోలీస్‌ స్టేషన్​కు వెళ్లి బాధితురాలి తల్లిదండ్రలు ఫిర్యాదు చేసినా.. పోలీసులు పట్టించుకోకపోవటం అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో బాధితురాలిని తాము పరామర్శించాకే ప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు. అత్యాచారం ఎప్పుడు జరిగిందో.., ఎక్కడ జరిగిందో కూడా హోంమంత్రికి తెలియకపోవటం మంత్రిగారి బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తోందని విమర్శించారు.

జాతీయ క్రైమ్‌ బ్యూరో నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా మహిళలపై జరిగే నేరాల్లో 3వ వంతు ఏపీలోనే జరుగుతుండటం అవమానకరమని చంద్రబాబు లేఖలో దుయ్యబట్టారు. మహిళలపై జరుగుతున్న భౌతిక దాడులు, మానవ అక్రమ రవాణా, లైంగిక వేధింపుల ఘటనల్లో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉండటం గర్హనీయమన్నారు. దిశా చట్టం ప్రకారం 21 రోజుల్లో నిందితులకు శిక్ష వేస్తామని ముఖ్యమంత్రిగా చేసిన వాగ్ధానం ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో దిశా చట్టం అమల్లో ఉందా ? అని ప్రశ్నించిన చంద్రబాబు.., ఎన్ని కేసులను నమోదు చేసి ఎంతమందిని శిక్షించారో చెప్పాలని నిలదీశారు. ముఖ్యమంత్రి ఇంటి పక్కనే సీతానగరంలో యువతిని గ్యాంగ్‌ రేప్‌ చేస్తే నిందితుడిని ఇప్పటివరకు పట్టుకోలేదన్నారు.

గంజాయి, డ్రగ్స్‌, మద్యం వంటి మాదక ద్రవ్యాలు రాష్ట్రంలో విచ్చలవిడిగా వినియోగించటం వల్లే ఇలాంటి నేరాలు నిత్యకృత్యమయ్యాయని చంద్రబాాబు లేఖలో పేర్కొన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడే దుర్మార్గులకు ప్రాణభయం కలిగించే విధంగా ప్రభుత్వ చర్యలు, విధానాలు ఉండాలని సూచించారు. రాజకీయ ప్రయోజనాల కోసం పోలీస్‌ వ్యవస్థను వాడటం మాని శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం ఉపయోగించాలని హితవు పలికారు. బాధితులకు అండగా నిలబడి న్యాయం చేయమని కోరితే.. బాధ్యతను మరిచి తమపై ఎదురుదాడి చేస్తున్నారంటూ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో చంద్రబాబు మండిపడ్డారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అత్యాచారానికి గురైన బాధిత యువతికి రూ.కోటి ఆర్థిక సాయంతో పాటు ఇల్లు, జీవనోపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. విజయవాడ ఘటనపై ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details