తెలంగాణ

telangana

By

Published : Mar 26, 2020, 7:53 AM IST

Updated : Mar 26, 2020, 9:28 AM IST

ETV Bharat / bharat

భౌతిక దూరమే సురక్షితం- సంక్షోభానికి విరుగుడు మంత్రం

కరోనా మహమ్మారి చాపకింద నీరులా దేశంలో వ్యాపిస్తున్న నేపథ్యంలో... ప్రజలు భౌతిక దూరం పాటించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. మన నివాస స్థలం, ఇల్లు, ఆదాయం, జీవనోపాధి తదితరాలు సామాజిక దూరం పాటించే విషయంలో పెద్ద సవాలుగా మారతాయి. అయినప్పటికీ కొద్దికాలం పాటు ఈ కష్టాన్ని భరించడమే సురక్షితమని నిపుణులు సూచిస్తున్నారు.

social distance is most importent to control corona virus
కరోనాను జయించాలంటే భౌతిక దూరం పాటించడమే మంచిది

మనిషి స్వాభావికంగానే సామాజిక జంతువు అనేది అరిస్టాటిల్‌ మాట. ఈ లెక్కన సామాజిక దూరం అనేది మన స్వభావానికి విరుద్ధంగా కనిపిస్తుంది. కొవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తి చెందుతున్న సంక్షోభ సమయంలో సామాజిక దూరాన్ని పాటించడం కూడా సవాలే. మన నివాస స్థలం, ఇల్లు, ఆదాయం, జీవనోపాధి తదితరాలు సామాజిక దూరం పాటించే విషయంలో పెద్ద సవాలుగా మారతాయి.

నివారణ చర్యలు అనుసరించాల్సిందే..

ఈ మహమ్మారికి కనుచూపు మేరలో ఎలాంటి టీకాలు, చికిత్సలు అందుబాటులో లేని పరిస్థితుల్లో సామాజిక దూరాన్ని పాటించడం, చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవడం వంటి నివారణ చర్యల్ని అనుసరించాల్సిందే. ఇవి చక్కటి ప్రభావం చూపుతాయన్న సంగతి మరవరాదు. సామాజిక దూరం వల్ల పలు ప్రయోజనాలు ఉంటాయని చరిత్ర చెబుతోంది. 1918 స్పానిష్‌ ఫ్లూ మహమ్మారి విరుచుకుపడినప్పుడు ఇలాంటి అలవాటు సానుకూల ప్రభావం చూపింది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు కొవిడ్‌-19 వ్యాప్తిని అడ్డుకునేందుకు ముఖ్యమైన ఆయుధంగా సామాజిక దూరాన్నే ఎంచుకున్నాయి. సామాజిక దూరం సమాజంలో సంబంధాల్ని విచ్ఛిన్నం చేస్తుందనే ఉద్దేశంతో ఈ పదాన్ని ఉపయోగించడమే తప్పుగా భావిస్తున్నారు. ఈ కారణంగానే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ పదాన్ని ఉపయోగించవద్దని చెబుతోంది. దీనికి బదులుగా భౌతిక దూరం అనే పదబంధాన్ని ఉపయోగించాలని సూచిస్తోంది.

దూరం పాటించాల్సిందే..

మహమ్మారి వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో ప్రజలను ఇంట్లోనే ఉండాలని కోరడం, పెద్దయెత్తున గుమికూడకుండా ఉండటం, ఒకరి నుంచి మరొకరు కనీసం మూడు నుంచి ఆరు అడుగుల దూరం పాటించాలని సూచిస్తున్నారు. ప్రజా రవాణా వ్యవస్థలు, బహిరంగ ప్రదేశాలు, అన్ని రకాల సంస్థలను చాలావరకు ప్రభుత్వాలు మూసేశాయి. నిత్యావసర సేవలు అందించేవారికి మాత్రమే మినహాయింపులు ఇచ్చాయి. ప్రజలను ఇళ్లవద్దే ఉండి పని చేయాలనే దిశగా ప్రోత్సహిస్తున్నాయి. దీనివల్ల ప్రజలు భౌతిక దూరాన్ని పాటించే వాతావరణం ఏర్పడే అవకాశం పెరుగుతుంది. భౌతిక దూరం అనేది పలురకాలుగా ఉపయోగపడుతుంది. వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండేవారిలో ఇన్‌ఫెక్షన్‌ సోకే అవకాశం తగ్గుతుంది. కొవిడ్‌-19 మహమ్మారి దశలను నెమ్మదింపజేయడంలోనూ తోడ్పడుతుంది. భారత్‌ ప్రస్తుతం వైరస్‌ స్థానికంగా వ్యాపించే రెండో దశలో ఉంది. ఈ దశలో ఇన్‌ఫెక్షన్‌కు మూలం, దాని ప్రయాణాన్ని గుర్తించవచ్చు. మహమ్మారి పురోగతి మూడో దశకు వెళ్లకుండా నివారించడంలో భౌతిక దూరం అనేది అత్యంత కీలకంగా నిలుస్తుంది. భారీ స్థాయిలో బాధితుల సంఖ్య పెరగకుండా అడ్డుకుంటుంది. కొవిడ్‌-19 కేసుల సంఖ్య తగ్గేందుకూ ఉపయోగపడుతుంది. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై ఒక్కసారిగా భారం పెరగకుండా నివారించడమూ సాధ్యమవుతుంది.

