తెలంగాణ

telangana

By PTI

Published : Nov 14, 2023, 4:25 PM IST

Updated : Nov 14, 2023, 9:52 PM IST

ETV Bharat / bharat

'దీపావళి లైటింగ్​ కోసం కరెంట్ దొంగతనం చేసిన మాజీ సీఎం!'- కుమారస్వామిపై కాంగ్రెస్​ సెటైర్స్

HD Kumaraswamy Electricity Theft : జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి దీపావళి సందర్భంగా తన ఇంటి లైటింగ్​ కోసం అక్రమంగా విద్యుత్​ను వాడుకున్నారని కాంగ్రెస్ విమర్శించింది. కుమారస్వామి ఇంత పేదరికంలో ఉండడం బాధాకరమని ఎద్దేవా చేసింది. ఈ వ్యాఖ్యలపై కుమారస్వామి ఏమన్నారంటే?

hd kumaraswamy electricity theft
hd kumaraswamy electricity theft

HD Kumaraswamy Electricity Theft : దీపావళి సందర్భంగా తన ఇంటి వద్ద విద్యుత్ దీపాలను వెలిగించేందుకు జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్​డీ కుమారస్వామి అక్రమంగా కరెంట్​ను వాడుకున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రపంచంలోనే ఏకైక నిజాయితీపరుడైన కుమారస్వామి నివాసం నేరుగా అక్రమ విద్యుత్​ కనెక్షన్​తో వెలిగిపోయిందని ఎక్స్​ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించింది. కరెంట్​ను దొంగిలించేంత పేదరికం మాజీ సీఎంకు పట్టడం బాధాకరమని ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ పార్టీ 'గృహ జ్యోతి' పథకం అర్హులకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందజేస్తుందని.. 2,000 యూనిట్లు కాదని వ్యాఖ్యానించింది. బెంగళూరు జేపీ నగర్​లో కుమారస్వామి నివాసానికి దీపావళి సందర్భంగా లైటింగ్ పెట్టి.. ఇంట్లోని మీటర్​కు బదులుగా పక్కనున్న కరెంట్ స్తంభం నుంచే నేరుగా కనెక్షన్​ ఇచ్చిన వీడియోను ఎక్స్​లో పోస్ట్ చేసింది కాంగ్రెస్.

"కుమారస్వామి పేదరికంలో ఉంటే 'గృహ జ్యోతి' పథకానికి దరఖాస్తు చేసి ఉండాల్సింది. ఓహో గృహజ్యోతి పథకం కింద ఒక విద్యుత్ మీటర్ మాత్రమే అనుమతిస్తారు. ఈ విషయం మీకు తెలియదు కదా. మీ పేరు మీద చాలా మీటర్లు ఉన్నాయి. అందుకే మీరు గృహ జ్యోతి పథకానికి అర్హులు కారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉన్నప్పటికీ.. రైతులకు 7గంటల కరెంట్​ను కాంగ్రెస్ అందిస్తోంది. కుమారస్వామి విలేకరుల సమావేశం పెట్టి.. కర్ణాటక అంధకారంలో ఉంది అని చెప్పి.. ఇప్పుడు దొంగ కరెంట్​తో ఆయన ఇంటి విద్యుత్ దీపాలను వెలిగించలేదా? కుమారస్వామి ఇల్లు దీపాల కాంతులతో మెరిసిపోతుంటే.. రాష్ట్రం అంధకారంలో ఉందని ఎందుకు చెబుతున్నారు?" అని కాంగ్రెస్​ ఎక్స్ వేదికగా కుమారస్వామిపై విమర్శలు గుప్పించింది. మరోవైపు.. బెంగళూరు విద్యుత్ సరఫరా సంస్థ కుమారస్వామిపై చర్యలు తీసుకుంటుందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. కుమారస్వామిపై కేసు నమోదు చేస్తారో? లేదో మాత్రం తనకు తెలియదన్నారు.

నాకు తెలియదు..
కాంగ్రెస్ ఆరోపణలపై జేడీఎస్ నాయకుడు కుమారస్వామి స్పందించారు. ఇంటికి విద్యుత్ స్తంభం నుంచి నేరుగా కనెక్షన్ ఇచ్చారని తొలుత తనకు తెలియదన్నారు కుమారస్వామి. తెలిసిన వెంటనే దాన్ని తొలగించి.. ఇంటి కరెంట్ మీటర్​కు కనెక్షన్ ఇచ్చినట్లు తెలిపారు. ఈ విషయంలో తనది తప్పుకాదన్నారు. "బెంగళూరు విద్యుత్ సరఫరా సంస్థ అధికారులు వచ్చి తనిఖీ చేసి నాకు నోటీసు జారీ చేయనివ్వండి. నేను జరిమానా చెల్లిస్తాను. నేను ఎలాంటి ప్రభుత్వ ఆస్తులను అపహరించలేదు. ఎవరి భూమిని లాక్కోలేదు." అని కుమారస్వామి స్పష్టం చేశారు.

కుమారస్వామిపై కేసు నమోదు..
దీపావళి సందర్భంగా తన ఇంటి వద్ద విద్యుత్ దీపాలను వెలిగించేందుకు అక్రమంగా కరెంట్​ను వాడుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామిపై బెంగళూరు విద్యుత్ సరఫరా సంస్థ (బెస్కామ్) జయనగర్‌ విజిలెన్స్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కుమారస్వామిపై పోలీసులు ఎఫ్​ఐఆర్ నమోదు చేశారు.

గుర్రాలపై నిల్చొని స్వారీ- ఔరా అనిపించేలా నిహాంగ్ సిక్కుల విన్యాసాలు

'ఆఫీస్​లో దుష్టశక్తి'- ప్రభుత్వ ఉద్యోగుల ప్రార్థనలు- దర్యాప్తునకు ఆదేశించిన కలెక్టర్ కృష్ణతేజ

Last Updated : Nov 14, 2023, 9:52 PM IST

ABOUT THE AUTHOR

...view details