తెలంగాణ

telangana

ETV Bharat / business

నేడు జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్​.. పన్ను తగ్గింపే లక్ష్యం!

దేశ ఆర్థికవృద్ధిని గాడిన పెట్టేందుకు, వివిధ రంగాలకు చేయూతనివ్వడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. అందులో భాగంగా నేడు గోవాలో జరుగనున్న జీఎస్టీ కౌన్సిల్​ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. జీఎస్టీ రేట్ల తగ్గింపుతో సహా, పలు రంగాలకు ఉద్దీపనలు అందించే దిశగా కృషి చేసే అవకాశం ఉంది.

By

Published : Sep 20, 2019, 6:02 AM IST

Updated : Oct 1, 2019, 7:02 AM IST

నేడు జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్​.. పన్ను తగ్గింపే లక్ష్యం!

నేడు జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్​.. పన్ను తగ్గింపే లక్ష్యం!

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో నేడు జీఎస్టీ కౌన్సిల్​ సమావేశం కానుంది. నిరాశాజనకంగా ఉన్న పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చే దిశగా ప్రభుత్వం కృషి చేయనుంది. దేశ ఆదాయస్థితి, ఆర్థిక వృద్ధిని పెంచాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని.. కీలకమైన జీఎస్టీ పన్ను నియంత్రణపై నిర్ణయం తీసుకోనుంది.
గోవాలో జరుగనున్న 37వ జీఎస్టీ కౌన్సిల్​లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​తో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక ప్రతినిధులు పాల్గొంటారు.

బిస్కెట్లు నుంచి ఆటోమొబైల్స్​ దాకా

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ ఆర్థికవృద్ధి ఆరేళ్ల కనిష్ఠం 5 శాతానికి పడిపోయింది. ఈ ఆర్థికమందగమనం నేపథ్యంలో పన్ను రేట్లను తగ్గించాలని వివిధ రంగాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడిలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా బిస్కెట్లు నుంచి ఆటోమొబైల్స్​ వరకు... ఎఫ్​ఎమ్​సీజీ నుంచి హోటళ్ల దాకా పన్ను రేట్లు తగ్గించాలని డిమాండ్​లు వస్తున్నాయి. అప్పుడే.. వినియోగం, దేశీయ డిమాండ్​ను పెంచవచ్చని వాదిస్తున్నారు.

ఫిట్​మెంట్​ కమిటీ తిరస్కరణ

కేంద్ర, రాష్ట్రాల రెవెన్యూ అధికారులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్​కు చెందిన ఫిట్​మెంట్​ కమిటీ.. బిస్కట్లు నుంచి కార్ల వరకు పన్ను రేట్లు తగ్గించాలన్న డిమాండ్లను తిరస్కరించిందని సమాచారం. దీని ప్రకారం ఆతిథ్య రంగం మినహా మరే రంగానికీ సానుకూల ప్రకటనలు రాకపోవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.

రాష్ట్రాల వ్యతిరేకత

ఏదేమైనా ఈ దశలో జీఎస్టీ రేటు తగ్గించడం వివేకమైన చర్య కాదని రాష్ట్రాలు భావిస్తున్నాయి. ఎందుకంటే జీఎస్టీ చట్టం ప్రకారం రాష్ట్రాలకు 'సెస్​ ఫండ్​' రూపంగా పరిహారం అందుతోంది. ఇప్పుడు జీఎస్టీ రేటు తగ్గిస్తే అది లక్ష్య వృద్ధిరేటుకు ప్రతికూలంగా మారుతుందని రాష్ట్రాలు అభిప్రాయపడుతున్నాయి.

ప్రత్యేక కాంపోజిషన్ పథకం

పెరిగిన రేట్లతో... ఇటుకల బట్టీలు, రాతి కషర్లు, ఇసుక తవ్వకాల కార్యకలాపాలు చేసే పన్ను చెల్లింపుదారులకు ప్రత్యేక కాంపోజిషన్ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు జీఎస్టీ కౌన్సిల్​ పరిగణించవచ్చు.

జమ్ముకశ్మీర్​ విషయంలో

జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​లకు సంబంధించి జీఎస్టీ చట్టాల్లో సవరణలు చేపట్టవచ్చని భావిస్తున్నారు. బంగారం, విలువైన రాళ్ల విక్రయంలో ఈ-వే బిల్లు వ్యవస్థను ప్రవేశపెట్టడం గురించి కేరళ చేసిన ప్రతిపాదనలనూ జీఎస్టీ కౌన్సిల్ పరిశీలించే అవకాశం ఉందని సమాచారం.

ఆధార్​తో అనుసంధానం

కొత్త జీఎస్టీ రిజిస్ట్రేషన్​ను ఆధార్​తో అనుసంధానం చేయాలన్న ప్రతిపాదనను పరిశీలించే అవకాశముంది. అలాగే నేషనల్​ యాంటీ-ప్రాఫిటీరింగ్​ అథారిటీ (ఎన్​ఏఏ) కేసుల త్రైమాసిక సమీక్షను చేపట్టే అవకాశమూ ఉందని సమాచారం.

ఇదీ చూడండి:ఉపాధికి ఊతంగా ఉండాల్సిన చదువులు..

Last Updated : Oct 1, 2019, 7:02 AM IST

ABOUT THE AUTHOR

...view details