కేరళ కాసరగోడ్ జిల్లా అనంతపుర ఆలయ ప్రాంగణంలో ఓ మొసలి ఉంది. గుడి చుట్టూ ఉండే కొలనులో ఎప్పుడూ సేదతీరుతూ ఉంటుంది. పూజారి పెట్టే ఆహారాన్ని తీసుకుంటూ.. వచ్చిన భక్తులకు కనువిందు చేస్తోంది. దీనికి 'బాబియా' అనే పేరు కూడా ఉంది.
ఇలా వైరల్...
ఓ రోజు ఉదయం ఆలయ ప్రధాన పూజారి గర్భగుడి తలుపులు తెరిచే సమయానికి బాబియా అక్కడ ప్రత్యక్షమైంది. ఆందోళన చెందకుండా వెంటనే వేదమంత్రాలను చదివారు పూజారి. తర్వాత మొసలి అక్కడ నుంచి తిరిగి కొలనులోకి చేరుకుంది. ఇదంతా వీడియో రూపంలో చిత్రీకరించి నలుగురితో పంచుకోగా.. వీడియో వైరల్ అయ్యింది. వేల మంది నెటిజన్లు దీన్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.
దైవస్వరూపంగా...
ఈ మొసలిని స్థానికులు సాక్షాత్తు దేవుని స్వరూపంగా భావిస్తారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉండే బాబియా.. గుడికి వచ్చే భక్తులను ఏమీ చేయదు. వచ్చినవారు కూడా దేవుని దర్శనంతో పాటు బాబియా దర్శనం చేసుకుంటారు.