భారతీయ విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు సిద్ధమైంది కేంద్రప్రభుత్వం. జాతీయ విద్యా విధానం, సమగ్ర శిక్షా 2.0 కింద సరికొత్త కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ మేరకు మరో ఐదేళ్లపాటు సమగ్ర శిక్షా పథకాన్ని కొనసాగించాలని కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయించింది. 2021, ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు ఈ పథకం కొనసాగుతుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
"విద్యా మౌలికవసతులను మెరుగుపరుచడం కోసం కేంద్రం రూ.3,00,000 కోట్లు వెచ్చిస్తోంది. విద్యలో సమానత్వం, నాణ్యత, అందరికీ అందుబాటులో ఉండాలని ప్రధానమంత్రి ఆకాంక్షిస్తున్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని సమగ్ర శిక్షా 2.0 పథకాన్ని తీసుకువచ్చారు. "
-ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర విద్యాశాఖ మంత్రి
కేంద్రం చేపట్టే కార్యక్రమాలివే..
- జాతీయ విద్యా విధానం, సమగ్ర శిక్షా 2.0 కింద ప్రభుత్వ పాఠాశాలల్లో ఇకపై ప్లేస్కూల్స్ ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం ఉపాధ్యాయులకు తగిన శిక్షణ అందించనున్నారు.
- వృత్తివిద్యకు అధిక ప్రాధాన్యమిచ్చేలా విద్యా విధానంలో మార్పులు చేయనున్నారు. 6 నుంచి 8 వ తరగతి దశలోనే విద్యార్థుల ఆసక్తులకు ప్రాధాన్యమిచ్చి 9వ తరగతి నుంచి 12వ తరగతి మధ్య వారికి తగిన నైపుణ్య శిక్షణ అందించనున్నారు.
- కోడింగ్, ఆగ్యుమెంటెండ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ వంటి సాంకేతికతలపై విద్యార్థులకు శిక్షణ అందించనున్నారు.
- సమగ్ర శిక్షా 2.0లో భాగంగా విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించనున్నారు. సెకండరీ స్థాయి విద్యార్థులకు ఏటా రూ.6,000 ఇందుకోసం ఖర్చు చేయనున్నారు.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులైన 16 నుంచి 19 ఏళ్ల వయసు వారికి వారి సెకండరీ విద్యను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్లో పూర్తి చేసేలా.. ఏడాదికి రూ.2,000 చొప్పున సాయం అందించనున్నారు.