తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మాయం' కొత్త కాదు!

రఫేల్​ పత్రాలు మాయం! ఇప్పుడు దేశ రాజకీయాల్లో సంచలనం. కీలక కేసుకు సంబంధించిన పత్రాలు పోతాయా? అది కూడా రక్షణ శాఖ కార్యాలయం నుంచి? చరిత్ర చూస్తే... ఔననే సమాధానం వస్తుంది. అత్సవసర పరిస్థితి మొదలు... ఇష్రాత్​ జహాన్​ ఎన్​కౌంటర్​ వరకు... ఎన్నో కేసుల దస్త్రాలు మాయం కావడం గుర్తొస్తుంది.

By

Published : Mar 8, 2019, 5:47 PM IST

రఫేల్ యుద్ధ విమానం

రఫేల్​...! ఎన్నికలకు ముందు రాజకీయ దుమారం రేపుతున్న అంశం. విమాన కొనుగోలు ఒప్పంద​ పత్రాలు రక్షణ శాఖ కార్యాలయం నుంచి మాయమయ్యాయని ఇటీవల సుప్రీంకోర్టుకు నివేదించింది కేంద్రం. ఇంత కీలకమైన కేసులో పత్రాలు మాయం కావడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది అత్యున్నత న్యాయస్థానం.

రఫేల్​ పత్రాల మాయం... గతంలో జరిగిన సంఘటనలను గుర్తుకుతెచ్చింది. ఇంతకుముందు ఇలాంటి ఘటనలెన్నో జరిగాయి. అయోధ్య భూవివాదం కేసు, 1975 ఎమర్జెన్సీ, ఆర్టికల్​ 35-ఏ, బొగ్గు కుంభకోణం దస్త్రాలూ చోరీకి గురయ్యాయి.

రఫేల్​ ఒప్పందం

రఫేల్​ యుద్ధ విమానాలను ఫ్రాన్స్​ నుంచి కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకుంది భారత్. ఇందులో భారీ అవినీతి జరిగిందన్న విపక్షాల ఆరోపణ. కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​గాంధీ రఫేల్ మాట​ తీయని ప్రసంగం ఉండదంటే అతిశయోక్తి కాదు.

రఫేల్​ ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ దాఖలైన వ్యాజ్యాలను డిసెంబరు 14న కొట్టివేసింది సుప్రీంకోర్టు. ఈ తీర్పును పునఃసమీక్షించాలంటూ కేంద్ర మాజీ మంత్రులు పిటిషన్​ దాఖలు చేశారు. విచారణ సమయంలో కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్...​ పత్రాలు చోరీ అయ్యాయని తెలిపారు. వీటి ఆధారంగానే ఓ పత్రికలో కథనాలు ప్రచురించారని పేర్కొన్నారు. అనంతరం మార్చి 14కు విచారణ వాయిదా వేసింది కోర్టు.

అత్యయిక పరిస్థితి దస్త్రం

1975లో విధించిన అత్యవసర పరిస్థితికి సంబంధించిన దస్త్రాలు కనిపించకుండా పోయాయని 2012లో అప్పటి యూపీఏ ప్రభుత్వం పేర్కొంది. ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయంలోనే మాయమయ్యాయని, సమగ్ర అన్వేషణ జరిపినా వాటి జాడ తెలియలేదని తెలిపింది.

అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ, రాష్ట్రపతి ఫక్రుద్దీన్​ అలీ అహ్మద్​ మధ్య ఎమర్జెన్సీ ప్రకటనకు సంబంధించిన దస్త్రాలివి.

అయోధ్య వివాదం

రామజన్మభూమి- బాబ్రీమసీదు కేసులోనూ ఇదే పునరావృతమైంది. 2009లో ఈ కేసుకు సంబంధించిన 23 పత్రాలు పోయాయని, సీబీఐను జోక్యం చేసుకోవాల్సిందిగా అలహాబాద్​ హైకోర్టు ఆదేశించింది.
2000 సంవత్సరంలో అయోధ్య వివాదానికి సంబంధించిన దస్త్రాలతో దిల్లీకి వెళ్లే క్రమంలో ప్రత్యేకాధికారి సుభాశ్​భాన్​ సాద్​ రైలు ప్రమాదంలో మరణించారు. ఆ సమయంలో పత్రాలు మాయమయ్యాయి.

