తెలంగాణ

telangana

By

Published : Jul 20, 2019, 5:48 PM IST

ETV Bharat / business

జియోను  ఢీకొట్టేందుకు ఎయిర్​టెల్​ పక్కా స్కెచ్​!

రిలయన్స్ జియో రాకతో టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులొచ్చాయి. జియో దెబ్బకు కొన్ని కంపెనీలు మూతపడితే మరికొన్ని కంపెనీలు ప్రత్యర్థులతో చేతులు కలిపాయి. త్వరలో జియో డీటీహెచ్ రంగంలోకి అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ రంగంలో ప్రముఖ స్థానాల్లో ఉన్న రెండు కంపెనీలు విలీనానికి సిద్ధమయ్యాయి.

జియో గిగా టీవీ

టెలికాం నియంత్రణ సంస్థ 'ట్రాయ్​' కొత్త నిబంధనలతో కేబుల్ టీవీ, డీటీహెచ్​ల వ్యాపారాల్లో భారీ మార్పులు వచ్చాయి. డీటీహెచ్ ఆపరేటర్ల మధ్య పోటీ కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో ఆర్థికపరమైన ఒత్తిడి, పోటీని తట్టుకునేందుకు విలీనాలపై దృష్టి సారిస్తున్నాయి పలు సంస్థలు.

వీడియోకాన్​కు చెందిన డీ2హెచ్​, డిష్ టీవీతో కలిసిపోయి.. విలీనాలకు బీజం వేసింది. ఇప్పుడు అదే బాటలో ఎయిర్​టెల్ డిజిటల్ టీవీ, డిష్​ టీవీలు కలిసి పని చేసేందుకు సిద్ధమవుతున్నాయి.

అప్పట్లో అలా.. ఇప్పుడు ఇలా

ఎయిర్​టెల్ డిజిటల్ టీవీ, డిష్​ టీవీ కలిసిపోనున్నాయని.. తొలుత వార్తలొచ్చినప్పుడు.. ఆ రెండు కంపెనీలు వాటిని వదంతులుగా కొట్టిపారేశాయి. విలీనం వల్ల ఒరిగేదేమి లేదని అన్నాయి. కానీ ఇప్పుడు ఆ రెండు కంపెనీలు కలిసిపోనున్నట్లు అధికారికంగా వెల్లడైంది.

అతిపెద్ద మార్కెట్ వాటాదారుగా అవతరించడం సహా.. డిష్​ టీవీకి ప్రస్తుతం ఉన్న ఆర్థిక ఇబ్బందులే ఈ కలయికకు ప్రధాన కారణమని ఆయా కంపెనీలు అంటున్నాయి.

మళ్లీ అదే ఫార్ములా...

గిగాటీవీ, ఇంటర్నెట్ ఆధారంగా పని చేసే ఐపీ టీవీలను మరి కొన్ని వారాల్లో ఆవిష్కరించనుంది రిలయన్స్ జియో. జియో భారీ ఆఫర్లు ప్రకటించే అవకాశం ఉంది. వాటిని తట్టుకుని మార్కెట్లో నిలబడాలంటే కలిసి పని చేయడమే సరైందని ఆ కంపెనీలు భావిస్తున్నాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇందుకోసం జియో మార్కెట్లోకి ప్రవేశించకముందే ఈ రెండు కంపెనీలు కలిసిపోయేందుకు మొగ్గుచూపుతున్నాయని చెబుతున్నాయి.

రెండు కంపెనీలు కలిస్తే ఏమవుతుంది?

ఎయిర్​టెల్ డిజిటల్ టీవీ, డిష్​ టీవీ కలిస్తే.. డీటీహెచ్ రంగంలో 61 శాతం మార్కెట్ వాటా కొత్తగా ఏర్పడే కంపెనీ చేతిలో ఉంటుంది. జియో రాకతో టెలికాం రంగంలో పోటీని తట్టుకునేందుకు వొడాఫోన్, ఐడియా పాటించిన వ్యూహాన్నే.. ఇప్పుడు ఎయిర్​టెల్​, డిష్​ టీవీ అనుకరిస్తున్నాయి. దీని ద్వారా ప్రధాన మార్కెట్ వాటా వీటి చేతుల్లో ఉంటుంది కాబట్టి.. జియోకు ప్రారంభంలోనే గట్టిపోటీ ఇవ్వచ్చని అనుకుంటున్నట్లు మార్కెట్ వర్గాల విశ్లేషణ.

2018 డిసెంబర్​ నాటికి డిష్​టీవీకి 23.6 మిలియన్ల చందాదార్లు ఉన్నారు. సంస్థ ఆదాయం రూ.1,517.4 కోట్లుగా ఉంది. ఇదే సమయంలో ఎయిర్​టెల్ డిజిటల్ టీవీకి 15 మిలియన్ల మంది చందాదార్లు ఉండగా.. సంస్థ ఆదాయం రూ.1,033 కోట్లుగా ఉంది.

ఇదీ చూడండి: చిరు వ్యాపారులూ... మీ బడ్జెట్​ ఇలా ఉందా?

ABOUT THE AUTHOR

...view details