తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో.. ఐటీ ఉద్యోగుల కొత్త భయం!

ఒకప్పుడు ఐటీ ఉద్యోగం అంటే మంచి జీతం, స్థిరమైన ఉపాధి ఉంటుందనే భావన చాలా మందిలో ఉండేది. అయితే కొంత కాలంగా ఐటీ ఉద్యోగులకు కొత్త భయాలు నెలకొన్నాయి. ఎప్పుడు ఉద్యోగం పోతుందోననే అభద్రత భావం పెరిగిపోతోంది. ఇంతకి ఐటీ రంగంలో ఏం జరుగుతోంది? ఉద్యోగులను ఎందుకు తొలగిస్తునారు? వంటి అంశాలపై విశ్లేషణ.

By

Published : Nov 24, 2019, 10:33 AM IST

ఐటీ ఉద్యోగుల ఉపాధి భయాలు

నిన్న మొన్నటి వరకూ దేశీయ వాహన రంగంలో మందగమనం వల్ల పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోవలసిన పరిస్థితి కనిపించింది. అన్ని వర్గాలు దీనిపై తీవ్ర ఆందోళన వెలిబుచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదేతరహాలో ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపు చర్చనీయాంశంగా మారుతోంది.

వ్యయాలు తగ్గించుకునే ఉద్దేశం కావచ్చు, లేదా సాంకేతిక మార్పుల ఫలితమో కానీ ఉద్యోగాల కోతను ప్రకటిస్తున్న కంపెనీల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ పరిస్థితి ఐటీ నిపుణులను, ముఖ్యంగా ఇంజనీరింగ్‌ విద్యార్ధులను, వారి తల్లితండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది.

ఇప్పటికే ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులపై ఒత్తిడి పెరిగిపోయేందుకూ తావిస్తోంది. ఐటీ రంగంలో వచ్చే ఏడాది కాలంలో 30,000 నుంచి 40,000 మంది మధ్యస్థాయి ఉద్యోగులను కంపెనీలు తొలగించే అవకాశం ఉందంటూ నిన్నటికి నిన్న ఐటీ రంగ నిపుణుడు, ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌ఓ మోహన్‌ దాస్‌ పాయ్‌ బాంబు పేల్చటం గమనార్హం.

ఉద్యోగులను తగ్గించుకునే కంపెనీలేవంటే?

  • యూఎస్‌కు చెందిన కాగ్నిజెంట్‌ ఈ నెల మొదటి వారంలో ఉద్యోగాల కోతను ప్రకటించింది. వచ్చే కొద్ది నెలల్లో 10,000 నుంచి 12,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు కంపెనీ సీఈఓ బ్రియాన్‌ హంఫెరీస్‌ స్పష్టం చేశారు. ఏ దేశంలో ఎంతమందిని తొలగిస్తారనేది చెప్పనప్పటికీ, మనదేశంపై అధిక ప్రభావం ఉంటుందనేది విస్పష్టం. కాగ్నిజెంట్‌ ఉద్యోగుల్లో దాదాపు 70 శాతం మనదేశంలోనే పనిచేస్తున్నారు. కొన్ని విభాగాల నుంచి తాము వైదొలుగుతున్నట్లు, అందువల్ల ఉద్యోగాల కుదింపు అనివార్యంగా మారినట్లు కాగ్నిజెంట్‌ వివరించింది.
  • దేశీయ ఐటీ దిగ్గజమైన ఇన్ఫోసిస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 నుంచి 150 మిలియన్‌ డాలర్ల మేరకు వ్యయాలను తగ్గించుకోవాలనే ఆలోచనలో ఉంది. అందులో భాగంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు ఉంటుందని పరిశ్రమ వర్గాల విశ్లేషణ.
  • పర్సనల్‌ కంప్యూటర్లు, ప్రింటర్లు సరఫరా చేసే సంస్థ అయిన హెచ్‌పీ ‘వ్యాపార పునర్‌వ్యవస్థీకరణ’లో భాగంగా వచ్చే మూడేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ఏడు వేల నుంచి తొమ్మిది వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఇందులో మనదేశంలో 500 ఉద్యోగాలు ఉంటాయని అంచనా.
  • యూఎస్‌కు చెందిన ‘వుయ్‌వర్క్‌‘ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 4,000 మందిని తొలగించటానికి సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ ఛైర్మన్‌ మార్సెలో క్లారీ తాజాగా ఉద్యోగులకు రాసిన లేఖలో సూచనప్రాయంగా చెప్పారు. ఇందులో మనదేశంలో పనిచేస్తున్న ఆ కంపెనీ సిబ్బంది ఉంటారనేది విస్పష్టం. హైదరాబాద్‌తో సహా ముంబయి, బెంగళూరు, నోయిడా, గురుగ్రామ్‌, పుణె నగరాల్లో ‘వుయ్‌వర్క్‌’ కార్యకలాపాలు సాగిస్తోంది.
  • జొమాటో రెండు నెలల క్రితం గురుగ్రామ్‌లోని తన కేంద్ర కార్యాలయంలో 550 మంది ఉద్యోగులను తొలగించింది. ఆటోమేషన్‌ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానంతో సామర్థ్యాన్ని పెంచుకుంటున్నందున ఉద్యోగుల సంఖ్య తగ్గింపు తప్పనిసరి అవుతోందని ఈ సందర్భంగా జొమాటో వివరించింది.

