తెలంగాణ

telangana

By

Published : Jul 10, 2020, 6:59 AM IST

ETV Bharat / business

'వస్తువేదైనా ఏ దేశంలో తయారైందో చూపాల్సిందే'

దేశంలో ఇకమీదట ఏ వస్తువు అమ్మినా.. అది ఏ దేశంలో తయారైంది, సంబంధిత ఉత్పత్తి వివరాలను దానిపై ముద్రించాలని ఆదేశించింది కేంద్రం. ఆ వస్తువు ఉత్పత్తికి సంబంధించి అన్ని వివరాలను పొందుపరచాలని సూచించిన ప్రభుత్వం.. నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలని నిర్దేశించింది. అతిక్రమిస్తే జరిమానాతో పాటు, జైలు శిక్షను కూడా విధిస్తామని స్పష్టం చేసింది.

The center directs that the product manufacturing country must be shown at the time of sale
ఏ దేశంలో తయారైందో చూపాల్సిందే

ఇకపై ఏ వస్తువైనా ఎక్కడ తయారైందో (కంట్రీ ఆఫ్‌ ఆరిజిన్‌), ఆ ఉత్పత్తిపై తప్పక ప్రదర్శించాల్సిందే. ఆన్‌లైన్‌లో లేక దుకాణాల్లో.. ఎక్కడ విక్రయించినా కూడా, ఇది తప్పనిసరి. గరిష్ఠ విక్రయధర, ఎప్పటివరకు వినియోగించవచ్చు, నికర పరిమాణం, ఎలా వినియోగించాలి వంటి సూచనలతో పాటు 'తయారీ దేశం' వివరాలు ముద్రిస్తేనే విక్రయించాల్సి ఉంటుంది.

పర్యవేక్షణ తప్పనిసరి..

దేశీయంగా విక్రయిస్తున్న కంపెనీలు, ఇ-కామర్స్‌ సంస్థలు దీన్ని అమలు చేస్తున్నాయో, లేదో రాష్ట్ర ప్రభుత్వాలు పర్యవేక్షించాలి. ఈ ప్రక్రియ తప్పనసిరిగా అమలయ్యేలా చూడాలని రాష్ట్రాలకు ఆదేశించినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్‌విలాస్‌ పాశవాన్‌ తెలిపారు. అందరు తయారీదార్లు, దిగుమతిదార్లు, ప్యాకింగ్‌ చేసేవారు, ఇ-కామర్స్‌ సంస్థలు కూడా తాము విక్రయించే వస్తువులన్నీ ఎక్కడ తయారవుతున్నాయో ధ్రువీకరించే నిబంధనను 2018 జనవరిలో ప్రభుత్వం తెచ్చింది. ఇందుకోసం 2011 నాటి తూనికలు, కొలతల శాఖ (ప్యాకేజ్డ్‌ నిత్యావసరాలు) చట్టాల్లో సవరణలు చేసింది కూడా. ‘ఈ నిబంధన రెండున్నరేళ్ల క్రితం నుంచే అమల్లో ఉంది. దీన్ని కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాం. నిబంధన ఉల్లంఘించే వారిపై చర్యలూ చేపట్టాలి. ఇ-కామర్స్‌ పోర్టళ్లను నమోదు చేసే పారిశ్రామిక ప్రోత్సాహకాలు, అంతర్గత వాణిజ్యం (డీపీఐఐటీ) విభాగానికీ ఈ ఆదేశాలు పంపాం’ అని పాశవాన్‌ వివరించారు.

ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష

సంప్రదాయ పద్ధతుల్లో దుకాణాల ద్వారా విక్రయించే అత్యధిక కంపెనీలు ఈ నిబంధన పాటిస్తున్నాయని, ఇ-కామర్స్‌ సంస్థలు మాత్రం ఉత్పత్తి ఎక్కడిదో స్పష్టంగా తమ వెబ్‌సైట్లలో ప్రదర్శించడం లేదని వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి లీనా నందన్‌ తెలిపారు. ఇకపై కట్టుదిట్టంగా అమలు చేయాలని ఇ-కామర్స్‌ కంపెనీలను తాజాగా ఆదేశించినట్లు స్పష్టం చేశారు. ఈ నిబంధన పాటించని వారికి రూ.లక్ష వరకు జరిమానా, ఏడాది జైలు శిక్ష విధించే వీలుందన్నారు.

వాటి పరిరక్షణకు ప్రత్యేక సంస్థ

వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ‘కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ (సీసీపీఏ)’ను నెలకొల్పినట్లు తెలిపారు. దీనికి వినియోగదారుల వ్యవహాల విభాగం అదనపు కార్యదర్శి చీఫ్‌ కమిషనర్‌గా ఉంటారని, భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్‌) డైరెక్టర్‌ జనరల్‌ పరిశోధనా అధికారిగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. వినియోగదారుల హక్కులు ఉల్లంఘించినా, అనైతిక వ్యాపార విధానాలు అవలంబినట్లు సమాచారం అందినా, ప్రభుత్వం ఆదేశించినా, సూమోటోగా విచారించేందుకు/పరిశోధన చేపట్టేందుకు కూడా ఈ సంస్థకు అధికారాలుంటాయి. ఈ నిబంధనలను ఈనెల 20న ప్రభుత్వం నోటిఫై చేసే వీలుంది.

ఇదీ చదవండి:వాట్సాప్ స్టిక్కర్లతో చాటింగ్ మరింత క్రేజీగా...

ABOUT THE AUTHOR

...view details