తెలంగాణ

telangana

By

Published : Dec 14, 2021, 3:48 PM IST

ETV Bharat / bharat

'ఆ పరీక్ష రాసిన సీబీఎస్​ఈ విద్యార్థులకు ఫ్రీగా మార్కులు'- నిజమెంత?

CBSE Accountancy Paper News: 12వ తరగతి అకౌంటెన్సీ ప్రశ్నాపత్రంపై సోషల్​మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని సీబీఎస్​ఈ స్పష్టం చేసింది. ఆ వార్తలను నమ్మొద్దని సూచించింది. అకౌంటెన్సీ పేపర్​లో తప్పుల కారణంగా విద్యార్థులకు అదనంగా ఆరు మార్కులు కేటాయిస్తామంటూ ఓ ఆడియో వైరల్ కాగా.. సీబీఎస్​ఈ ఈ ప్రకటన చేసింది.

CBSE Accountancy Paper
సీబీఎస్​ఈ ప్రశ్నాపత్రం

CBSE Accountancy Paper News: 12వ తరగతి అకౌంటెన్సీ ప్రశ్నాపత్రంలో తప్పులు ఉండటం వల్ల విద్యార్థులకు అదనంగా ఆరు మార్కులు కేటాయిస్తామంటూ వస్తున్న వార్తలను నమ్మొద్దని సీబీఎస్​ఈ స్పష్టం చేసింది. ఇలాంటి అసత్య వార్తల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

"సీబీఎస్​ఈ కంట్రోలర్ ఆఫ్​ ఎగ్జామినేషన్స్​ పేరుతో సామాజిక మాధ్యమాల్లో ఓ ఆడియో చక్కర్లు కొట్టడం మా దృష్టికి వచ్చింది. డిసెంబరు 13న జరిగిన అకౌంటెన్సీ ప్రశ్నాపత్రంలో తప్పులు ఉండటం కారణంగా ఆరు మార్కులు విద్యార్థులకు కేటాయిస్తాం అని ఆడియోలో ఉంది." అని సీబీఎస్​ఈ అధికారిక ప్రకటనలో తెలిపింది.

ఆడియోలో ఉన్న కంటెంట్ పూర్తిగా నిరాధారమైనవి, అసత్యమైనవని బోర్డు పేర్కొంది. సీబీఎస్​ఈ బోర్టు అసలు ఇలాంటి నిర్ణయమే తీసుకోలేదని స్పష్టం చేసింది. ప్రజలు ఇలాంటి నకిలీ వార్తల మాయలో పడొద్దని సూచించింది.

ఆడియోలో ఏముందంటే..?

సోషల్ ​మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆడియోలో " విద్యార్థులారా బాధపడకండి. అకౌంటెన్సీ పేపర్​లో మీరు 28 నుంచి 31 ప్రశ్నలకు సరైన సమాధానాలు అందిస్తే.. మీకు దాదాపు 38 మార్కులు వస్తాయి. సీబీఎస్​ఈ అదనంగా ఆరు మార్కులు విద్యార్థులకు కేటాయిస్తుంది."అని ఉంది.

ఆంగ్ల ప్రశ్నాపత్రంపై రగడ..

పదో తరగతి ఇంగ్లీష్​ పరీక్ష ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ఓ వ్యాసం వివాదానికి దారితీసిన తర్వాత.. ఇలాంటి ఆడియో వైరల్ కావడం గమనార్హం. శనివారం నిర్వహించిన ఈ పరీక్ష ప్రశ్నాపత్రంలో 'మహిళా విమోచనం వల్ల పిల్లలపై తల్లిదండ్రుల అదుపాజ్ఞలు దెబ్బతింటున్నాయి', 'భర్త అడుగుజాడల్లో నడవడం ద్వారానే ఒక తల్లి తన పిల్లల నుంచి విధేయత వంటివాటిని పొందగలుగుతుంది' వంటి అంశాలున్నాయి.

CBSE English Paper Controversy: ఇంగ్లీష్​ ప్రశ్నాపత్రంపై వివాదం చెలరేగిన నేపథ్యంలో సీబీఎస్​ఈ చర్యలు చేపట్టింది. 10వ తరగతి ఇంగ్లీష్​ పరీక్ష నుంచి కాంప్రహెన్షన్​​ ప్యాసేజీలోని ప్రశ్నలను తొలగించింది. విద్యార్థులకు పూర్తి మార్కులు ఇస్తున్నట్టు ప్రకటించింది.

భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు మరోసారి తలెత్తకుండా ఓ నిపుణుల బృందాన్ని సైతం ఏర్పాటు చేస్తున్నట్లు సీబీఎస్​ఈ ప్రకటించింది.

ఇదీ చూడండి:CBSE English Paper Controversy: వివాదాస్పద ప్రశ్న తొలగించిన సీబీఎస్‌ఈ

ABOUT THE AUTHOR

...view details