తెలంగాణ

telangana

ETV Bharat / business

టెలికాం సంస్థల 'రివర్స్​ గేర్​'- ఛార్జీల మోత షురూ

జియో.. వొడాఫోన్​-ఐడియా.. ఎయిర్​టెల్​.. పోటీపడి మరీ వినియోగదారులకు చవక ధరల్లోనే మొబైల్​ సేవలను అందించిన దిగ్గజ టెలికాం సంస్థలు. ఇవన్నీ ఇప్పుడు రివర్స్​ గేర్​ వేసి కస్టమర్లపై ఛార్జీల మోత మోగించడానికి సన్నద్ధమవుతున్నాయి. ఎందుకింత భారీ మార్పు?

By

Published : Nov 19, 2019, 6:10 AM IST

Updated : Nov 19, 2019, 8:18 AM IST

టెలికాం సంస్థల 'రివర్స్​ గేర్​'- ఛార్జీల మోత షురూ

'ఫ్రీ... ఫ్రీ' అంటూ ఒకప్పుడు వినియోగదారులను ఆకర్షించిన టెలికాం సంస్థలు.. ఇక నుంచి ఛార్జీల మోత మోగించడానికి సిద్ధపడుతున్నాయి. పోటీపడి మరీ అతి తక్కువ ధరలకే ఫోన్​ కాల్స్​, ఇంటర్నెట్​ ప్లాన్లను అందించిన దిగ్గజ సంస్థలు.. కస్టమర్లపై ఛార్జీల భారాన్ని మోపనున్నాయి. ఈ జాబితాలో ఇప్పటికే జియో చేరింది. వినియోగదారుల నుంచి వసూళ్లు రాబడుతోంది. తాజాగా.. జియో రూట్​లోనే ప్రయాణించడానికి ఎయిర్​టెల్​, వొడాఫోన్​-ఐడియా నిర్ణయించుకున్నాయి.

జియో నుంచి మొదలు...

ఇన్‌కమింగ్‌, అవుట్‌గోయింగ్‌ కాల్స్‌ను ఉచితంగా అందిస్తూ కేవలం డేటాకు మాత్రమే ఛార్జ్‌ చేస్తున్న రిలయన్స్‌ జియో.. గత నెలలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర నెట్‌వర్క్‌లకు చేసే అవుట్‌గోయింగ్‌ కాల్స్‌కు ఛార్జ్‌ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రిలయెన్స్‌ జియో నుంచి ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌-ఐడియాకు కాల్‌ చేస్తే నిమిషానికి 6 పైసలు వసూలు చేస్తోంది రిలయెన్స్‌ జియో. అయితే ఆ మొత్తానికి సమానమైన ఉచిత డేటాను వినియోగదారులకు అందించనుంది జియో.

తాజాగా... వొడాఫోన్​-ఐడియా కూడా తమ వినియోగదారులకు గట్టి షాక్​ ఇచ్చింది. డిసెంబర్​ 1 నుంచి మొబైల్​ సేవల ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ సంస్థ ఛార్జీలు పెంచడం గత మూడేళ్లలో ఇదే తొలిసారి.

వొడాఫోన్​-ఐడియా ప్రకటన వెలువడిన కొద్ది నిమిషాలకే ఎయిర్​టెల్​ కూడా ఇంచుమించూ ఇదే తరహాలో ఓ ప్రకటన విడుదల చేసింది. మొబైల్​ ఛార్జీలు పెంచుతున్నట్లు తెలిపింది. పెంచిన ధరలు డిసెంబర్​ నుంచి అమల్లో వస్తాయని తెలిపింది.

ప్రతిపాదిత ఛార్జీల పెంపు ఏ స్థాయిలో ఉంటుంది, ఎంత మేరకు పెంచుతున్నారు వంటి విషయాలను ఈ సంస్థలు వెల్లడించలేదు.

రివర్స్​ గేర్​ ఎందుకు?

ట్రాయ్​ నిబంధనలతో ప్రత్యర్థి నెట్​వర్క్​లకు జియో సుమారు రూ.13,500 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. ఈ నష్టాన్ని భరించేందుకే ఇతర నెట్​వర్క్​లకు చేసే కాల్స్​పై 6 పైసలు వసూలు చేస్తోంది జియో.

టెలికాం విభాగానికి బకాయిలు చెల్లించాల్సిందేనని భారత టెలికాం సంస్థలను గత అక్టోబర్​లో ఆదేశించింది సుప్రీం కోర్టు. ఈ నేపథ్యంలో రెండో త్రైమాసిక ఫలితాల్లో భారీ నష్టాలను మూట గట్టుకుంది వొడాఫోన్​-ఐడియా. సుమారు 50,921 కోట్ల నష్టాలను ప్రకటించింది. రెండో త్రైమాసిక ఫలితాల్లో ఏ భారతీయ కార్పొరేట్​ సంస్థ ఇత మేర నష్టాన్ని ప్రకటించిన దాఖలాలు లేవు. దీని వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిన వోడాఫోన్​-ఐడియా.. వినియోగదారులపై ఛార్జీల పెంపు నిర్ణయం తీసుకుంది. ఎయిర్​టెల్​ కుడా 23,045 కోట్ల రూపాయలను నష్టపోయింది. ఆ సంస్థకు ఇదే అతిపెద్ద నష్టాల రికార్డు.

Last Updated : Nov 19, 2019, 8:18 AM IST

ABOUT THE AUTHOR

...view details