కరోనా మహమ్మారి కారణంగా సంపన్న ఆలయ ట్రస్టుల్లో ఒకటైన షిరిడీ సాయిబాబా ట్రస్టు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఏటా రూ.400 కోట్ల ఆదాయం పొందే ఈ ప్రసిద్ధ ఆలయం.. ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని స్థితిలో ఉంది. నిర్వహణ ఖర్చులు కూడా సమకూర్చుకోలేకపోతోంది. ప్రతినెలా 5వ తేది వరకు వచ్చే జీతాలు ఈ సారి 20 దాటినా రాలేదని షిరిడీ ఆలయ సిబ్బంది తెలిపారు. ట్రస్టును ఈ విషయమై సమాచారం అడిగినా ఎలాంటి స్పందన రాలేదన్నారు.
ఆలయ సందర్శనకు వచ్చే భక్తులకు నీటిని సరఫరా చేసే 32 మంది సిబ్బందికి గతేడాది నవంబరు నుంచి జీతాలు చెల్లించలేదు. తక్షణమే వేతనాలు ఇవ్వాలని వారు కోరుతున్నారు.
రోజుకు రూ. 1.58 కోట్ల నష్టం
నిత్యం భక్తులతో రద్దీగా ఉండే షిరిడీ సాయిబాబా ఆలయం.. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ కారణంగా 90 రోజులుగా వెలవెలబోతోంది. సగటున రోజుకు 25 వేల మంది భక్తులు దర్శనానికి వచ్చేవారు. పండుగ సందర్బాల్లో ఆ సంఖ్య దాదాపు లక్ష ఉండేది. లాక్డౌన్లో ఆలయానికి విరాళాలు కూడా అందడం లేదు. రోజుకు రూ.1.58 కోట్ల మేర నష్టపోతున్నట్లు అక్కడి ట్రస్ట్ వర్గాలు తెలిపాయి. ట్రస్టు వద్ద నిధులు లేవని పేర్కొన్నాయి.