తెలంగాణ

telangana

By

Published : Aug 8, 2021, 12:24 PM IST

ETV Bharat / bharat

బసవరాజ మంత్రివర్గంలో అసమ్మతి శాఖోపశాఖలు

కర్ణాటక ముఖ్యమంత్రిగా బసవరాజ బొమ్మై బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. కానీ, అమాత్యులకు ఆశించిన శాఖలు దక్కక పోవడం వల్ల అసమ్మతి స్వరం ప్రతిధ్వనిస్తోంది. తమకు కేటాయించిన మంత్రి పదవులపై కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

Karnataka Politics
కర్ణాటక ముఖ్యమంత్రిగా బసవరాజ బొమ్మై

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై కొలువులో అమాత్యులకు ఆశించిన శాఖలు దక్కక పోవడంతో శనివారం అసమ్మతి స్వరం ప్రతిధ్వనించింది. కేటాయించిన మంత్రి పదవులపై కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. 'నాకు ఆహార, పౌర సరఫరాల శాఖను ఇస్తానని ఆరు నెలలుగా నాటి ముఖ్యమంత్రి యడియూరప్ప హామీ ఇస్తూ వచ్చారు. ఈ విషయంలో.. కుల దైవంపైన ఒట్టేసి చెప్పారు. దానికి ఇప్పటి ముఖ్యమంత్రి బొమ్మై, మరత్రి ఆర్‌.అశోక్‌ సాక్ష్యం' అని మంత్రి ఎం.టి.బి.నాగరాజ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 'నాకేమో ప్రాధాన్యం లేని శాఖను కేటాయించారు. మరో రెండు మూడు రోజులు వేచి చూస్తాను. అప్పటికీ శాఖ మార్చకపోతే.. పదవికి రాజీనామా చేస్తా'నని ట్వీట్‌ చేశారు. 'యడియూరప్పకు మద్దతు ఇచ్చేందుకు చేతిలో ఉన్న మంత్రి పదవిని వదులుకుని వచ్ఛా రాజకీయాలు నాకు కొత్త కాదు. మంచి శాఖ ఉంటే ప్రజలకు నిత్యం దగ్గరగా ఉంటూ సేవలు అందించాలన్న కోరిక. దానికి అనుగుణంగా శాఖ కేటాయించాలని కోరినా నిర్లక్ష్యం చేశారు' అని తనను కలుసుకున్న విలేకరుల వద్ద ఆక్రోశాన్ని వెళ్లగక్కారు.

మంత్రులు నాగరాజ్​, శ్రీరాములు, ప్రీతం గౌడ్​

సంతృప్తి లేదు..

తనకు కేటాయించిన శాఖలపై సంతృప్తిగా లేనని మంత్రి శ్రీరాములు పేర్కొన్నారు. పార్టీ పెద్దలు తనపై ఉంచిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానని తెలిపారు. ఆయన అభిమానులు, బళ్లారి విభాగంలోని కార్యకర్తలు అందరూ శ్రీరాములుకు ఉప ముఖ్యమంత్రి స్థానం దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం నష్టాల్లో ఉన్న రవాణా శాఖను తమ నేతకు అప్పగించడంతో కార్యకర్తలతో పాటు, శ్రీరాములు తీవ్ర నిరాశకు లోనయ్యారు. పార్టీ తీసుకున్న నిర్ణయమే తనకు శిరోధార్యమని మంత్రి పేర్కొనడం విశేషం.

గౌడతో పనేంటి?

మంత్రిగా అవకాశం వస్తుందని హాసన నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రీతం గౌడ ఆశలు పెట్టుకున్నారు. 14 ఏళ్లుగా జనతాదళ్‌ నేతల ఒంటెద్దు పోకడల్ని ఎండగడుతూ వస్తున్నామని, ఇప్పుడు బొమ్మై ముఖ్యమంత్రిగా ఎన్నికైన రెండో రోజే మాజీ ప్రధాని దేవేగౌడతో సమావేశం కావడం ద్వారా పార్టీ కార్యకర్తలందరినీ నిరాశపరిచారని పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు, భాజపా కార్యకర్తలతో కలిసి హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తామని ఆయన హాసనలో తెలిపారు.

ఇవన్నీ సహజమే

కొత్తగా మంత్రివర్గం ఏర్పడినప్పుడు కొందరు నేతల్లో ఇటువంటి అసంతృప్తి సహజమేనని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై హుబ్బళ్లిలో శనివారం పేర్కొన్నారు. మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వారిలో ఎక్కువ మంది తన స్నేహితులే ఉన్నారని చెప్పారు. ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూనే అందరికీ న్యాయం చేకూర్చేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. మాజీ ప్రధాని కావడంతోనే దేవేగౌడతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యానని స్పష్టం చేశారు. ఆనంద్‌సింగ్‌, శ్రీరాములు, ఎం.టి.బి.నాగరాజ్‌, ప్రీతం గౌడ, ఇతర నేతలతో వ్యక్తిగతంగా సమావేశమైతే.. అందరి సమస్యలకు తెరపడుతుందని అన్నారు.