ఉద్యోగాల కొత ఎందుకు?

ఐటీ రంగంలో ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనే విషయంలో సంబంధిత వర్గాల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా ఐటీ కంపెనీల లాభాలపై ఒత్తిడి పెరిగిపోతోంది. అందువల్ల వ్యయాలు తగ్గించుకోవటం తప్పనిసరిగా మారింది. అందువల్ల పెద్ద సంఖ్యలో బెంచ్‌ సిబ్బందిని, ప్రాజెక్టులు లేని విభాగాల్లో సిబ్బందిని కొనసాగించటానికి ఇష్టపడటం లేదు. ఇంక్రిమెంట్లు తగ్గించటం లేదా వాయిదా వేయటానికి కొన్ని సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా ఉద్యోగుల సంఖ్య తగ్గించుకుంటున్నాయి.

మనదేశంలో ఐటీ పరిశ్రమ దాదాపు మూడు దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటోంది. తొంభైవ దశకంలో ప్రారంభమైన ఎన్నో కంపెనీలు భారీగా విస్తరించి స్థిరీకరణ సాధించాయి. ఒక స్థాయికి చేరిన తర్వాత మధ్యస్థాయిలో పర్యవేక్షణ బాధ్యతల్లో ఉండే సీనియర్‌ ఉద్యోగుల అవసరం అంతగా ఉండదు. అందువల్ల పలు ఐటీ కంపెనీలు అటువంటి ఉద్యోగులను తొలగించే అవకాశం ఉన్నట్లు మోహన్‌ దాస్‌ పాయ్‌ పేర్కొన్నారు. ఇక సాంకేతిక పరిజ్ఞానంలో శరవేగంగా వస్తున్న మార్పులు కూడా ఉద్యోగుల తొలగింపునకు కారణమవుతోంది.

కృత్రిమ మేధస్సు (ఏఐ), ఆటోమేషన్‌, మెషీన్‌ లెర్నింగ్‌, 5జీ... వంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో వస్తున్న ఫలితంగా పలు సంస్థల్లో గతంలో మాదిరిగా పెద్ద సంఖ్యలో ఉద్యోగుల అవసరం ఉండటం లేదు. సాంకేతికంగా వస్తున్న మార్పుల వల్ల కొత్తరకం ఉద్యోగాలు లభిస్తాయి. అదే సమయంలో పాత ఉద్యోగుల అవసరం అంతగా ఉండదు. అందుకే తొలగింపు అనివార్యం అవుతోంది- అని స్థానిక ఐటీ వర్గాలు వివరిస్తున్నాయి.

నైపుణ్యాలుంటే అవకాశాలు..

ఐటీ రంగంలో వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా సరికొత్త నైపుణ్యాలు సమకూర్చుకున్న విద్యార్ధులకైనా, ఐటీ ఉద్యోగులకైనా ఉద్యోగాల కొరత లేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కృత్రిమ మేధస్సు ఆధారిత సాంకేతిక పరిజ్ఞానానికి, సేవలకు ఎంతో గిరాకీ లభిస్తోంది, ఈ విభాగంలో మనదేశంలోనే సమీప భవిష్యత్తులో ఒక లక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది, అటువంటి నైపుణ్యాలు ఉన్నవారికి ఎన్నో ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి- అని ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

నైపుణ్యాలు పెంచుకుంటూ ఎప్పటికప్పుడు కొత్తగా తయారయితే సరే, కానీ వెనుకబడిన వారిని ‘తొలగింపు’ భయం వెంటాడుతోందని తెలుస్తోంది. ఈ పరిస్థితులకు తగ్గట్లుగా నిపుణులను సన్నద్ధం చేసేందుకు విద్యా సంస్థలు, ఐటీ రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాలు కృషి చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.

ఇదీ చూడండి:ప్రైవేటు ఆసుపత్రుల్లోనే ఖర్చులు '7 రెట్లు' అధికం!

ABOUT THE AUTHOR

...view details