తెలంగాణ

telangana

By

Published : Feb 9, 2022, 7:53 PM IST

Updated : Feb 9, 2022, 9:48 PM IST

ETV Bharat / bharat

'ఐదు రాష్ట్రాల్లో మాదే విజయం.. ఎక్కడ చూసినా ప్రభుత్వ సానుకూలతే!"

PM Modi Interview ANI: శాసనసభ ఎన్నికలు జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లోనూ భాజపా విజయం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. సంపూర్ణ మెజారిటీతో ఐదు రాష్ట్రాల్లోనూ అధికారం చేపడతామని ఏఎన్​ఐ ముఖాముఖిలో ధీమాగా చెప్పారు.

PM Modi On assembly polls
PM Modi On assembly polls

PM Modi Interview ANI: అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లోనూ భాజపానే విజయం సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తంచేశారు. ఆయా రాష్ట్రాల్లో స్పష్టమైన మెజార్టీ సాధించి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లోనూ భాజపా వైపే మొగ్గు కనబడుతోందని చెప్పారు. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్‌ఐతో ప్రధాని ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు. ప్రజలు సేవ చేసే అవకాశం తమకే కల్పిస్తారని చెప్పారు. ఐదు రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేక వాతావరణం ఉందన్న వార్తల్ని తోసిపుచ్చిన ప్రధాని.. ప్రభుత్వ అనుకూల వాతావరణమే ఉందన్నారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ప్రధాని నరేంద్ర మోదీ

భాజపాకు సుస్థిర ప్రభుత్వాలు ఏర్పాటు చేసే అవకాశం దక్కిన ప్రతిచోటా తాము ఇదే పరిస్థితుల్లో విజయం సాధిస్తున్నామని మోదీ చెప్పుకొచ్చారు. యూపీలో 2014, 2017, 2019లో భాజపాకు దక్కిన విజయాలను ఈ సందర్భంగా ప్రధాని ఉదహరించారు. యూపీలో ఒకే పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రాదనే వాదనల్ని సైతం తోసిపుచ్చారు. ఈ పాత సిద్ధాంతాన్ని ఆ రాష్ట్ర ప్రజలు ఎప్పుడో తిప్పికొట్టారన్నారు. ఇంటర్వ్యూ సారాంశం ఆయన మాటల్లోనే..

  • ఒకసారి అధికారంలోకి వచ్చి వెళ్లడమనేది యూపీలో పాత సిద్ధాంతం. పాత సిద్ధాంతాల్ని యూపీ ప్రజలు ఎప్పుడో దూరంగా విసిరేశారు. మా పాలన చూసిన యూపీ ప్రజలు మళ్లీ మాకే పట్టం కడతారు.
  • నేనూ పార్టీ సాధారణ కార్యకర్తనే. గెలుపోటముల్ని మేం సమానంగా స్వీకరిస్తాం. రాష్ట్రాల అవసరాలు, ఆకాంక్షలు నాకు బాగా తెలుసు. ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చాడాన్ని భాజపా విశ్వసిస్తుంది. ప్రతిపక్షాలు దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రణాళికలు రచిస్తున్నాయి. ప్రతిపక్షాల ఉచ్చులో పడకుండా ప్రజలు పరిణతితో ఉన్నారు.
  • 50 ఏళ్లలో కాంగ్రెస్‌ దేశాన్ని విభజించడానికి మాత్రమే పనిచేసింది. విభజన సూత్రం.. దేశం, దేశ ప్రజల లక్షణం కాదు. అందరినీ కలుపుకొని వెళ్లానే సిద్ధాంతాన్నే నేను నమ్ముతా. భిన్నత్వంలో ఏకత్వం సూత్రాన్ని అనుసరిస్తాం. కొందరు భిన్నత్వ భావనను స్వార్థ ప్రయోజనాల కోసం వాడుతున్నారు. ప్రజలకు సేవ చేయడంలో భాజపా ఎప్పుడూ ముందుంటుంది. సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌ నినాదంతో పనిచేస్తున్నాం. అన్ని రాష్ట్రాల్లోనూ భాజపా గాలి వీస్తోంది. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజా సంక్షేమం కోసమే ఆలోచిస్తాం.
  • కుటుంబ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి అతిపెద్ద శ్రతువు. వారసత్వ రాజకీయాలతో ప్రతిభావంతులు మరుగునపడిపోతున్నారు. జమ్మూకశ్మీర్‌, హరియాణా, పంజాబ్‌, ఝార్ఖండ్‌, యూపీ, తమిళనాడుకు చెందిన పలు పార్టీల్లో కుటుంబ రాజకీయాలే నడుస్తున్నాయి. యూపీలోని సమాజ్‌వాదీ పార్టీలో ఒకే కుటుంబానికి చెందిన 45మంది పార్టీ పదవుల్లో చక్రం తిప్పుతున్నారు.
  • మా ఉద్దేశం ప్రకారం కుటుంబ పార్టీలు ప్రజాస్వామ్యానికి అతిపెద్దశత్రువు. అవి ప్రజాస్వామ్యా మూల సిద్ధాంతాన్నే దెబ్బతీస్తున్నాయి. కుటుంబ రాజకీయాలు ఉన్నప్పుడు కుటుంబమే సర్వోన్నతమవుతుంది. పార్టీ రాణించినా లేకున్నా కుటుంబాన్ని కాపాడుకోవాలి. దేశాన్ని రక్షించినా లేకున్నా కుటుంబాన్ని కాపాడుకోవడమే జరుగుతుంది. తద్వారా ఎవరికి ఎక్కువగా నష్టం జరుగుతుంది?కుటుంబ రాజకీయాల వల్ల ఎవరికి నష్టం? కొడుకు ఎలాంటి వాడైనా పార్టీ అధ్యక్షుడిగా చేస్తే ఎక్కువగా నష్టపోయేది ప్రతిభే. ప్రజా జీవనంలో చాలా ఎక్కువగా ప్రతిభను ఆహ్వానించాలి. కాబట్టి రాజకీయ పార్టీలను ప్రజాస్వామికం చేయాలి.

