తెలంగాణ

telangana

By

Published : Mar 25, 2019, 7:26 PM IST

ETV Bharat / bharat

పార్లమెంటులో చోటుకు 'రాణి' వాసం తప్పనిసరి!

ఆ రాష్ట్రంలో 25 లోక్​సభ నియోజకవర్గాలు. స్వాతంత్ర్యం వచ్చాక 14సార్లు ఎన్నికలు జరిగాయి. ఇన్ని దశాబ్దాల్లో దిగువసభకు ఆ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించింది మాత్రం 28మంది మహిళలే. వారిలో దాదాపు అందరూ రాజకుటుంబీకులు లేదా అత్యంత ఉన్నత కుటుంబాలకు చెందినవారే. వినేందుకు ఆసక్తికరంగా ఉన్న ఈ విషయం... మహిళా రిజర్వేషన్​ ఆవశ్యకతను తెలియచెబుతోంది.

లోక్​సభ ఎన్నికల్లో రాజస్థాన్​లో మహిళల పోటీ అంతంతమాత్రమే

లోక్​సభ ఎన్నికల్లో రాజస్థాన్​లో మహిళల పోటీ అంతంతమాత్రమే
వసుంధ రాజే.... రాజస్థాన్​ మాజీ ముఖ్యమంత్రి. ప్రధాన ప్రతిపక్షం భాజపాకు ఆ రాష్ట్రంలో ఉన్న కీలక నేతల జాబితాలో మొదటి పేరు ఆమెదే. ఆ రాష్ట్ర రాజకీయాల్లో అంతటి శక్తిమంతమైన, అందరికీ సుపరిచితమైన మహిళ ఇంకెవరైనా ఉన్నారా అంటే... మౌనమే సమాధానం. రాజస్థాన్​ నుంచి లోక్​సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ ఇద్దరు మహిళల పేర్లు చెప్పమని అడిగినా కష్టం. ఎందుకంటే... జాతీయ రాజకీయాల్లో ఆ రాష్ట్ర మహిళల పాత్ర చాలా చాలా తక్కువ.

14 ఎన్నికలు.. 180 మంది

రాజస్థాన్​లో ఉన్న లోక్​సభ స్థానాలు 25. 1952 నుంచి రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికలు జరిగింది 14సార్లు. ఈ ఎన్నికల్లో మొత్తం పోటీ చేసిన మహిళల సంఖ్య 180. వారిలోనూ చాలాసార్లు పోటీకి దిగినవారే ఎక్కువ. వీరిలో ఇప్పటివరకు లోక్​సభకు ఎన్నికైంది 28 మంది మహిళలే.

1952లో అత్యల్పం.. 2009లో కాస్త నయం

1952లో జరిగిన లోక్​సభ ఎన్నికల్లో రాజస్థాన్​ మొత్తం మీద ఇద్దరు మహిళలే బరిలో నిలిచారు. వారు... శారదాబాయి, దేవీ భార్గవ. కానీ వారికి డిపాజిట్లయినా దక్కలేదు.

1952- 1989 మధ్య జరిగిన లోకసభ ఎన్నికల్లో పోటీకి నిలిచిన మహిళలు ఆరుగురే.

2009లో 31 మంది మహిళా అభ్యర్థులు బరిలోకి దిగారు.

వసుంధర రాజే మాత్రమే...

రాజస్థాన్​ ముఖ్యమంత్రిగా 2003 నుంచి 2008, 2013 నుంచి 2018 వరకు పని చేశారు భాజపా మహిళా నేత వసుంధర రాజే. ఆమె 1989 నుంచి ఝలావర్​ లోక్​సభ స్థానం నుంచి ఐదుసార్లు పోటీ చేసి గెలుపొందారు.

స్వతంత్ర పార్టీ నేత గాయత్రీదేవీ, కాంగ్రెస్​ నేత గిరిజా వ్యాస్​ లోక్​సభ ఎన్నికల్లో చాలాసార్లు పోటీకి దిగారు.

అత్యధికం నలుగురే..

రాజస్థాన్​లోని లోక్​సభ స్థానాలకు పోటీ చేసే మహిళల సంఖ్యే కాదు... వారు గెలిచిన సందర్భాలూ చాలా తక్కువ. ఇప్పటివరకు 180 మంది మహిళలు పోటీకి దిగితే... వారిలో 125 మందికి కనీసం డిపాజిట్​ అయినా దక్కలేదు. 1991, 1996 ఎన్నికల్లో మాత్రమే రాజస్థాన్ నుంచి నలుగురు మహిళలు లోక్​సభకు ఎన్నికయ్యారు.

77శాతం ఓట్లు ఆమెకే..

రాజస్థాన్​లోని ధనిక కుటుంబానికి చెందిన మహిళ గాయత్రీ దేవి 1962 లోక్​సభ ఎన్నికల్లో జైపూర్​ స్థానం నుంచి పోటీకి దిగారు. ఆ ఎన్నికల్లో ఆమె 77.08శాతం ఓట్లతో ఘన విజయం సాధించారు. జైపూర్​ నుంచి ఎంపీగా మూడుసార్లు గెలిచారు గాయత్రి.

ధనికులే అధికులు

రాజస్థాన్​ లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన మహిళల్లో ఎక్కువ మంది ధనిక కుటుంబాల నుంచి వచ్చినవారే. 1971లో జోధ్​పూర్​ స్థానం నుంచి గెలుపొందిన కృష్ణకుమారి, 1991లో భరత్​పూర్​లో విజయం సాధించిన కృష్ణేంద్ర కౌర్​, అక్కడే 1996లో గెలుపొందిన దివ్యసింగ్​, 1991 ఎన్నికల్లో అల్వార్​ నుంచి లోక్​సభకు వెళ్లిన మహేంద్ర కుమారి సంపన్నులే.

కాంగ్రెస్ మహిళా​ నేత గిరిజా సింగ్​ ఏడుసార్లు లోక్​సభ ఎన్నికల్లో పోటీచేశారు. నాలుగు సార్లు గెలుపొందారు.

33% రిజర్వేషన్​ ఇంకెప్పుడు?

సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్షకు... ఎన్నికల అభ్యర్థుల సంఖ్య అద్దంపడుతోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు మహిళా ఉద్యమకారులు.

"పురుషాధిక్య సమాజం వల్ల రాజకీయాల్లో మహిళలకు ఎన్నో ఏళ్లుగా అవకాశాలు రావడం లేదు. హక్కులపై అవగాహన, అక్షరాస్యత పెరగడం వల్ల కొన్నేళ్ల నుంచి మహిళలు కొందరు రాజకీయాల్లోకి వస్తున్నారు. కానీ 33శాతం రిజర్వేషన్లు అనే అంశం వాస్తవానికి చాలా దూరంగానే ఉంది."
--సుమిత్రా సింగ్​, రాజస్థాన్​ అసెంబ్లీ మాజీ స్పీకర్​, 9 సార్లు ఎమ్మెల్యే

"ఎన్నికల్లో పోటీకి మహిళలు ముందుకు వస్తున్నారు. కానీ.. వారికి ఉన్న విజయావకాశాల్ని పరిగణనలోకి తీసుకునే రాజకీయ పార్టీలు టికెట్లు ఇస్తున్నాయి.
మహిళలకు ఎక్కువ స్థానాలు కేటాయించాలని కొన్ని రాజకీయ అంటున్నాయి. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్​ బిల్లు ఆమోదం పొందితేనే రాజకీయాల్లో అసలైన మార్పు వస్తుంది"
-- ఓం సైనీ, రాజకీయ విశ్లేషకులు

ABOUT THE AUTHOR

...view details