'సరిహద్దు సవాళ్ల పరిష్కారంలో సైన్యం భేష్' భారత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ పశ్చిమ, తూర్పు సరిహద్దు వివాదాలపై స్పందించారు. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్కు చెందిన బోర్డర్ యాక్షన్ టీం (బీఏటీ), జమ్ముకశ్మీర్లోని ఉగ్రవాద చర్యల గురించి ప్రస్తావించారు. సైన్యం.. చాలా వినూత్నంగా ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటునట్లు స్పష్టం చేశారు.
దేశం ఎదుర్కొంటున్న ప్రస్తుత భద్రతాపరమైన సమస్యలపై ఈ నెల 14 నుంచి 19 వరకు ఆర్మీ కమాండర్ల సమావేశం నిర్వహిస్తున్నారు. జమ్ముకశ్మీర్ సహా ఇతరత్రా అంశాల భద్రతపై తీసుకోవాల్సిన వ్యూహాత్మక చర్యల గురించి ఇందులో చర్చిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన రావత్... పశ్చిమ, తూర్పు సరిహద్దు సవాళ్ల విషయంలో సైన్యం పోరాటాలను కొనియాడారు.
నియంత్రణ రేఖ వద్ద సైనికులు వినూత్న పద్దతిలో ఆపరేషన్ నిర్వహించి విజయం సాధించటం ఎంతో ఆనందాన్ని కలిగించిందని బిపిన్ రావత్ తెలిపారు. అంతేకాకుండా సైనికులు బాధ్యతగా వ్యవహరించటం వల్ల నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రచర్యలను నిలువరించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కఠినమైన, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పని చేస్తున్న సైనికుల సమస్యలను పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు.
దేశ భద్రతకు సంబంధించిన అన్ని విషయాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఎంతో సహకరిస్తుందని తెలిపారు. ప్రతి ఏడాదీ ఏప్రిల్, అక్టోబర్లో ఆర్మీ కమాండర్ల సమావేశం జరుగుతుంటుంది.
ఇదీ చూడండి:ఆర్టెమిస్ మిషన్: నాసా 'నెక్ట్స్ జనరేషన్ స్పేస్సూట్లు'