తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సుప్రీంలో అయోధ్య కేసు 2వ రోజు: రామ్ లల్లా వాదనలు

By

Published : Aug 7, 2019, 12:13 PM IST

Updated : Aug 7, 2019, 4:10 PM IST

అయోధ్య కేసు

16:08 August 07

దైవం పుట్టుకపై నిర్ధరణ ఎప్పుడైనా జరిగిందా? సుప్రీం

రామ్​లల్లా వాదనలపై ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది. ఏదైనా కోర్టులో దైవం పుట్టుకకు సంబంధించి విచారణ జరిగిందా? ప్రపంచంలో ఎక్కడైనా, ఎవరైనా యేసు క్రీస్తు విషయంలో ప్రశ్నించారా? అని ప్రశ్నించింది. 

ఈ విషయాల గురించి సరైన అవగాహన లేదని తెలిపిన ప్రశాసన్​.. తెలుసుకుని సమాధానమిస్తామని కోర్టుకు నివేదించారు. 

15:57 August 07

వాదనలు ప్రారంభించిన రామ్​లల్లా

అయోధ్య కేసులో అఖాడా వివరణపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీం సూచనల మేరకు రామ్​లల్లా తరఫున కె ప్రశాసన్​ వాదనలు ప్రారంభించారు. అయోధ్య కచ్చితంగా రాముడి జన్మస్థలమేనని స్పష్టం చేశారాయన. వాల్మీకి రామాయణం అయోధ్యలోనే రాముడు జన్మించినట్లు మూడు సార్లు పేర్కొందని తెలిపారు. ఎన్నో వందల ఏళ్ల కింద జరిగిన విషయాలకు ఆధారాలు ఉండవని వివరించారు.

13:12 August 07

అఖాడాను ఆధారాలు కోరిన ధర్మాసనం

అయోధ్య ప్రాంగణంలో ఊరేగింపులకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని నిర్మోహి అఖాడాను ధర్మాసనం కోరింది. ఏమైనా ధ్రువపత్రాలు, రెవెన్యూ రికార్డులు ఉంటే ఇవ్వాలని ఆదేశించింది. 1982లో జరిగిన దోపిడీలో రికార్డులను కోల్పోయామని కోర్టుకు నివేదించింది అఖాడా.

11:56 August 07

సుప్రీంలో అయోధ్య కేసు 2వ రోజు: రామ్ లల్లా వాదనలు

సుప్రీంకోర్టులో అయోధ్య కేసు విచారణ రెండో రోజు కొనసాగుతోంది. నిర్మోహి అఖాడా సంస్థ వాదనలు వినిపిస్తోంది.

నిన్న జరిగిన వాదనల్లో పిటిషనుదారు నిర్మోహి అఖాడా బలంగా వాదనలు వినిపించింది. వివాదానికి సంబంధించిన 2.77 ఎకరాల భూమి అంతా అఖాడాకే చెందుతుందని సంస్థ తరఫు న్యాయవాది సుశీల్​ జైన్​ పేర్కొన్నారు. 

"మాది గుర్తింపు పొందిన సంస్థ. మేం వాదించేది ఊరేగింపు, ఆలయ నిర్వహణ హక్కుల గురించి మాత్రమే. వందల ఏళ్లుగా ఊరేగింపు నిర్వహిస్తున్నాం. రామ జన్మస్థలం లోపలి ప్రాంగణం నిర్మోహి అఖాడా అధీనంలోనే ఉండేది. లోపలి ప్రాంగణంలోకి హిందువులు వచ్చి పూజలు చేసేవారు. 1934 తర్వాత ముస్లింలకు లోపలికి అనుమతి ఉండేది కాదు. అలహాబాద్​ తీర్పు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. వివాదం ఉన్న స్థలమంతా నిర్మోహి అఖాడా సంస్థదే."

-సుశీల్​ జైన్, నిర్మోహి అఖాడా తరఫు న్యాయవాది

అయోధ్య కేసులో మధ్యవర్తిత్వం విఫలమయిందని ప్రకటించిన సుప్రీంకోర్టు... ఆగస్టు 6 నుంచి రోజువారీ విచారణ మొదలుపెట్టింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం కేసును పరిశీలిస్తోంది. 

అలహాబాద్ కోర్టు తీర్పు

అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్ బోర్డ్​, నిర్మోహి అఖాడా, రామ్​ లల్లాకు సమానంగా పంచాలని 2010లో అలహాబాద్​ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పునకు వ్యతిరేకంగా ఇప్పటివరకు సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి.

Last Updated : Aug 7, 2019, 4:10 PM IST

ABOUT THE AUTHOR

...view details