తెలంగాణ

telangana

ETV Bharat / briefs

11న ఇందిరాపార్కు వద్ద అఖిలపక్ష పార్టీల ధర్నా

ఇందిరాపార్కు వద్ద మే 11న ఇంటర్ విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి అఖిలపక్ష పార్టీలు నిరసన దీక్ష చేపట్టనున్నాయి. సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూం భవన్‌లో "ఇంటర్మీడియట్‌ ఫలితాల అవకతవకలు- భవిష్యత్‌ ప్రణాళిక"పై నేతలు సమావేశమై చర్చించారు.

By

Published : May 5, 2019, 11:43 PM IST

Updated : May 6, 2019, 10:22 AM IST

అఖిలపక్ష పార్టీల ధర్నా

అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో మే 11న ఇందిరాపార్కు వద్ద ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ నిరసన దీక్ష నిర్వహించనున్నట్లు నేతలు తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో అఖిలపక్ష పార్టీల నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెజస అధ్యక్షుడు కోదండరాం, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నేత ఎమ్‌ఆర్​డీ వినోద్‌ పాల్గొన్నారు.

అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే!

ఇంటర్ ఫలితాల తరువాత 26 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. అవి ప్రభుత్వ హత్యలేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌కు పార్టీ ఫిరాయింపుల మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల ఆత్మహత్యలపై లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తప్పును సరిదిద్దుకుంటే మంచిదని సూచించారు. నిరసన దీక్షను విజయవంతం చేయాలని తెజస అధ్యక్షుడు కోదండరాం పిలుపునిచ్చారు.

ఇంటర్​ బోర్డు అవకతవకలపై తాము గవర్నర్‌ను కలిసినప్పుడు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారే తప్ప, అమలు చేయలేదని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్​ రెడ్డి రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడొద్దని రావుల చంద్రశేఖర్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

నిర్వహణ కమిటీ ఏర్పాటు..

ఇంటర్ బోర్డు అవకతవకలపై అఖిలపక్ష పార్టీల నేతలు నిర్వహణ కమిటీని ఏర్పాటు చేశారు. సీపీఐ నేత సుధాకర్‌, తెజస నేత పీఎల్‌ విశ్వేశ్వర్‌రావు, తెదేపా నేత శ్రీపతి సతీశ్​, కాంగ్రెస్‌ నేత వినోద్‌ ఈ కమిటీలో ఉన్నట్లు తెజస అధ్యక్షుడు కోదండరాం ప్రకటించారు.

అఖిలపక్ష పార్టీల ధర్నా

ఇవీ చూడండి: నగర యువత చూపు... టాటూ వైపు

Last Updated : May 6, 2019, 10:22 AM IST

ABOUT THE AUTHOR

...view details