తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'వారి అర్హత, ప్రవర్తనలో ఎలాంటి లోపం లేదు'

న్యాయమూర్తుల పదోన్నతులపై కేంద్రం అభ్యంతరాలను సుప్రీం కోర్టు కొలీజియం తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు జడ్జీలుగా మరోసారి జస్టిస్‌ అనిరుద్దా బోస్‌, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్నల పేర్లు ప్రతిపాదించింది. కొత్తగా మరో ఇద్దరు న్యాయమూర్తుల పేర్లు సిఫార్సు చేసింది కొలీజియం.

By

Published : May 9, 2019, 11:46 AM IST

Updated : May 9, 2019, 3:10 PM IST

పదోన్నతికి యోగ్యతే ప్రధానం: సుప్రీం కొలీజియం

పదోన్నతికి యోగ్యతే ప్రధానం: సుప్రీం కొలీజియం

సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తులుగా సుప్రీంకోర్టు కొలీజియం నలుగురి పేర్లు సిఫార్సు చేసింది. జస్టిస్ అనిరుద్దా బోస్, జస్టిస్ ఏఎస్​ బోపన్నల పేర్లు మరోసారి ప్రతిపాదించింది. వీరి పదోన్నతులపై కేంద్రం తెలిపిన అభ్యంతరాలను తోసిపుచ్చింది కొలీజియం. సుప్రీం జడ్జీలు కావడానికి వారికి ఉన్న అర్హత, ప్రవర్తన, సమగ్రతలో తమకు ఎలాంటి ప్రతికూలతలు కనిపించలేదని కొలీజియం స్పష్టం చేసింది.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం బుధవారం సమావేశమైంది. నలుగురు హైకోర్టు న్యాయమూర్తుల పదోన్నతిపై చర్చించింది. నిర్ణయాన్ని సుప్రీం కోర్టు వెబ్​సైట్లో గురువారం పొందుపరిచింది.

జస్టిస్​ అనిరుద్దా బోస్​, జస్టిస్​ ఏఎస్​ బోపన్నల పేర్లను ఇంతకుముందే కొలీజియం ప్రతిపాదించగా వారి నిజాయతీ, ప్రాంతాల ప్రాతినిధ్యం కారణాలుగా చూపించి కేంద్రం తిప్పి పంపించింది. ఈ అభ్యంతరాలను తోసిపుచ్చిన కొలీజియం పదోన్నతికి యోగ్యతే ప్రధానమని అభిప్రాయపడింది.

జస్టిస్​ అనిరుద్దా బోస్​ ప్రస్తుతం ఝార్ఖండ్​ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. అఖిల భారత జడ్జీల సీనియారిటీలో 12వ స్థానంలో ఉన్నారు. జస్టిస్​ ఏఎస్​ బోస్​ గువహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేస్తున్నారు. సీనియారిటీలో 36వ స్థానంలో ఉన్నారు.

మరో ఇద్దరు...

బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ బీఆర్​ గవాయ్, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ పేర్లను కొత్తగా ప్రతిపాదించింది కొలీజియం.

దేశంలో ఉన్న హైకోర్టులన్నింటికీ సుప్రీంలో ప్రాతినిధ్యం దక్కేలా నిర్ణయం తీసుకున్నామని..., ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళ, మైనారిటీ కేటగిరీలను దృష్టిలో ఉంచుకునే ఎంపిక చేశామని కొలీజియం స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టులో 31 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 27 మందే ఉన్నారు.

ఇదీ చూడండి: 'ప్రియాంకను చూస్తే ఇందిర గుర్తొచ్చారు'

Last Updated : May 9, 2019, 3:10 PM IST

ABOUT THE AUTHOR

...view details