ప్రగతి భవన్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన: కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తూ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్లో రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. స్పందించిన సీఈసీ... తెరాస నుంచి వివరణ కోరాలని రజత్ కుమార్కు ఆదేశాలు జారీ చేసింది.
వివరణ ఇవ్వండి
ప్రగతి భవన్లో రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న కాంగ్రెస్ ఫిర్యాదుపై తెరాసను ఈసీ వివరణ కోరినట్లు తెలిసింది. ఇదే అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించిన స్క్రీనింగ్ కమిటీ నుంచి కూడా ఎన్నికల సంఘం వివరణ కోరింది. ఈ అంశం తమ పరిధిలోకి రాదని సీఎస్ కమిటీ చెప్పినట్లు సమాచారం.
చర్యలు తీసుకోండి
తెరాస నేతలతో ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి సమావేశమయ్యారని, అక్కడే అభ్యర్థులకు బీఫారాలు కూడా ఇచ్చారని ఫిర్యాదులో కాంగ్రెస్ పేర్కొంది. మంత్రులు, అభ్యర్థులు ప్రగతి భవన్ వద్దే మీడియాతో మాట్లాడారని తెలిపింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన సీఎం సహా నేతలపై చర్యలు తీసుకోవాలని హస్తం పార్టీ నేతలు కోరారు.
ఇదీ చూడండి:7 రోజులు... 11సభలు... 13 నియోజకవర్గాలు