తెలంగాణ

telangana

ETV Bharat / bharat

​​​​​​​'దీదీ విధానాలు సామాజిక సామరస్యానికి చేటు'

"మమతా బెనర్జీ శక్తిమంతమైన, మంచి దృక్పథం ఉన్న నేత. అయితే ఆమె మనోభావాలకు అనుగుణంగా కాకుండా కొన్ని విషయాల్లో సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది." ఈ మాటలు అన్నది బంగాల్ గవర్నర్ కేసరినాథ్​ త్రిపాఠి. గవర్నర్​గా పదవీ విరమణ చేయబోయే ముందు ఓ ఆంగ్ల వార్తా సంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో దీదీకి సంబంధించి ఎన్నో విషయాలపై స్పందించారు త్రిపాఠి.

By

Published : Jul 28, 2019, 4:52 AM IST

Updated : Jul 28, 2019, 11:10 AM IST

దీదీ విధానాలు సామాజిక సామరస్యానికి చేటు

దీదీపై గవర్నర్​ విమర్శలు

బంగాల్​ గవర్నర్​గా ఐదేళ్ల పాటు సేవలందించిన కేసరినాథ్ త్రిపాఠి.. సీఎం మమతా బెనర్జీ విధానాలపై పరోక్ష విమర్శలు చేశారు. పాలనా సమర్థత ఉన్న దీదీ వ్యక్తిగత మనోభావాలను అణుచుకోలేరని వ్యాఖ్యానించారు. పదవీ విరమణ చేయబోయే ముందు ఓ ఆంగ్ల వార్తాసంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో అనేక విషయాలపై మాట్లాడారు త్రిపాఠి.

"మమతా బెనర్జీ అనుసరిస్తున్న బుజ్జగింపు విధానాలతో రాష్ట్రంలో సామాజిక సామరస్యం దెబ్బతింటోంది. తీసుకున్న నిర్ణయాలను అమలు చేయగలిగే శక్తి, అభివృద్ధి దృక్పథం మమతకు ఉన్నాయి. అయితే ఆమె వ్యక్తిగత మనోభావాల విషయంలో సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. సామాజిక సామరస్యం ఏర్పడాలంటే అందరినీ సమానంగా చూడాలి. చాలా సందర్భాల్లో తన మనోభావాలకు మమత ప్రభావితమైపోతారు. నియంత్రణ పాటించాలి."

-కేసరి నాథ్ త్రిపాఠి, బంగాల్ గవర్నర్

గవర్నర్​గా ఐదేళ్ల కాలంలో దీదీతో అనేక సందర్భాల్లో వివాదాస్పద పరిస్థితులను ఎదుర్కొన్నారు త్రిపాఠి. భాజపా ప్రోద్బలంతో ప్రభుత్వ వ్యవహారాల్లో గవర్నర్​ జోక్యం చేసుకుంటున్నారని పలుమార్లు విమర్శించారు దీదీ. ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని పని చేస్తున్నారని ఆరోపించారు. వీటిపైనా త్రిపాఠి స్పందించారు.

"రాష్ట్రంలో ప్రభుత్వ విధానాల వల్ల ఏర్పడిన సామాజిక వివక్ష స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో తరచుగా చోటుచేసుకుంటున్న హింసాయుత పరిస్థితులు ఆందోళనకరం. శాంతిభద్రతల పరిస్థితిని మెరుగుపరిచేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలి. అసలు ప్రజలు ఎందుకు హింసాకాండకు ఒడిగడుతున్నారో అర్థం కావడంలేదు. దీని వెనుక రాజకీయ కారణాలు ఉండి ఉండొచ్చు. అలాగే మతపరమైన కారణాలు, బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు వలస రావడం కూడా ఈ హింసాకాండకు కారణం కావచ్చు."

- కేసరినాథ్ త్రిపాఠి, బంగాల్​ గవర్నర్

రాష్ట్రంలో శాంతిభద్రతల విషయాన్ని అదుపు చేయటానికి రాష్ట్రపతి పాలనకు అవకాశం ఉందా? అనే అంశంపైనా వివరణ ఇచ్చారు త్రిపాఠి.

"కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే సుప్రీంకోర్టు తీర్పులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రపతి పాలన విధించాల్సి ఉంటుంది. అయినా శాంతిభద్రతల పరిరక్షణ రాష్ట్రాల జాబితాలోని అంశం. శాంతిభద్రతలు అనే అంశం రాష్ట్రపతి పాలన విధించడానికి బలమైన కారణం కాదు. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం పనిచేయకపోయినా, ఆ తరహా పరిస్థితులు తలెత్తినప్పుడే అవసరం ఉంటుంది."

- కేసరినాథ్ త్రిపాఠి, బంగాల్​ గవర్నర్

రాష్ట్ర కొత్త గవర్నర్‌గా త్రిపాఠి స్థానంలో కేంద్ర మాజీ మంత్రి జగదీప్​ ధనకర్ ఈనెల 30న బాధ్యతలు చేపడతారు.

తప్పుబట్టిన కాంగ్రెస్, తృణమూల్​

త్రిపాఠి వ్యాఖ్యలను అధికార తృణమూల్​ కాంగ్రెస్​తో పాటు హస్తం పార్టీ తప్పుబట్టాయి. వెళ్లిపోయే ముందు విమర్శలు చేయటం ఏమిటని ప్రశ్నించాయి. రాజ్​భవన్​ను భాజపా కార్యాలయంగా మార్చారని గతంలో తాము చేసిన విమర్శలను త్రిపాఠి నిజం చేశారని టీఎంసీ ప్రధాన కార్యదర్శి పార్థ ఛటర్జీ పేర్కొన్నారు.

గవర్నర్​ వ్యాఖ్యల్లో కొంతమేర నిజముందని సీపీఎం పేర్కొంది. అయితే బంగాల్​లో హింసకు ప్రభుత్వంతో పాటు భాజపా విధానాలూ కారణమేనని విమర్శించింది.

ఇదీ చూడండి: బాత్రూంకని చెప్పి ఈడీ ఆఫీస్ నుంచి బయటకు!

Last Updated : Jul 28, 2019, 11:10 AM IST

ABOUT THE AUTHOR

...view details