బంగాల్లో భాజపా నిరసనలు మరింత ఉద్రిక్తంగా మారాయి. హావ్డా వంతెనపై ఆందోళన చేస్తున్న భాజపా కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. జల ఫిరంగులు ప్రయోగించి ఆందోళకారులను చెదరగొట్టారు.
బంగాల్లో ఉద్రిక్తత- భాజపా శ్రేణులపై లాఠీఛార్జ్
15:53 October 08
14:34 October 08
పశ్చిమబంగాల్లో భాజపా కార్యకర్తలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఆ పార్టీ చేపట్టిన ‘నవన్నా చలో’ యాత్ర ఉద్రిక్తంగా మారింది. బంగాల్ సచివాలయం ‘నవన్నా’ను ముట్టడించేందుకు వెళ్తున్న భాజపా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు.
రాష్ట్రంలో గత కొంతకాలంగా భాజపా కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఆ పార్టీ నేడు బంగాల్ వ్యాప్తంగా ‘నవన్నా చలో’ ఆందోళనకు పిలుపునిచ్చింది. ప్రధానంగా కోల్కతా, హౌరాలో భారీ ర్యాలీలు చేపట్టింది. కోల్కతా, హౌరా నుంచి వేలాది మంది భాజపా కార్యకర్తలు సచివాలయాన్ని ముట్టడించేందుకు వచ్చారు. అయితే సచివాలయం సమీపంలో పోలీసులు వీరిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి తీవ్రంగా మారడంతో పోలీసులు భాజపా కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేశారు. బాష్పవాయువు, జలఫిరంగులను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఘర్షణల్లో భాజపా ఎంపీ జ్యోతిర్మయి సింగ్ మహతో, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజు బెనర్జీ, పలువురు కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి.
కాగా.. భాజపా ర్యాలీకి అధికార తృణమూల్ ప్రభుత్వం బుధవారం అనుమతి నిరాకరించింది. కొవిడ్ కారణంగా ఎలాంటి ఆందోళనలు చేయొద్దని, ఒకవేళ ర్యాలీలు చేయాల్సి వస్తే కేవలం 100 మంది మాత్రమే ఉండాలని సూచించింది. అయినప్పటికీ భాజపా ఆందోళన చేపట్టడంతో పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు శానిటైజేషన్ నిమిత్తం బంగాల్ సచివాలయాన్ని నేటి నుంచి రెండు రోజుల పాటు మూసివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
14:02 October 08
ఆందోళనలు ఉద్రిక్తం..
తమ కార్యకర్తల హత్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా భాజపా ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. హావ్డా వద్ద రోడ్లపై టైర్లు తగలబెట్టారు.
13:47 October 08
పోలీసులు తమపై లాఠీఛార్జ్ చేయడాన్ని భాజపా శ్రేణులు తప్పుబట్టాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి శాంతియుతంగా చేపట్టిన నిరసనలను మమతా సర్కార్ హింసాత్మకంగా మార్చాలని చూస్తోందని మండిపడ్డాయి. పోలీసులు, గూండాలు కలిసి తమపైకి రాళ్లు రువ్వారని భాజపా నేత కైలాశ్ విజయవార్గియా ఆరోపించారు.
13:19 October 08
లైవ్ అప్డేట్స్: బంగాల్లో ఉద్రిక్తత.. భాజపా కార్యకర్తలపై లాఠీఛార్జ్
బంగాల్లో భాజపా కార్యకర్త హత్యను నిరసిస్తూ ఆ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. కోల్కతాలో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. జల ఫిరంగులు, బాష్పవాయువు ప్రయోగించారు.