తెలంగాణ

telangana

ETV Bharat / business

'విద్యుత్​ వాహనాలా.. అవేమన్నా ఆధార్ కార్డులా?'

100 శాతం ద్వి చక్ర, త్రి చక్ర వాహనాలను విద్యుత్తుతో నడిచేలా చేయాలన్న నీతి ఆయోగ్​ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాయి ఆటోమొబైల్​ సంస్థలు. విద్యుత్​ వాహనాలుగా మార్చాలనుకునే ముందు క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిఉంటుందని సూచించాయి. ఇది సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డాయి దిగ్గజ వాహన తయారీ సంస్థలు.

By

Published : Jun 25, 2019, 12:38 PM IST

'విద్యుత్​ వాహనాలా.. అవేమన్నా ఆధార్ కార్డులా?'

అన్ని ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను విద్యుత్ వాహనాలుగా మార్చాలన్న నీతిఆయోగ్​ ప్రతిపాదనను దిగ్గజ వాహన తయారీ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ మార్పు ఆటోమొబైల్​ రంగాన్ని తిరోగమనంలోకి నెట్టేస్తుందని.. ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దని హీరో మోటోకార్ప్​ లిమిటెడ్, బజాజ్​ ఆటో, టీవీఎస్​ మోటార్​ సంస్థలు అభిప్రాయపడ్డాయి.

2025కల్లా 100 శాతం బైక్​లు, ఆటోలు విద్యుత్​తో నడిచేలా చేసేందుకు.. తదనుగుణ చర్యలు తీసుకోవాలని ఆటో మొబైల్​ రంగాన్ని గతవారం కోరింది నీతిఆయోగ్​. 2 వారాల్లోగా ఈ అంశంపై స్పందించాలని స్పష్టం చేసింది.

అయితే.. ఈ నీతిఆయోగ్​ ప్రతిపాదన.. సాధ్యమయ్యే పనికాదని వాహన తయారీ సంస్థలు పేర్కొన్నాయి. ఆధార్​ కార్డు ముద్రించినంత సులభంగా.. ప్రస్తుతం తయారు చేస్తున్న వాహనాలను విద్యుత్తులోకి మార్చడం ఇప్పట్లో సాధ్యం కాదని పేర్కొన్నారు టీవీఎస్​ మోటార్స్​ ఎండీ వేణు శ్రీనివాసన్​.

''ఇది ఆధార్‌ కార్డు కాదు. సాఫ్ట్‌వేర్, ప్రింట్‌ కార్డులు కాదు. మొత్తం సరఫరా చెయిన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ప్రస్తుత వ్యవస్థ నుంచి దానికి మళ్లాల్సి ఉంటుంది. తగిన ప్రణాళికలను 4 నెలల్లో రూపొందిస్తామని చెప్పాం. అత్యధిక ద్విచక్ర వాహనాలున్న ఒక నగరంతో ప్రారంభించి, క్రమంగా విస్తరించుకుంటూ వెళ్లాలి. ''

- వేణు శ్రీనివాసన్​, టీవీఎస్​ మోటార్స్​ సంస్థ ఎండీ

ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది హీరో మోటోకార్ప్​ లిమిటెడ్​. 150 సీసీ లోపు సంప్రదాయ ద్విచక్ర వాహనాలను పూర్తిగా నిషేధించాలనే నీతిఆయోగ్​ ప్రతిపాదనపై ఆందోళన వ్యక్తం చేసింది.

''2020 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తున్న ప్రమాణాల వల్ల, ప్రపంచంలోనే అధిక ఇంధన సామర్థ్యంతో పనిచేస్తూ, అతి తక్కువ ఉద్గారాలు మాత్రమే వెదజల్లేలా మన ద్విచక్ర వాహనాలుంటాయి. విద్యుత్​ వాహనాలుగా మార్చాలనుకునేముందు వినియోగదారుల అంగీకారం, మార్కెట్‌ పరిస్థితులనూ పరిగణనలోకి తీసుకోవాలి. ఒక్కసారిగా అన్నీ మారాలంటే.. తయారీ, విడిభాగాల సంస్థలు, అమ్మకం దార్లు, మెకానిక్​లకు ఇలా అన్ని విధాలా వీలు కాదు. ఫలితంగా.. కోట్ల మందిపై ప్రభావం పడుతుంది. అందువల్ల దశలవారీగా అమలు చేయడమే పరిష్కారం.''

- హీరో మోటోకార్ప్​ లిమిటెడ్

ద్విచక్ర, త్రి చక్ర వాహనాలన్నీ 100 శాతం విద్యుత్తుతోనే నడిపించాలన్న ప్రతిపాదన సరైనది కాదని అభిప్రాయం తెలిపారు బజాజ్​ ఆటో ఎండీ రాజీవ్​ బజాజ్​. నిశితంగా పరిశీలించి.. అధ్యయనం చేయాలన్నారు. దేశీయ ఆటోమొబైల్‌ పరిశ్రమ పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులను ఆకర్షించిందని, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details