బొగ్గు కుంభకోణం

1993 నుంచి 2004 మధ్యలో బొగ్గు కుంభకోణానికి సంబంధించిన కీలక పత్రాలు కనిపించడం లేదని 2013 ఆగస్టులో అప్పటి బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీప్రకాశ్​ జైస్వాల్​ పేర్కొన్నారు.

''1993-2004 మధ్యలో బొగ్గు కుంభకోణానికి సంబంధించిన పత్రాలు తప్పిపోయిన మాట నిజం. ప్రయత్నాలు జరుగుతున్నాయి. సీఎంపీడీఐఎల్​, ఉక్కుశాఖతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఒకవేళ వారి వద్ద పత్రాలు ఉంటే, బహిర్గతం చేస్తారు.''
- శ్రీప్రకాశ్​ జైస్వాల్​, గనులశాఖ మాజీ మంత్రి

2006-09 మధ్య బొగ్గు గనుల కేటాయింపునకు సంబంధించిన ఐదు కీలక దస్త్రాల్లో అన్ని వివరాలు పేర్కొన్నప్పటికీ తమకు చేరలేదని 2017 జులై 31న తెలిపింది సీబీఐ. కానీ... మొత్తం కనిపించకుండా పోయినవి ఎన్నో సరైన సమాచారం లేదు.

నేతాజీ దస్త్రాలు

స్వాతంత్య్రసమరయోధుడు నేతాజీ సుభాష్​ చంద్రబోస్​కు సంబంధించిన రెండు కీలక పత్రాలు కనిపించకుండా పోయాయి.

నేతాజీ అదృశ్యం సంబంధిత పత్రాలు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి చోరీకి గురయ్యాయని హోంశాఖ సహాయమంత్రి కిరణ్​ రిజిజు 2016 ఏప్రిల్​ 26న లోక్​సభలో తెలిపారు.

నేతాజీ అస్థికలు టోక్యో నుంచి తెప్పించే ప్రతిపాదన, బోస్​ జ్ఞాపకంగా రెడ్​ఫోర్ట్​ వద్ద జాతీయ స్మారకం నిర్మించే ప్రతిపాదనకు సంబంధించిన పత్రాలు 'పీఎంఓ'లో కనిపించట్లేదని ఫిర్యాదు నమోదైంది.

ఆర్టికల్​ 35-ఏ

ఆర్టికల్​ 35-ఏ సంబంధిత చట్టపరమైన అభిప్రాయాన్ని సేకరించిన 63 ఏళ్ల నాటి దస్త్రం పీఎంఓ నుంచి మాయమైంది.

ఆర్టికల్​ 35-ఏ జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే చట్టం.

ఇష్రాత్​ జహాన్​ ఎన్​కౌంటర్​ దస్త్రం

ఇష్రాత్​ జహాన్​ ఎన్​కౌంటర్​కు సంబంధించిన దస్త్రం అదృశ్యమవటం 2016లో పెద్ద సంచలనమే.

2004 జూన్​ 15న ముంబయి సమీప ముంబ్రాలోని టీనేజర్​ ఇష్రాత్​, ఆమె స్నేహితుడు ప్రనేశ్​ పిళ్లై అలియాస్​ జావేద్​ షేక్​, మరో ఇద్దరు సిటీ క్రైమ్​ బ్రాంచ్​ అధికారుల చేతిలో ఎన్​కౌంటర్​ అయ్యారు. గుజరాత్​ హైకోర్టు పర్యవేక్షణలోని ప్రత్యేక దర్యాప్తు బృందం దీనిని నకిలీ ఎన్​కౌంటర్​గా పేర్కొని, సీబీఐకి బదిలీ చేసింది.

గుజరాత్​ హైకోర్టులో అటార్నీ జనరల్​ 2009లో వెల్లడించిన ప్రమాణపత్రం, మార్పులు చేసిన రెండో అఫిడవిట్​ ముసాయిదా పత్రాలు హోంమంత్రిత్వ శాఖ నుంచి అదృశ్యమయ్యాయి.
అప్పటి హోంశాఖ కార్యదర్శి జీకే పిళ్లై, దివంగత​ అటార్నీ జనరల్​ వాహనవతికి రాసిన రెండు లేఖలు... ముసాయిదా ప్రమాణపత్రం​ కాపీ కనిపించకుండాపోయాయి.

ABOUT THE AUTHOR

...view details