తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​-చైనా 'శాంతి' చర్చలు ఇక ముగిసినట్టేనా?

సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్​-చైనా మధ్య మేజర్ జనరల్స్ స్థాయిలో జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఇరుదేశాల సైనికులు ఆవేశంతో ఉన్న నేపథ్యంలో భవిష్యత్​ చర్చలపై సందిగ్ధం ఏర్పడింది. అయితే ఇలాంటి ఊహాగానాలను ఓ సైనికాధికారి ఖండించారు. సరిహద్దు సమస్య పరిష్కారానికి మరిన్ని చర్చలు చేసేందుకు ఇరుదేశాల భద్రతా బలగాలు అంగీకారానికి వచ్చాయని పేర్కొన్నారు.

By

Published : Jun 19, 2020, 6:25 PM IST

Major General-level talks end in Galwan, military negotiations may be over for now
భారత్​-చైనా 'సరిహద్దు' చర్చలు ఇక ముగిసినట్టేనా!

తూర్పు లద్దాక్​ గల్వాన్ లోయ వద్ద తలెత్తిన ఉద్రిక్తతలను తగ్గించేందుకు.. భారత్​-చైనా మధ్య మేజర్​ జనరల్స్​ స్థాయిలో జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. వరుసగా మూడు దఫాలు చర్చలు జరిపినా వాస్తవాధీన రేఖ నుంచి బలగాల ఉపసంహరణపై ఇరు వర్గాల మధ్య అంగీకారం కుదరలేదని తెలుస్తోంది. ఇరు దేశాల సైనికులు ఆవేశంతో రగిలిపోతున్న నేపథ్యంలో... భవిష్యత్ చర్చలపై సందిగ్ధం ఏర్పడింది.

అయితే సరిహద్దు ఘర్షణలను, ఉద్రిక్తతలను తగ్గించేందుకు మరిన్ని చర్చలు జరపాలని భారత్​, చైనా నిర్ణయించినట్లు ఓ సైనికాధికారి తెలిపారు. అలాగే ప్రస్తుతం జరిగిన చర్చల్లో... కొన్ని తక్షణ సమస్యల పరిష్కారం విషయంలో ఇరు దేశాలు ఓ అంగీకారానికి వచ్చినట్లు ఆయన తెలిపారు.

సరిహద్దు ఘర్షణ

భారత్​తో సుదీర్ఘ సరిహద్దును పంచుకుంటున్న చైనా.. ప్రతిసారి కయ్యానికి కాలుదువ్వుతోంది. పలు భారత ప్రాంతాలను తమవని వాదిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో వాస్తవాధీన రేఖ వెంబడి ఇరుదేశాల సైనికుల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా మే 4-5న లద్దాక్ పాంగాంగ్ సరస్సు వద్ద భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. మే 10 సిక్కింలోనూ ఇదే విధంగా ఇరు దేశాల జవానులు గొడవపడ్డారు.

ఈ నేపథ్యంలో ఇరు దేశాలు మేజర్ జనరల్స్ స్థాయిలో పెట్రోల్​ పాయింట్​ 14 (పీపీ 14) వద్ద చర్చలు కూడా నిర్వహించాయి. అయితే జూన్​ 15 (సోమవారం) రాత్రి భారత్​ చైనా సైనికుల మధ్య చెలరేగిన ఘర్షణ తీవ్ర హింసాత్మకంగా మారింది.

పక్కా ప్రణాళికతో దాడి

గల్వాన్ లోయ వద్ద పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్​ఏ) సైనికులు.. మేకులతో కూడిన ఇనుపరాడ్లు, రాళ్లు తీసుకుని... భారత సైనికులపై దాడి చేశారు. తమ వద్ద ఆయుధాలు ఉన్నప్పటికీ భారత సైనికులు వారిపై కాల్పులు జరపకపోవడం గమనార్హం.

ఈ హింసాత్మక ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. చైనా వైపు కూడా 43 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. కొందరు గల్వాన్​ నదిలో పడి కొట్టుకుపోయినట్లు సమాచారం.

తూటా పేలకూడదు..

ప్రోటోకాల్ ప్రకారం... వాస్తవాధీన రేఖ వెంబడి భారత సైన్యంగానీ, పీఎల్​ఏ దళాలు కానీ ఒకరిపై ఒకరు కాల్పులు జరపకూడదు. నిజానికి ఎల్​ఏసీ నుంచి 2 కి.మీ పరిధి వరకు ఇరుదేశాలు సైనికులు పెట్రోలింగ్​కు కూడా ఆయుధాలు ఉపయోగించరు. చాలా సందర్భాల్లో తుపాకీ బ్యారెల్స్ కిందకు వంచి ఉంచుతారు.

అప్రమత్తంగా ఉండండి..

తూర్పు లద్దాక్ గల్వాన్ లోయ వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత్-చైనా సరిహద్దు ప్రత్యేక దళం, ఐటీబీపీని అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యంగా చైనా కార్యకలాపాలపై నిఘా పెంచాలని సూచించింది. లద్దాక్ నుంచి అరుణాచల్​ప్రదేశ్ వరకు కాపలాను కట్టుదిట్టం చేయాలని ఐటీబీపీని ఆదేశించింది.

(రచయిత - సంజీవ్​ బారువా)

ఇదీ చూడండి:లేహ్​, లద్దాఖ్​ సరిహద్దులో యుద్ధ విమానాలతో గస్తీ

ABOUT THE AUTHOR

...view details