తెలంగాణ

telangana

యువకుడిని హత్య చేసి ఇంట్లోనే పాతిపెట్టిన వ్యక్తి- తల, మొండెం వేరు చేసి

By ETV Bharat Telugu Team

Published : Nov 21, 2023, 2:30 PM IST

Man Killed His Friend : స్నేహితుడిని హత్య చేసి ఇంట్లోనే పాతిపెట్టాడు ఓ వ్యక్తి. సీసీటీవీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. అసలు విషయం బయటపడింది. తమిళనాడులో జరిగిందీ ఘటన.

man killed his friend and buried him inside the house in tanjore tamilnadu
man killed his friend and buried him inside the house in tanjore tamilnadu

Man Killed His Friend : తమిళనాడులోని తంజావూరు జిల్లాలో స్నేహితుడినే హత్య చేశాడు ఓ వ్యక్తి. ఆ తర్వాత తల, మొండెం వేరు చేసి.. తన ఇంట్లోనే పాతిపెట్టాడు. సీసీటీవీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. అసలు విషయం బయటపడింది. అసలేం జరిగిందంటే?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కుంభకోణం- చోళాపురం ప్రాంతానికి చెందిన అశోక్​రాజ్​(27) అనే యువకుడు.. అక్టోబర్​ 13వ తేదీ నుంచి కనిపించడం లేదు. అతడి తండ్రి కొన్నేళ్ల క్రితం చనిపోగా.. తల్లి విదేశాల్లో ఉంటున్నారు. దీంతో అతడు తన అమ్మమ్మ దగ్గరే ఉంటున్నాడు. అయితే అతడు ఒక్కసారిగా కనిపించకుండా పోవడం వల్ల బాధితుడి అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

యువకుడి అమ్మమ్మ ఫిర్యాదు అందుకున్న చోళాపురం పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్​లను పరిశీలించారు. ఆ సమయంలో అతడు చోళాపురం తూర్పురోడ్డు వైపు వెళ్తున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత సీసీటీవీల ఆధారంగా యువకుడి స్నేహితుడైన 47 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఆ సమయంలో యువకుడిని హత్య చేసి తన ఇంట్లో పూడ్చిపెట్టినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.

వెంటనే పోలీసులు.. డాగ్​స్క్వాడ్​ను తీసుకుని నిందితుడి ఇంటికి వెళ్లారు. జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరన్​ ఆధ్వర్యంలో పాతిపెట్టిన యువకుడి మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. ఆ సమయంలో మృతదేహాన్ని రెండు ముక్కలుగా చేసి పాతిపెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలిలో వైద్య సిబ్బంది.. యువకుడి మృతదేహానికి శవపరీక్షలు నిర్వహించారు. అనంతరం యువకుడి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

అయితే నిందితుడు స్వలింగ సంపర్కుడు అని పోలీసులు తెలిపారు. శృంగారంలో పాల్గొన్నప్పుడు.. యువకుడిని అతడు చంపి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన మరో యువకుడు 2021 నుంచి కనిపించకుండా పోయాడని పోలీసులు తెలిపారు. ఇప్పటికి 2 ఏళ్లు గడుస్తున్నా ఆచూకీ లభించలేదని, అతడి అదృశ్యంతో కూడా నిందితుడికి ఏమైనా సంబంధం ఉన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

మరోవైపు, నిందితుడు నాటువైద్యుడు అని స్థానికులు తెలిపారు. అప్పుడప్పుడు తాపీమేస్త్రీ కూడా పనిచేస్తాడని చెప్పారు. గతంలో అతడికి రెండు పెళ్లిళ్లు అయ్యాయని పేర్కొన్నారు. ఇద్దరితోనూ విడిపోయాడని.. ప్రస్తుతం ఒంటరిగా జీవిస్తున్నాడని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details