మొదటిసారి మంత్రులకు...

మొదటిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అరగ జ్ఞానేంద్రకు హోంశాఖను, కె.సునీల్‌కుమార్‌కు ఇంధనం, కన్నడ, సంస్కృతి శాఖను కేటాయించారు. మురుగేశ్‌ నిరాణికి ఇష్టమైన పరిశ్రమల శాఖ దక్కగా.. ఉమేశ్‌ కత్తికి ఆహార, పౌర సరఫరా శాఖతో పాటు, అటవీ శాఖ బాధ్యతలు అప్పగించారు. సీనియర్లు అశోక్‌, ఈశ్వరప్ప ఇప్పటి వరకు నిర్వహించిన రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి పంచాయతి రాజ్‌ శాఖలనే మరోసారి దక్కించుకున్నారు. ఒక గుత్తేదారు నుంచి నగదు డిమాండ్‌ చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న శశికళ జొల్లెకు దేవాదాయ, హజ్‌, వక్ఫ్‌ శాఖలు అప్పగించారు. మంత్రివర్గ విస్తరణలో మరో నలుగురికి అవకాశం దక్కనుంది. ఆ సమయంలో అదనపు శాఖలు ఉన్న వారు, వాటికి కొత్తగా బాధ్యతలు చేపట్టే వారికి అప్పగిస్తారు.

●●ఈశ్వరప్పకు పల్లె.. బైరతికి పట్నం

కర్ణాటక కొత్త మంత్రివర్గం

ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై మంత్రివర్గంలో సభ్యులుగా ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేసిన వారికి శాఖలను కేటాయించారు. ముఖ్యమంత్రి తన వద్ద ఆర్థిక, డీపీఏఆర్‌, హోంశాఖలోని నిఘా విభాగం, క్యాబినెట్‌ వ్యవహారాలు, బెంగళూరు అభివృద్ధి, ఇతరులకు కేటాయించని శాఖలను ఉంచుకున్నారు. కొత్త మంత్రుల శాఖల కేటాయింపుపై గవర్నర్‌ థావర్‌ చంద్‌ గహ్లోత్‌ ఆమోద ముద్ర వేశారు. శాఖలు.. మంత్రుల వివరాలు ఇలా ఉన్నాయి..

  • గోవింద కారజోళ- భారీ, మధ్యతరహానీటి పారుదల
  • కె.ఎస్‌.ఈశ్వరప్ప - గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌
  • ఆర్‌.అశోక్‌ - రెవెన్యూ (ముజరాయి మినహాయించి)
  • బి.శ్రీరాములు - రవాణా, ఎస్టీ సంక్షేమం
  • వి.సోమణ్ణ - గృహ నిర్మాణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి
  • ఉమేశ్‌ కత్తి - అటవీ, ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు
  • ఎస్‌.అంగార - మత్స్య, నౌకాశ్రయం, అంతర్గత రవాణా
  • జె.సి.మాధు స్వామి- చిన్న నీటిపారుదల, న్యాయ, పార్లమెంటరీ, శాసన వ్యవహారాలు
  • అరగ జ్ఞానేంద్ర- హోం (నిఘా విభాగం మినహాయించి)
  • డాక్టర్‌ అశ్వత్థ నారాయణ - ఉన్నత విద్య, ఐటీ, బీటీ, సైన్స్‌-టెక్నాలజీ, నైపుణ్య అభివృద్ధి
  • సి.సి.పాటిల్‌- ప్రజా పనుల శాఖ
  • ఆనంద్‌ సింగ్‌- పరిసర, పర్యావరణం, పర్యాటకం
  • కోటా శ్రీనివాస పూజారి - సాంఘిక సంక్షేమం, వెనుకబడిన వర్గాల సంక్షేమం
  • ప్రభు చౌహాన్‌- పశు సంవర్థక
  • మురుగేశ్‌ రుద్రప్ప నిరాణి- భారీ, మధ్యతరహా పరిశ్రమలు
  • శివరాం హెబ్బార్‌ - కార్మిక
  • ఎస్‌.టి.సోమశేఖర్‌- సహకారం
  • బి.సి.పాటిల్‌- వ్యవసాయం
  • భైరతి బసవరాజ- నగరాభివృద్ధి (బీడీఏ, జలమండలి, బెంగళూరు పాలికె, బిఎంఆర్‌సిఎల్‌, నగర ప్రణాళిక అభివృద్ధి మినహాయించి)
  • కె.సుధాకర్‌ - ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య
  • కె.గోపాలయ్య - ఎక్సైజ్‌ విభాగం
  • శశికళ జొల్లె - ముజరాయి, హజ్‌, వక్ఫ్‌
  • ఎం.టి.బి.నాగరాజ్‌ - మునిసిపల్‌ పాలన వ్యవహారాలు, చిన్న తరహా పరిశ్రమలు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు
  • నారాయణ గౌడ - పట్టుపరిశ్రమ, యువజన సేవలు, క్రీడలు
  • బి.సి.నాగేశ్‌- ప్రాథమిక విద్య, సకాల
  • వి.సునీల్‌ కుమార్‌- ఇంధనం, కన్నడ, సంస్కృతి
  • హాలప్ప ఆచార్‌- గనులు, భూవిజ్ఞానం, స్త్రీ, శిశు సంక్షేమం, దివ్యాంగులు, సీనియరు సిటిజన్ల సాధికారత
  • శంకర్‌ పాటిల్‌- చేనేత, జవళి శాఖ, చక్కెర అభివృద్ధి మండలి
  • మునిరత్న- ఉద్యానం, ప్రణాళిక, గణాంకాల శాఖ

