తెలంగాణ

telangana

By

Published : Sep 2, 2020, 11:53 AM IST

ETV Bharat / bharat

ఐరాస సమావేశంలో ప్రసంగించనున్న ప్రధాని మోదీ

ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాన్ని ఉద్దేశించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి తాత్కాలిక జాబితా విడుదల చేసిన ఐరాస.. సెప్టెంబర్ 26న ప్రధాని ప్రసంగించనున్నట్లు తెలిపింది. తొలిసారిగా ఐరాస సాధారణ సభ వర్చువల్​గా జరగనుంది.

UN's 75-year history
ఐరాస సమావేశంలో ప్రసంగించనున్న ప్రధాని మోదీ!

ఐక్యరాజ్యసమితి(ఐరాస) సాధారణ అసెంబ్లీ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగించే అవకాశం ఉంది. ఈ మేరకు అత్యున్నతస్థాయి సమావేశంలో మాట్లాడే వారి జాబితాను ఐరాస విడుదల చేసింది. సెప్టంబర్ 26న ప్రధాని ప్రసంగం ఉన్నట్లు అందులో పేర్కొంది.

అయితే ఈ జాబితా తాత్కాలికమైనదని అధికార వర్గాలు తెలిపాయి. మరికొద్ది రోజుల్లో ఈ జాబితా రెండుసార్లు సవరించే అవకాశం ఉందని వెల్లడించాయి.

ట్రంప్ ఒకే ఒక్కడు!

ఐక్యరాజ్యసమితి 75 ఏళ్ల చరిత్రలో తొలిసారి వార్షిక సాధారణ సమావేశాల్ని వర్చువల్​గా నిర్వహించనున్నారు. దేశాధినేతలు ఎవరూ ఈ సమావేశానికి నేరుగా హాజరు కావడం లేదు. న్యూయార్క్​లో జరగనున్న ఈ సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రమే నేరుగా హాజరయ్యే అవకాశం ఉంది. మిగిలిన దేశాధినేతలు... ముందుగానే రికార్డు చేసిన వీడియో సందేశాన్ని ఐక్యరాజ్యసమితికి అందించనున్నారు.

తొలి ప్రసంగం ఆయనదే..

సెప్టంబర్ 22న ప్రారంభం కానున్న ఈ సమావేశాలు సెప్టెంబర్ 29 వరకు కొనసాగుతాయి. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సోనారో తొలి ప్రసంగం చేస్తారు. ఎప్పటిలాగే అమెరికా అధ్యక్షుడు ఈ సమావేశంలో రెండో ప్రసంగం ఇస్తారు. అధ్యక్షుడు ట్రంప్ న్యూయార్క్​లోని ఐరాస కార్యాలయానికి వెళ్లి సమావేశంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అధ్యక్షుడిగా తన తొలి పాలనా కాలంలో సాధారణ సభకు ట్రంప్ ఇచ్చే చివరి సందేశం ఇదే కానుంది.

ABOUT THE AUTHOR

...view details