Villiages Not Celebrating Diwali From 50 Years :దీపావళి వేడుకలను ఘనంగా జరపుకోవడానికి యావత్ దేశం ఉత్సాహంగా సిద్ధమవుతోంది. కానీ పంజాబ్ బఠిండా జిల్లాలోని మూడు గ్రామాలు మాత్రం పండగకు దూరంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఆర్మీ కంటోన్మెంట్, మందుగుండు సామాగ్రి డిపో ఉండటం వల్ల.. దాదాపు 50 ఏళ్లుగా ఈ గ్రామాలు దీపావళి శోభ లేక మూగబోతున్నాయి.
జిల్లాలోని ఫూస్ మండి, భగు, గులాబ్గఢ్ గ్రామాల్లో బాణసంచా పేల్చడం, పంట వ్యర్థాలను కాల్చడంపై నిషేధం విధించారు. దీని వల్ల దాదాపు 5 దశాబ్దాలుగా తాము దీపావళి పండగ జరుపుకోలేదని గ్రామస్థులు చెబుతున్నారు. భారీగా భూమి సేకరించి 1976లో కంటోన్మెంట్ నిర్మించారని తెలిపారు.
"మేము ఆర్మీ కంటోన్మెంట్, మందుగుండు సామగ్రి డిపోకు దగ్గర్లో నివసిస్తున్నాము. మా గ్రామంలోని భూమి ధరలు పెరగలేదు. మా గ్రామంలోకి రావడానికి డైరెక్ట్ రోడ్డు లేదు. అధికార యంత్రాంగం విధించిన కఠిన ఆంక్షల కారణంగా దీపావళి పండగ రోజు మా ఇళ్లకు రావడానికి మా బంధువులు ఇష్టపడటం లేదు. మా గ్రామంలో టాపాసులు కాల్చడంపై ప్రతి దీపావళికి ఆంక్షలు విధిస్తారు."
--గ్రామస్థుడు
పండగరోజు తమ పిల్లలు టపాసులు కాల్చి ఆనందంగా గడపడానికి తమ బంధువులు ఇంటికి పంపించాల్సి వస్తోంది. నిబంధనలను విరుద్ధంగా ఎవరైన టపాసులను, పంట వ్యర్థాలను కాల్చినా.. జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు.