బంగాల్ సీఎం మమతా బెనర్జీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. దళిత వర్గాలైన మతువా, నామసూద్రలకు పౌరసత్వాన్ని మమత తిరస్కరిస్తున్నారని ధ్వజమెత్తారు. అది ఆమె ఓటు బ్యాంకుకు నచ్చనందువల్లేనని నాడియా జిల్లా తెహత్తాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు.
"సుమారు 50-70 ఏళ్లుగా మతువా, నామసూద్రలు బంగాల్లో నివసిస్తున్నారు. కానీ దీదీ వారికి పౌరసత్వం ఇవ్వనంటున్నారు. ఎందుకు? ఎందుకంటే.. అది ఆమె ఓటు బ్యాంకుకు నచ్చదు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తే.. ఆ రెండు వర్గాల సంక్షేమం కోసం రూ.100 కోట్ల నిధి ఏర్పాటు చేస్తాం. బంగాల్లో చొరబాట్లను ఆపాలా వద్దా? చొరబాటుదారులు.. మన యువత ఉద్యోగాలను, పేదల ఆహారాన్ని కొల్లగొడతారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. అది రాష్ట్రానికే కాదు, యావద్దేశానికి ముప్పుగా పరిణమిస్తుంది. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు చొరబాట్లను ఆపలేవు. అక్రమ వలసదారులను పక్కనబెట్టండి.. సరిహద్దుల నుంచి ఒక్క పిట్టను కూడా బంగాల్లోకి భాజపా రానివ్వదు."
-అమిత్ షా, కేంద్ర హోం మంత్రి
కేరళలో లెఫ్ట్పై పోటీ చేస్తూ, బంగాల్లో అదే పార్టీతో జట్టుకట్టిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని 'పర్యాటక నేత' అని విమర్శించారు అమిత్ షా.