తెలంగాణ

telangana

ETV Bharat / business

విత్త మంత్రిగా జైట్లీ: జీఎస్టీ నుంచి బడ్జెట్​ 2.0 వరకు...

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, భాజపా సీనియర్​ నేత అరుణ్​ జైట్లీ స్వచ్ఛ రాజకీయాలు, న్యాయ చతురతకు పెట్టింది పేరు. ఆయన కేంద్ర ప్రభుత్వంలో సమాచార- ప్రసార, రక్షణ, న్యాయ... ఇలా పలు మంత్రిత్వ శాఖల బాధ్యతల్ని నిర్వర్తించినప్పటికీ విత్త మంత్రిగా జైట్లీ చేసిన సేవలు మరువలేనివి. ఆర్థిక మంత్రిగానే ఆయనను ప్రజలు ఎక్కువగా గుర్తుంచుకుంటారు.

By

Published : Aug 24, 2019, 2:32 PM IST

Updated : Sep 28, 2019, 2:49 AM IST

ఆర్థిక మంత్రిగా అరుణ్​జైట్లీ సంస్కరణలు

2014 మే 26... కేంద్రంలో తొలిసారి నరేంద్రమోదీ సర్కారు కొలువుదీరిన రోజు. అదే ప్రభుత్వంలో కీలక పదవి చేపట్టారు అరుణ్​ జైట్లీ. భారత 26వ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2016 ఫిబ్రవరి 29న లీప్​ సంవత్సరం సహా.. ఆయన పార్లమెంటులో 5 సార్లు బడ్జెట్​ ప్రవేశపెట్టారు.

ఆర్థిక మంత్రిగా అరుణ్​ జైట్లీ...

  • ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన పరోక్ష పన్నుల సంస్కరణ జైట్లీ హయాంలోనే జరిగింది. 2017 జులై 1న ఒకే దేశం-ఒకే పన్ను విధానంతో వస్తు సేవల పన్ను(జీఎస్​టీ)ని తీసుకొచ్చారు. జీఎస్​టీ చట్టాన్ని రూపొందించేందుకు అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలకు ఒప్పించడంలో జైట్లీ పాత్ర కీలకం. జీఎస్​టీ మండలికి రాజ్యాంగహోదా కల్పించేందుకు కృషి చేశారు.
  • భారతీయ రిజర్వ్​ బ్యాంక్​లో ద్రవ్య విధాన కమిటీ(ఎంపీసీ) ఏర్పాటుచేయాలని జైట్లీ ఒత్తిడి తెచ్చారు. ద్రవ్యోల్బణం పట్ల ఆయన దూరదృష్టితో వ్యవహరించిన తీరు మంచి ఫలితాలనిచ్చింది. ఫలితంగా.. వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణం(సీపీఐ) 7.72 నుంచి 3 శాతానికి దిగొచ్చింది.
  • బ్యాంకింగ్​ రంగంలో నిరర్ధక ఆస్తుల ప్రక్షాళనకు పూనుకున్నారు. దివాలా తీసిన సంస్థల సమస్యలకు నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కారం లభించే విధంగా దివాలా స్మృతి(ఐబీసీ) పేరిట కొత్త విధానాన్ని తీసుకొచ్చిన ఘనత జైట్లీకే దక్కుతుంది. 2016లో ఐబీసీ​ పార్లమెంటు ఆమోదం పొందింది.
  • స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా అనుబంధ సంస్థల విలీనం జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలోనే జరిగింది. స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ హైదరాబాద్​, స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ట్రావెన్​కోర్, స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ మైసూర్​, స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ బికనీర్​ అండ్​ జైపూర్​, స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ పటియాలా సహా భారతీయ మహిళా బ్యాంకు ఎస్​బీఐలో విలీనం అయ్యాయి. జైట్లీ హయాంలోనే విజయా బ్యాంక్​, దేనా బ్యాంక్​... బ్యాంక్​ ఆఫ్​ బరోడాలో విలీనం అయ్యాయి. 1969,80లలో బ్యాంకుల జాతీయకరణ అనంతరం.. బ్యాంకింగ్​ రంగంలో ఇవే అతిపెద్ద సంస్కరణలుగా పేరుగాంచాయి.
  • బడ్జెట్​ సంస్కరణలపై జైట్లీది ప్రత్యేక అజెండా. ప్రణాళిక, ప్రణాళికేతర, రైల్వే బడ్జెట్​ వ్యయాల్లో కృత్రిమ వ్యత్యాసాల్ని పోగొట్టేందుకు ఆయన విధానం ఉపకరించింది. బడ్జెట్​ ప్రవేశపెట్టే తేదీ సంప్రదాయాన్నీ జైట్లీ మార్చారు. 2017 నుంచి ఏటా ఫిబ్రవరి 1నే కేంద్ర బడ్జెట్​ ప్రవేశ పెడుతున్నారు.
  • పెద్ద నోట్ల రద్దు.. 2016లో జైట్లీ కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలోనే జరిగింది.
  • ద్రవ్య ప్రయోజనాలు, రాయితీలు నేరుగా బదిలీ చేసేందుకు జన్​ధన్​, ఆధార్​, మొబైల్​ త్రయాన్ని ప్రయోగించి విజయవంతం అయ్యారు అరుణ్​ జైట్లీ. ఫలితంగా ప్రభుత్వానికి వేల కోట్లు మిగిలాయి.
  • ద్రవ్యలోటును 3.5 శాతానికి అటూఇటుగా ఉండేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకున్నారు జైట్లీ. విజయం సాధించారు.
Last Updated : Sep 28, 2019, 2:49 AM IST

ABOUT THE AUTHOR

...view details