తెలంగాణ

telangana

ETV Bharat / briefs

బాత్​రూంలో తప్పిపోయిన ఐదేళ్ల పాప

ఓ చిన్నారి శనివారం నుంచి కనబడకుండా పోయింది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వెతికినా జాడ దొరకలేదు. కిడ్నాప్ చేశారేమోనని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సరిగ్గా ఐదు రోజులకు ఇంటి పక్కనే పాప ఆచూకి దొరికింది. ఇంతకీ ఆ పాప ఇన్ని రోజులు ఎక్కడుందో తెలుసా?

By

Published : Apr 25, 2019, 12:20 PM IST

Updated : Apr 25, 2019, 3:00 PM IST

ఐదురోజులుగా బాత్​రూమ్​లో ఉన్న పాప

నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని యాదవనగర్ కాలనీకి చెందిన సురేశ్​, మహాదేవమ్మ దంపతుల కూతురు అఖిల..గత శనివారం ఉదయం నుంచి పాప కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, పట్టణం మొత్తం గాలించినా... ప్రయోజనం శూన్యం. పక్క గ్రామాల్లోని బంధువుల ఇంటికి వెళ్లిందేమోననే అనుమానంతో వారిని సంప్రదించినా నిరాశే మిగిలింది. చేసేదేమి లేక పాప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించినా.. ఎలాంటి ఆచూకీ దొరకలేదు.

బాత్​రూంలో ఐదు రోజులు..

ఐదురోజులుగా కనిపించకుండా పోయిన అఖిల..బుధవారం దొరికింది. శనివారం చిన్నారి చాక్లెట్ల కోసం కిరాణ దుకాణానికి వెళ్ళింది. చాక్లెట్లు తీసుకొని ఇంటి పక్కనే ఉన్న శ్రీనివాసరావు ఇంటిపైకి ఎక్కింది. వెలుతురు కోసం వేసిన ప్లాస్టిక్ రేకుపై కాలు పెట్టింది. ప్రమాద వశాత్తు బాత్​రూంలో పడిపోయింది.

నీళ్లు తాగి బతికిన చిన్నారి

శ్రీనివాసరావు ఊరెళ్లడం వల్ల ఆ పాపను ఎవరు గుర్తించలేకపోయారు. బుధవారం రాత్రి యజమాని తిరిగి ఇంటికి రాగా.. పాపను చూసి షాకయ్యాడు. చిన్నారి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. అనారోగ్యంతో ఉన్న పాపను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఐదురోజుల పాటు ఆ పాప తిండిలేక అలమటించింది. నీళ్లు తాగి బతికింది. పాప ఆచూకీ దొరికిందని చిన్నారి తల్లిదండ్రులు సంతోషంలో మునిగిపోయారు.

ఐదురోజులుగా బాత్​రూమ్​లో ఉన్న పాప

ఇవీ చూడండి: వన్యప్రాణుల్ని కాపాడుకుందాం...!

Last Updated : Apr 25, 2019, 3:00 PM IST

ABOUT THE AUTHOR

...view details