కరోనా టీకాకు సంబంధించి ఎలాంటి అపోహలు అవసరంలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ లోక్సభ వేదికగా మరోసారి భరోసా ఇచ్చారు. శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
"ప్రతి టీకాకు యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ అవసరం లేదు. మొదట వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, తరవాత 60ఏళ్లు పైబడిన(45ఏళ్లు దాటి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి) వారికి టీకాలు అందిస్తున్నాం. నిపుణుల సూచనల ఆధారంగా రానున్న రోజుల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తాం. భారతీయ నిపుణులు సహా ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణులతోనూ సంప్రదింపులు జరిపాం."
- హర్షవర్ధన్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి
'వైద్య నిపుణులు చెప్పిన సూచనల ప్రకారం.. దేశంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వాల్సిన పని లేదు. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా. వైరస్ తీరును అనుసరించి.. టీకా కార్యక్రమంలో మార్పులు ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కరు టీకాకు సంబంధించి ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు' అని హర్షవర్ధన్ అన్నారు.
కరోనా వ్యాక్సినేషన్లో ఇప్పటివరకు 3,93,39,817 మందికి కేంద్రం టీకాలు పంపిణీ చేసింది కేంద్రం. జనవరి 16న ఈ కార్యక్రమం ప్రారంభం కాగా.. అర్హులైన కొందరిలో నెలకొన్న భయాలు, ఒకసారి టీకా వయల్ను ఓపెన్ చేసిన వెంటనే నిర్దేశిత సమయంలో అందించాల్సి రావడం వంటి పరిమితుల కారణంగా టీకా వృథా అవుతోంది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీయే దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:కొవిడ్ విజృంభణ-కొత్తగా 40వేల కేసులు