అడ్డంకులను అధిగమించాలి..

భౌతిక దూరం అనే యోచన మన ముందుకు ఎన్నో సామాజికాంశాలను, భావనలను తీసుకొస్తోంది. సామాజిక దూరం పాటించే సమయంలో సైతం సామాజిక బంధాల్ని బలోపేతం చేసుకోవడం సాధ్యమే. దృశ్య మాధ్యమం ద్వారా ఫోన్‌ మాట్లాడుకోవడం వంటి సాంకేతిక పరిజ్ఞానాలు అందరి మధ్యా అనుసంధానతకు తోడ్పడతాయి. సామాజికంగా ఎవరికి వారే అన్నట్లుగా ఉండే ప్రస్తుత తరుణంలో సాంకేతికత అందరికీ తోడ్పాటునందిస్తుంది. అందరూ బాగుండాలనే భావనకు, బలమైన సామాజిక బంధాలకు మనం సంప్రదాయికంగానే ఎంతో విలువిస్తాం. అందుకని భౌతిక దూరం పాటించాల్సిన ప్రస్తుత సమయంలో సామాజిక సంక్షేమానికి ప్రాధాన్యం కల్పించడం వంటివీ చాలా ముఖ్యం. ఇలాంటి సమయాల్లో సామాజిక సేవ, స్వచ్ఛంద సేవల వల్ల సామాజిక సౌహార్ద్రత పరిఢవిల్లుతుంది. ప్రతి ఒక్కరూ తమ గురించి తాము జాగ్రత్తలు తీసుకుంటూనే ఇతరుల సంరక్షణను పట్టించుకోవడం చాలా ముఖ్యమన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఈ విషయంలో ఆరోగ్యవంతులు, యువత వంటివారు తమవంతు పాత్ర పోషించాల్సి ఉంది. కొవిడ్‌-19 వంటి మహమ్మారుల కారణంగా పేదల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, లాక్‌డౌన్‌ వంటివాటి వల్ల వారి ఆర్థిక పరిస్థితి అతలాకుతలమవుతుంది. పేదలు, రోజువారీ కూలీలు, అసంఘటిత రంగ కార్మికులు, ప్రైవేటు రంగ ఉద్యోగులు, చిన్నారులు, వృద్ధులు వంటి బాధిత వర్గాల కోసం నిర్దిష్టమైన సామాజిక భద్రతను అందించే చర్యలు తీసుకోవాలి.

నవకల్పనల దిశగా

లాక్‌డౌన్ల వంటి సందర్భాల్లో సేవలు అందించే విషయంలో నవకల్పనల దిశగా యోచించాలి. ఇలాంటి సంక్షోభం సృజనాత్మక సేవల్ని రూపొందించే దిశగా సాగేందుకు దక్కిన మంచి అవకాశంగా భావించాలి. ప్రభుత్వ సేవలు అందే మార్గమూ మారేలా చూడాలి. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆరోగ్య, సంక్షేమ సేవల్ని గడప వద్దకే చేర్చే విషయంలో నవకల్పనల్ని ఉపయోగించుకోవాలి. కార్పొరేట్‌ సంస్థలు తమ సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా మహమ్మారులను నిలువరించేందుకు ప్రభుత్వాలు చేస్తున్న కృషికి అండగా నిలవాలి. సబ్బులు, శానిటైజర్లు వంటి వస్తువుల ఉత్పత్తి, రాయితీల్లో సహకరించాలి. ప్రజారోగ్యాన్ని మెరుగుపరచేందుకు ప్రభుత్వం చేసే వ్యయానికి తోడుగా ఉండేలా తమవంతు నిధులను సమకూర్చాలి. చివరగా, మనం ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించాలంటే, విభిన్న కారణాలతో తరచూ తలెత్తే మహమ్మారులను ఎదుర్కొనేందుకు సరైన ప్రణాళికల్ని రూపొందించుకోవాలి. ప్రజల ఆరోగ్యం, బాగోగుల్ని మెరుగుపరచే దిశగా సమగ్ర విధానాల్ని పాటించాలి.

- నందకిశోర్​ కన్నూరి

రచయిత- హైదరాబాద్​లోని ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ పబ్లిక్​ హెల్త్ (ఐఐపీహెచ్​)లో అదనపు ఆచార్యులు

ఇదీ చూడండి:పత్రికల ద్వారా కరోనా సోకదు

Last Updated : Mar 26, 2020, 9:28 AM IST

ABOUT THE AUTHOR

...view details