వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష-నీట్ మైనారిటీ, ఎయిడెడ్, అన్ఎయిడెడ్, ప్రైవేట్ విద్యాసంస్థలకు కూడా వర్తిస్తుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇది ఆ సంస్థ హక్కులను ఉల్లంఘించినట్లు కాదని స్పష్టం చేసింది. వైద్య విద్య ప్రవేశాల్లో జరిగే అనేక రుగ్మతులను 'నీట్' కట్టడి చేస్తుందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. 'నీట్'కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ను సవాలు చేస్తూ క్రిస్టియన్ మెడికల్ కళాశాల(వెల్లూరు) మణిపాల్ యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం వైద్య కళాశాల, కర్ణాటక మెడికల్ అండ్ డెంటల్ కాలేజీల అసోసియేషన్ సహా వివిధ ప్రైవేటు మెడికల్ కళాశాలల తరఫున దాఖలైన 76 పిటిషన్లను విచారించిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. వైద్య విద్యను వ్యాపారంగా మార్చి, విద్యార్థులను దోపిడి చేసే పరిస్థితులను నియంత్రించేందుకు, భారీ క్యాపిటేషన్ ఫీజులతో తక్కువ ప్రతిభగల విద్యార్థులకు ప్రవేశం కల్పించడాన్ని ఇది అరికడుతుందని జస్టిస్ అరుణ్ మిశ్ర, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ ఎం.ఆర్ షాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
వారి హక్కుల ఉల్లంఘన కాదు..