తెలంగాణ

telangana

లాక్​డౌన్ సడలించినా.. తగ్గిన సంక్రమణ వేగం!

By

Published : Jun 7, 2020, 5:30 AM IST

Updated : Jun 7, 2020, 9:35 AM IST

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పెరగడం లేదని చెన్నైలోని ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మేథమెటికల్ సైన్సెస్ అధ్యయనంలో తేలింది. లాక్‌డౌన్‌కు ముందు ఒకరి నుంచి 1.83 మందికి వైరస్​ సోకగా.. ప్రస్తుతం 1.22మందికి సోకుతున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది.

covid transmission rate
లాక్​డౌన్ సడలించినా.. తగ్గిన సంక్రమణ వేగం!

దేశంలో గత నెల రోజుల్లో లాక్‌డౌన్‌ నిబంధనలు సడలిస్తూ వస్తున్నప్పటికీ కరోనా వైరస్‌ వ్యాప్తి వేగం మాత్రం పెరగడంలేదని చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేథమెటికల్‌ సైన్సెస్‌ (ఐఎంఎస్సీ) అధ్యయనంలో తేలింది. వైరస్‌ సోకిన వ్యక్తి నుంచి మరొకరికి అది సంక్రమించే వేగం క్రమంగా తగ్గుతూ వస్తోంది.

తొలి లాక్‌డౌన్‌ ప్రారంభానికి ముందు రోజైన మార్చి 24న ఐఎంఎస్సీ శాస్త్రవేత్తల గణాంకాల ప్రకారం...వైరస్‌ ఒక వ్యక్తి నుంచి 1.83 మందికి సోకినట్లు తేలింది. అంటే వంద మంది వ్యక్తుల ద్వారా అది 183 మందికి సంక్రమించే అవకాశం ఉన్నట్లు లెక్క. లాక్‌డౌన్‌ ఆంక్షలు క్రమంగా సడలించుకొంటూ వచ్చిన తర్వాత వైరస్‌ వ్యాప్తి తొలుత 1.49కి, ఆ తర్వాత 1.29కి, తాజా గణాంకాల ప్రకారం ఒకరి నుంచి 1.22 మందికి మాత్రమే వైరస్‌ వ్యాపిస్తోంది.

అంటే 100 మంది వ్యక్తుల ద్వారా 122 మందికి ఇది సంక్రమిస్తోందని అర్థం. లాక్‌డౌన్‌ విధించిన తొలినాళ్ల నుంచి ఇప్పటికి దాదాపు 61 మందికి సక్రమణం తగ్గినట్టు ఈ అధ్యయనం చెబుతోంది. ఆంక్షలు ఎత్తివేసిన నేపథ్యంలో ప్రజలు బయటికి రావడం మొదలైన తర్వాత కూడా వైరస్‌ వ్యాప్తి వేగంలో తగ్గుదల కనిపిస్తోందని శాస్త్రవేత్తలు విశ్లేషించారు.

ఆ రాష్ట్రాల్లో ఆందోళనకరం

లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించిన తర్వాత కొన్ని రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఆ జాబితాలో అసోం, బిహార్‌, ఒడిశా, కేరళ, పశ్చిమబెంగాల్‌, హరియాణా, ఉత్తరాఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, దిల్లీ ఉన్నాయి. ఇందులో ఉత్తరాఖండ్‌లో అత్యధికంగా ఒకరి నుంచి ఇద్దరికి వైరస్‌ వ్యాపిస్తున్నట్లు తేలింది.

అంతం ప్రారంభం అప్పుడే..

ఒక వ్యక్తి నుంచి వైరస్‌ సంక్రమించే వారి సంఖ్య ఒకటి కంటే తగ్గినప్పుడే కరోనా మహమ్మారి అంతం మొదలైనట్లుగా భావించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. దేశంలో ఆర్థిక కార్యకలాపాలు మొదలైన తర్వాతా వైరస్‌ వ్యాప్తి వేగం తగ్గడం సానుకూలాంశం.

మహారాష్ట్రలో శుభ సంకేతం

మహారాష్ట్రలో వైరస్‌ వ్యాప్తి నెమ్మదించింది. ఇక్కడ ఒకరి నుంచి 1.18 మందికే వ్యాపిస్తోంది. ఇది జాతీయ సగటు కంటే తక్కువ. దేశంలోని 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సంక్రమణ వేగం జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, ఎక్కువ కేసులు నమోదవుతూ వచ్చిన మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌ల్లో వేగం తగ్గడం జాతీయ సగటు క్రమంగా తగ్గుముఖంపట్టేలా చేసింది.

Last Updated : Jun 7, 2020, 9:35 AM IST

ABOUT THE AUTHOR

...view details