మాజీ ప్రధాని గురించి మాట్లాడితే వారికెందుకు భయం..?

రాష్ట్రపత్రి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ ముగింపు సందర్భంగా రాజ్యసభలో ప్రధానమంత్రి చేసిన ప్రసంగంపై ప్రతిపక్షాలు మండిపడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మాజీ ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ పేరును పార్లమెంటులో ప్రస్తావించడం పట్ల కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. తాను ఎవరి తండ్రి లేదా తాత గురించి మాట్లాడలేదని.. కేవలం మాజీ ప్రధాని గురించి మాత్రమే ప్రస్తావించానని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

"ఏ ఒక్కరి తండ్రి లేదా తాతగారి గురించి నేను మాట్లాడలేదు. మాజీ ప్రధాని చెప్పిన విషయాన్ని మాత్రమే చెప్పాను. ఆ విషయాలు యావత్‌ దేశం తెలుసుకోవాల్సిందే. నెహ్రూ పేరును తీయొద్దని వారంటారు. అలా తీస్తే వాళ్లకేంటి ఇబ్బంది? ఎందుకు అంత భయపడుతున్నారో అర్థం కావడం లేదు" అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా లోక్‌సభలో ప్రధానమంత్రి చేసిన ప్రసంగంలో మాజీ ప్రధాని నెహ్రూ పేరును పలుసార్లు ప్రస్తావించారు. "కొరియాలో యుద్ధం జరిగితే దాని ప్రభావం కొన్నిసార్లు మనపైనా ఉంటుంది. దాంతో భారత్‌లో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. అంతేకాకుండా అమెరికాలో ఏదైనా జరిగితే మన దేశంలో వస్తువుల ధరలపైనా ప్రభావం ఉంటుంది" అంటూ గతంలో పలు సందర్భాల్లో నెహ్రూ చెప్పిన మాటలను ప్రధానిమోదీ గుర్తుచేశారు. అంతేకాకుండా రాజ్యసభలోనూ చేసిన ప్రసంగంలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను వివరిస్తూ ఇందిరా గాంధీ పేరును ప్రస్తావించారు. ఇలా మాజీ ప్రధానుల గురించి నరేంద్ర మోదీ ప్రస్తావించడాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఆక్షేపించింది.

ఇవీ చూడండి:తొలిదశ పోలింగ్​కు 'యూపీ' సిద్ధం- ఆ వర్గం తీర్పే కీలకం!

'కాంగ్రెస్ అంటే ప్రధానికి భయం.. అందుకే విమర్శలు'

Last Updated : Feb 9, 2022, 9:48 PM IST

ABOUT THE AUTHOR

...view details