ప్రస్తుత కాలంలో రోడ్డు మీద వంద రూపాయలు దొరికితే పక్కవారిని ఈ డబ్బు మీదేనా అని కూడా అడగకుండా, జేబులో వేసుకెళ్లిపోయేవారికి కొదవే లేదు. కానీ, మహారాష్ట్రలో ఓ సాధారణ ఆటోడ్రైవర్ తనకు దొరికిన రూ. 7 లక్షలు విలువ చేసే బంగారం, నగదు ఉన్న బ్యాగును పట్టుకెళ్లి పోలీసులకు అప్పజెప్పేశాడు. నిజాయతీకి నిదర్శనంగా నిలిచాడు.
పుణెకు చెందిన విఠల్ మపారె(60) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుమారుడు ఓ ప్రైవేటు సంస్థలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. అద్దె ఇంట్లోనే జీవనం సాగిస్తున్నారు. పేదరికంలో బతుకీడుస్తున్నా.. మంచితనం అనే గొప్ప ఆస్తి విఠల్ సొంతం. బుధవారం కేశవ్ నగర్లో ఓ జంట విఠల్ ఆటో ఎక్కారు. హడప్సర్ బస్టాండులో దిగిపోయారు. కానీ, తమతో తెచ్చుకున్న సంచిని ఆటోలోనే మరిచిపోయారు.
ఆ బ్యాగును గమనించిన విఠల్.. అందులో ఏముందని కూడా చూడకుండా సరాసరి పోలీస్ స్టేషన్కు పట్టుకెళ్లాడు.
"ఆ దంపతులను బస్టాండులో దింపేసి.. బీటీ కవాడే రోడ్డులో ఆటో పక్కన నిలిపి, చాయ్ తాగుతున్నప్పుడు వెనక సీటులో ఓ బ్యాగు కనిపించింది. దాన్ని నేను తెరచి చూడలేదు కానీ, ఈ బ్యాగు ఆటో దిగిపోయిన ఆ దంపతులదే అనుకున్నాను. వెంటనే సమీపంలోని ఘోర్పాడి చౌకీ పోలీస్ స్టేషన్కు పట్టుకెళ్లి అప్పజెప్పేశాను."