రాజీనామాకైనా సిద్ధమే- మంత్రి ఆనంద్‌సింగ్‌ వెల్లడి

మంత్రి ఆనంద్‌ సింగ్‌

'నాకు పట్టింపు ఎక్కువ. కావల్సింది లభించే వరకు పోరాడే లక్షణం ఉంది. నాకు అన్యాయం జరిగితే ఏం చేస్తానో ఇప్పడే చెప్పను. కేంద్రంలో అమిత్‌ షా, ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై చాణుక్యులు. ముఖ్యమంత్రి నాకు అత్యంత ఆప్తులు. నా కోరికను ఏ విధంగా మన్నిస్తారో అన్నది చూస్తా. ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయంపై భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది' అని పర్యాటక శాఖ మంత్రి బి.ఎస్‌.ఆనంద్‌సింగ్‌ వ్యాఖ్యానించారు. శాఖల కేటాయింపు ప్రకటన వెలువడిన అనంతరం మంత్రి ఆనంద్‌సింగ్‌ శనివారం బళ్లారిలో విలేకరులతో మాట్లాడుతూ తన అసంతృప్తి వ్యక్తం చేశారు. నాయకత్వ మార్పు సందర్భంగా శాఖపై తన అభిప్రాయం తీసుకున్నా, దానికి అనుగుణంగా కేటాయించకపోవడం నిరాశ మిగిల్చిందన్నారు. రాష్ట్రంలో భాజపా ప్రభుత్వ ఏర్పాటుకు కారకుడినైన తనకు నచ్చిన శాఖ కోరే హక్కు ఉందని తేల్చి చెప్పారు. ఆదివారం బెంగళూరులో ముఖ్యమంత్రిని కలిసి శాఖ మార్చమని కోరతాను. అప్పటికీ స్పందించక పోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం నాకే 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' ఇవ్వాలి. శాఖ కేటాయింపు తీరు చూస్తుంటే పార్టీ తనను నిర్లక్ష్యం చేసిన భావన కలుగుతోంది. బళ్లారి, విజయనగర జిల్లాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రజలతో సంబంధం ఉండే శాఖ కేటాయించాలని కోరాను. పార్టీ అంతర్గత విషయాలపై మాధ్యమ ప్రతినిధుల ముందుకు వెళ్లకూడదని అధిష్ఠానం సూచించింది. తన బాధను మీడియా ద్వారా ముఖ్యమంత్రికి తెలియజేయాలని ఇలా మాట్లాడుతున్నట్లు తెలిపారు. అవినీతిపరుడిని కాదు. పార్టీకి ఎలాంటి మచ్చ తీసుకురాలేదు. ప్రజల ఆశీర్వాదంతో క్షేత్రంలో అత్యుత్తమ సేవ చేస్తున్నాను. నన్ను ఎందుకు నిర్లక్ష్యం చేశారో ఇప్పటికీ తెలియదు. నాలో ఎలాంటి లోపం ఉంది? అవినీతిపరుడినా? అన్న ప్రశ్న ముఖ్యమంత్రినే అడుగుతానన్నారు. గతంలో ముఖ్యమంత్రి యడియూరప్ప తొలుత అటవీశాఖ ఇచ్చారు. అనంతరం పర్యాటక శాఖ కేటాయించారు. మరోసారి పరిసర, మౌలిక వసతుల శాఖ అప్పగించారని ఆనంద్‌సింగ్‌ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:కర్ణాటక నూతన సీఎం రాజకీయ ప్రస్థానమిదే..

ABOUT THE AUTHOR

...view details