తెలంగాణ

telangana

హోటళ్లలోనే ఎమ్మెల్యేలు... బలపరీక్షపై పార్టీల కసరత్తు

By

Published : Nov 25, 2019, 5:21 AM IST

Updated : Nov 25, 2019, 3:33 PM IST

మహారాష్ట్ర రాజకీయ పక్షాలు వ్యూహప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. సీఎంగా దేవేంద్ర ఫడణవీస్‌ ప్రమాణస్వీకారం చేశాక మద్దతు కూడగట్టేందుకు భాజపా  తెరవెనుక ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే తమ ఎమ్మెల్యేలను శిబిరాలకు తరలించిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు తదుపరి వ్యూహంపై చర్చల్లో మునిగితేలాయి.

హోటళ్లలోనే ఎమ్మెల్యేలు... బలపరీక్షపై పార్టీల కసరత్తు

హోటళ్లలోనే ఎమ్మెల్యేలు... బలపరీక్షపై పార్టీల కసరత్తు

మహారాష్ట్ర పంచాయితీపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించిన వ్యూహాలకు భాజపా, ప్రతిపక్ష కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేనలు పదునుపెట్టాయి. సభలో బలపరీక్ష ఎదుర్కొనే అంశంపై భాజపా నేతలు, ప్రత్యర్థి కూటమి ముఖ్యనేతలు చర్చోపచర్చలు జరిపారు. దేవేంద్ర ఫణడవీస్‌తో ప్రమాణస్వీకారం చేయించటాన్ని సవాల్‌ చేస్తు సుప్రీంకోర్టును ఆశ్రయించిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు 24గంటల్లోనే సభలో బలపరీక్ష నిర్వహించేలా ఆదేశించాలని కోరాయి.

ఫడణవీస్​తో అజిత్​ పవార్​..

ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఎన్సీపీ తిరుగుబాటు నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌... నిన్న రాత్రి పొద్దుపోయాక ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. వరద ప్రభావిత జిల్లాల రైతులను ఆదుకునే చర్యలపై చర్చించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్‌ చేసింది.

హోటల్​ రాజకీయాలు...

కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు అహ్మద్‌ పటేల్‌, మల్లికార్జున్‌ ఖర్గే..మహారాష్ట్ర పీసీసీ నేతలు, పార్టీ ఎమ్మెల్యేలతో రోజంతాచర్చలు జరిపారు. జుహులోని హోటల్‌ జేడబ్లూ మారియట్‌లో కాంగ్రెస్‌ పార్టీ తమ ఎమ్మెల్యేల శిబిరాన్ని ఏర్పాటు చేసింది.

ఎన్సీపీ ఎమ్మెల్యేల హోటల్ మార్పు..

శివసేన అధినేత ఉద్ధవ్‌ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తో కలిసి రినైసెన్స్‌ హోటల్‌ క్యాంపులో ఉన్న ఎన్సీపీ ఎమ్మెల్యేలతో నిన్న సమావేశమయ్యారు. ఆ తర్వాత ఎన్సీపీ ఎమ్మెల్యేల క్యాంప్‌ను హోటల్‌ హయత్‌కు మార్చారు. ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్‌పవార్‌ మద్దతుదారు ధనుంజయ్‌ముండే.. తాను ఎన్సీపీలోనే శరద్‌పవార్‌తో ఉన్నట్లు ట్వీట్‌ చేశారు. తన గురించి వదంతులు ప్రచారం చేయొద్దని కోరారు. అనంతరం హోటల్‌ లలిత్‌లో ఉన్న తమ ఎమ్మెల్యేలను కలిసిన ఉద్ధవ్‌ ఠాక్రే...అప్రమత్తంగా ఉండాలని వారికి సూచించారు.

వారే కీలకం..

భాజపాతోపాటు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ దృష్టి 13మంది స్వతంత్రులు, చిన్నపార్టీలకు చెందిన 16మంది ఎమ్మెల్యేలపైనే ఉంది. 288సభ్యులున్న మహారాష్ట్ర శాసనసభలో బలనిరూపణకు 145మంది మద్దతు అవసరం. 105 మంది ఎమ్మెల్యేలతో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేనకు 56మంది, ఎన్సీపీకి 54మంది, కాంగ్రెస్‌కు 44మంది ఎమ్మెల్యేల బలం ఉంది.

ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న శివసేన..తనకు మరో ఏడుగురు ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ప్రకటించింది. ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్‌ పవార్‌ వెంట ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నది స్పష్టత లేదు. పీజేపీ నేత, అచల్‌పుర్‌ ఎమ్మెల్యే కొన్నిరోజులక్రితమే శివసేనకు మద్దతు ప్రకటించారు. తనతోపాటు తన పార్టీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు ఉద్ధవ్‌ ఠాక్రేకేనని తెలిపారు. కేఎస్‌పీ ఎమ్మెల్యే శంకర్‌రావు గడఖ్‌ కూడా సేనకు మద్దతు తెలిపారు. ఉద్ధవ్‌ ఠాక్రేకు అనుకూలంగా రాంటెక్‌, భండారా, సక్రీ, ముక్తయ్‌నగర్‌ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టారు.

భాజపా కూడా తమకు 8మంది స్వతంత్రులతో పాటు చిన్న పార్టీల ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది. ఎంఐఎం, సమాజ్‌వాదీ పార్టీకి ఇద్దరు చొప్పున, సీపీఎం, ఎంఎన్​ఎస్​, ఆర్ఎస్​పీ, స్వాభిమాన్‌ పక్ష పార్టీలకు ఒక్కో ఎమ్మెల్యే ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వీరి మద్దతు కూడా కీలకం కానుంది.

ఇదీ చూడండి: ఛత్తీస్​గఢ్​లో రెచ్చిపోయిన నక్సల్స్​- పలు వాహనాలు దగ్ధం

Last Updated : Nov 25, 2019, 3:33 PM IST

ABOUT THE AUTHOR

...view details