తెలంగాణ

telangana

ETV Bharat / business

కేంద్రానికి టెలికాం సంస్థల బకాయిలు రూ.92వేల కోట్లు

దేశంలోని వివిధ టెలికాం సంస్థల లైసెన్స్​ ఫీజు బకాయిలు సుమారు రూ.92 వేల కోట్లు ఉన్నాయని సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు అఫిడవిట్​ దాఖలు చేసింది టెలికాం విభాగం.

By

Published : Jul 30, 2019, 5:46 AM IST

కేంద్రానికి టెలికాం సంస్థల బకాయిలు రూ.92వేల కోట్లు

భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఎమ్​టీఎన్​ఎల్​​, బీఎస్​ఎన్​ఎల్​ వంటి సంస్థలు దాదాపు రూ. 92 వేల కోట్ల మేర లైసెన్స్ ఫీజులు చెల్లించలేదని సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఎయిర్‌టెల్ రూ.21 వేల 682 కోట్లు, వొడాఫోన్ రూ.19వేల 823 కోట్లు, రిలయన్స్ కమ్యూనికేషన్స్ రూ.16 వేల 456 కోట్లు, బీఎస్​ఎన్​ఎల్​ రూ.2 వేల 98 కోట్లు, ఎమ్​టీఎన్​ఎల్​ రూ.2 వేల 537కోట్ల మేర చెల్లించాల్సి ఉందని టెలికాం విభాగం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో వెల్లడించింది.

నూతన టెలికాం విధానం ప్రకారం.. టెలికాం సంస్థలు తమ ఆదాయం నుంచి వార్షిక లైసెన్స్ రుసుము కింద కొంత మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. తమకు కేటాయించిన రేడియో ఫ్రీక్వెన్సీని వినియోగించుకున్నందుకు టెలిఫోన్ ఆపరేటర్లూ ప్రభుత్వానికి రుసుము చెల్లించాలి.

టెలికాం వివాదాల పరిష్కారం, అప్పీలేట్​ ట్రైబ్యునల్​ (టీడీఎస్​ఏటీ) ఆదేశాలపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు టెలికాం ఆపరేటర్లు. అడ్జెస్టేడ్​ గ్రాస్​ రెవిన్యూ (ఏజీఆర్​)లో అద్దె, స్థిరాస్తుల అమ్మకాల్లో వచ్చే లాభాలు, డివిడెండ్స్​ వంటి వాటిని లెక్కించటాన్ని సవాలు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టింది సర్వోన్నత న్యాయస్థానం.

ఇదీ చూడండి: దివాలా చట్టం సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

ABOUT THE AUTHOR

...view details