తెలంగాణ

telangana

ఎన్డీఏ సమావేశానికి శివసేన దూరం!

By

Published : Nov 16, 2019, 5:46 PM IST

రేపు జరగబోయే ఎన్డీఏ పక్షాల సమావేశానికి దూరంగా ఉండనుంది శివసేన. మహా ప్రతిష్టంభన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆదివారం బాల్​ ఠాక్రే వర్ధంతి ఉండటమూ ఓ కారణంగా పేర్కొంది సేన.

ఎన్డీఏ సమావేశానికి శివసేన దూరం!

మహారాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో భాజపా-శివసేన మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో రేపు జరగబోయే ఎన్డీఏ సమావేశానికి హాజరయ్యే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది శివసేన. ఆ పార్టీ అధినేత ఉద్ధవ్​ ఠాక్రేతో భేటీ అనంతరం ఈ మేరకు ప్రకటన చేశారు సీనియర్​ నేత సంజయ్​ రౌత్​.

" ఎన్డీఏ పక్షాల సమావేశానికి శివసేనకు చెందిన ప్రతినిధులు ఎవరూ హాజరుకారు. ఇదే తుది నిర్ణయం కావచ్చు."

-సంజయ్​ రౌత్​, శివసేన నేత.

శివసేన వ్యవస్థాపకుడు బాల్​ ఠాక్రే వర్ధంతి ఆదివారం ఉండటమూ.. సమావేశానికి హజరుకాకపోవడానికి ఓ కారణంగా పేర్కొంది సేన. పార్టీ నేతలు, కార్యకర్తలు ఠాక్రేకు నివాళులర్పించే క్రమంలో సమావేశానికి ఎలా హజరవుతారని ప్రశ్నించింది.

నేషనల్​ డెమొక్రటిక్​ అలియన్స్​ (ఎన్డీఏ) కూటమిలో సుదీర్ఘ కాలంగా భాగస్వామిగా కొనసాగుతోంది సేన. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని సమానంగా పంచుకునే విషయమై భాజపాతో ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో కూటమి నుంచి బయటకి వచ్చినట్టు సమాచారం.
ఎన్సీపీ, కాంగ్రెస్​తో కలిసి మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఈ మూడు పార్టీలు ఓ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. సంకీర్ణ ప్రభుత్వానికి సేన నేతృత్వం వహించనుంది.

ప్రతిపక్షంలోకి సేన!

అరవింద్​ సావంత్​ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయటం వల్ల ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చింది శివసేన. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో సేనకు ప్రాతినిధ్యం లేదు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి జరిగే పార్లమెంట్​ సమావేశాల్లో శివసేన ఎంపీలు సంజయ్​ రౌత్​, అనిల్​ దేశాయ్ కూర్చునే స్థానాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి నుంచి శివసేన స్థానాలు ప్రతిపక్షంలో ఉండే అవకాశం ఉందని పార్లమెంట్​ వర్గాలు పేర్కొన్నాయి.

ఇదీ చూడండి: కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్​ 'భారత్​ బచావో'

ABOUT THE AUTHOR

...view details