తెలంగాణ

telangana

By

Published : Jan 5, 2021, 2:34 PM IST

Updated : Jan 5, 2021, 3:20 PM IST

ETV Bharat / bharat

'కిసాన్‌ పరేడ్‌' కోసం ట్రాక్టర్‌ ఎక్కిన మహిళలు

గణతంత్ర దినోత్సవం నాడు దిల్లీలో నిర్వహించనున్న 'కిసాన్ పరేడ్​'లో మహిళలు సైతం పాల్గొననున్నారు. ఇందుకోసం ట్రాక్టర్ డ్రైవింగ్ కూడా నేర్చుకుంటున్నారు. భారతీయ కిసాన్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో 500 మందికి పైగా మహిళలు ట్రాక్టర్లు నడపటంలో శిక్షణ తీసుకుంటున్నారు.

women tractor parade
'కిసాన్‌ పరేడ్‌' కోసం ట్రాక్టర్‌ ఎక్కిన మహిళలు

సాగు చట్టాలపై తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించకపోవడం వల్ల ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు సిద్ధమయ్యారు రైతులు. ఇందులో భాగంగానే గణతంత్ర దినోత్సవం నాడు దేశ రాజధానిలో 'కిసాన్‌ పరేడ్‌' పేరుతో భారీ ట్రాక్టర్‌ ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. ఈ పరేడ్‌లో మహిళలు కూడా భాగస్వాములు కానున్నారు. ఇందుకోసం వారు ట్రాక్టర్‌ డ్రైవింగ్‌ నేర్చుకుంటున్నారు.

హరియాణాలోని జింద్‌లో భారతీయ కిసాన్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో 500 మందికి పైగా మహిళలు ట్రాక్టర్లు నడపటంలో శిక్షణ తీసుకుంటున్నారు. వీరంతా బుధవారం కుండ్లీ-మనేసర్‌-పల్వాల్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై ర్యాలీ చేపట్టనున్నారు. జనవరి 26న దిల్లీలో చేపట్టే కిసాన్‌ పరేడ్‌లో వీరంతా ట్రాక్టర్లు నడుపుతూ ఆందోళనల్లో పాల్గొంటారని కిసాన్‌ యూనియన్‌ జిల్లా నాయకులు తెలిపారు. మహిళలు డ్రైవింగ్‌ చేస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇప్పటికే దిల్లీ శివారుల్లో కొనసాగుతున్న ఉద్యమంలోనూ పలువురు మహిళలు పాల్గొంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తాము వెనక్కి తగ్గేది లేదని, చట్టాలు రద్దు చేసేదాకా సరిహద్దుల నుంచి వెళ్లబోమని మహిళా రైతులు చెబుతున్నారు.

అటు.. సాగు చట్టాలపై కేంద్రం, రైతు సంఘాల ప్రతినిధుల మధ్య సోమవారం జరిగిన ఏడో విడత చర్చలు విఫలమయ్యాయి. చట్టాలను రద్దు చేయడం కుదరదని, అయితే అందులో సవరణలు చేస్తామని కేంద్ర మంత్రులు సవివరంగా చెప్పారు. కానీ రైతు నాయకులు ఇందుకు అంగీకరించలేదు. రద్దు చేయాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో ఎలాంటి పురోగతి లభించలేదు. దీంతో చర్చలు జనవరి 8కి వాయిదా వేశారు.

ఇదీ చదవండి:మళ్లీ తెరపైకి 'మిస్టరీ'- మోదీ, దీదీ మధ్యలో 'నేతాజీ'

Last Updated : Jan 5, 2021, 3:20 PM IST

ABOUT THE AUTHOR

...view details