తెలంగాణ

telangana

By

Published : Oct 31, 2021, 5:02 PM IST

ETV Bharat / bharat

'ఆమెకు తెలుసు చంపేస్తారని.. అయినా ఏనాడూ తలొగ్గలేదు'

మాజీ ప్రధాని, తన నానమ్మ ఇందిరా గాంధీని హత్య చేస్తారని ఆమెకు తెలుసని, అయినా ఏనాడూ వెనక్కి తగ్గలేదని అన్నారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ. ఉత్తర్​ప్రదేశ్​లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రియాంక కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాణాలు పోయినా భాజపాతో కలిసి పనిచేసేది లేదని తేల్చిచెప్పారు.

I will die but never have any kind of relationship with BJP
ప్రియాంకా గాంధీ, ఇందిరా గాంధీ, priyanka gandhi

ఉత్తర్​ప్రదేశ్​ గోరఖ్​పుర్​లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. తన నానమ్మ, దేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయబోమని, ఇందిరా గాంధీ తమకు అదే నేర్పించారని అన్నారు.

ప్రియాంక ఎన్నికల ర్యాలీలో జనం

''హత్య చేస్తారని ఆమెకు(మాజీ ప్రధాని ఇందిరా గాంధీ) తెలుసు. కానీ ఎప్పుడూ తలొగ్గలేదు. మీరు ఆమెపై ఉంచిన విశ్వాసం కంటే ఏదీ ఎక్కువ కాదని తనకు తెలుసు. ఆమె నేర్పించిన పాఠాలతోనే.. నేను ఈ రోజు మీ ముందు నిల్చున్నా. నేను కూడా మీ నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ముచేయను.''

- ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి

ప్రాణాలు పోయినా..

'ప్రాణాలైనా ఇస్తా కానీ.. భాజపాతో ఎలాంటి సంబంధం పెట్టుకొనేది లేదు' అని ప్రియాంక తేల్చి చెప్పారు. యూపీలో దళితులు, ఓబీసీలు, పేదవాళ్లు, మైనార్టీలు, బ్రాహ్మణులను యోగి ఆదిత్యనాథ్​ ప్రభుత్వం దోచుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రంలో గురు గోరఖ్​నాథ్​ బోధనలకు విరుద్ధంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని దుయ్యబట్టారు. యోగి హయాంలో ప్రజలపై దాడులు బాగా పెరిగిపోయాయని అన్నారు ప్రియాంక. ఉత్తర్​ప్రదేశ్​లో నిరుద్యోగం ఎక్కువైందని, విద్యార్థుల ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

''కాంగ్రెస్​ ప్రభుత్వం రైల్వేలు, విమానాశ్రయాలు, రోడ్లు నిర్మించింది. ఇప్పుడు భాజపా వాటిని అమ్ముకుంటోంది. 70 ఏళ్లలో కాంగ్రెస్​ ఏం చేసిందని వారు అడుగుతున్నారు. ఇన్నేళ్లలో మేం సంపాదించింది భాజపా ఏడేళ్లలో పోగొట్టింది.''

- ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి

కటౌట్లలో పటేల్​..

ఈ ఎన్నికల ప్రచారం కోసం ఏర్పాటు చేసిన కటౌట్లలో సర్దార్​ పటేల్​ ఫ్లెక్సీలు కూడా పెట్టడం విశేషం. ప్రియాంక గాంధీ, ఇందిరా గాంధీ కటౌట్ల వెంబడి భారీ ఎత్తులో.. భారత తొలి ఉపప్రధాని పటేల్​ కటౌట్​ ఉంచడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్​ గాంధీ కటౌట్లు లేకపోవడం గమనార్హం.

ప్రియాంక, ఇందిరా గాంధీ కటౌట్ల వెంబడి సర్దార్​ పటేల్​ ఫ్లెక్సీ

ఆదివారం సర్దార్​ పటేల్​ జయంతి సందర్భంగానే.. ఇలా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

ఇవీ చూడండి:మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి రాహుల్​ నివాళులు

'పటేల్ స్ఫూర్తితోనే భారత్ అన్ని సవాళ్లు ఎదుర్కోగలుగుతోంది'

ABOUT THE AUTHOR

...view details