తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ మామిడి పళ్ల ధర కిలో రూ.2.5 లక్షలు!

మీకు మామిడి పళ్లంటే మహా ఇష్టమా..? రకరకాల పండ్లన్నీ ఆరగించేయాలని కోరుకుంటారా..? అయితే మీరు ఖచ్చితంగా ఈ పండు రుచి చూడాల్సిందే..  జపాన్​లో మాత్రమే దొరికే ఈ మామిడి ధర కిలో.. సుమారు 2.5 లక్షల రూపాయలు. కంగారు పడకండి... ఈ అరుదైన పండ్ల కోసం ఇప్పుడు జపాన్​ వరకు వెళ్లాల్సిన పని లేదు.. భారతదేశంలో ఎంతో తక్కువ ధరకే దొరుకుతోంది.

By

Published : Jul 14, 2019, 8:04 AM IST

Updated : Jul 14, 2019, 10:25 AM IST

అత్యంత విలువైన మామిడి మన దేశానికొచ్చిందోచ్​!

అత్యంత విలువైన మామిడి మన దేశానికి...
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండు... ఇప్పుడు మన దేశంలోనూ దొరుకుతోంది. జపాన్​లో మాత్రమే లభ్యమయ్యే ఈ రకమైన మామిడిని.. మధ్యప్రదేశ్​లోని జబల్​పుర్​ రైతు సంకల్ప్ పండిస్తున్నారు. వివిధ రకాల మామిడి మొక్కలను అంటుకట్టి 'మల్లికా హైబ్రీడ్'​(ఆయన పెట్టిన పేరు)ను విజయవంతంగా సాగుచేస్తున్నారు.

జపాన్​లో ఈ పండును అత్యంత అనుకూల వాతావరణంలో ఎంతో జాగ్రత్తగా పండిస్తారు. కానీ సంకల్ప్.. వృధాగా పడి ఉన్న తన బంజరు భూమిలో ప్రయోగం చేసి సత్ఫలితాలు పొందారు. ఎలాంటి రసాయనిక ఎరువులూ వాడలేదు.. సహజ పద్ధతిలోనే సాగుచేసి నాణ్యమైన ఫలాలు పొందుతున్నారు.

"మధ్యప్రదేశ్​ వాతావరణ పరిస్థితులను తట్టుకొని విజయవంతంగా మేం మామిడిని సాగు చేస్తున్నాం. దిగుబడి చాలా బాగుంది. పండు పరిమాణం సైతం పెద్దగా ఉంది. దీని గుజ్జు జెల్లీలాగా ఉంటుంది. తోలూ పలుచగా ఉంటుంది. చాలా మంచి రుచిని కలిగి ఉంటుంది.
ఇది అల్ఫాంజో రకం మామిడి కన్నా చాలా రెట్లు మేలైనది. ఒక్కో పండు సుమారు 200 గ్రాములతో 25 సెం.మీ పొడవు ఉంటుంది. దీని టెంక రూపాయి బిళ్ల పరిమాణంలో ఉండటం విశేషం. పండు సువాసన గది నిండా విస్తరిస్తుంది. ఈ పండు పక్వానికి వచ్చినప్పుడు కేసరి రంగులోకి మారుతుంది. జబల్​పుర్​ వాసులకు సహజంగా పండిన మామిడిని తినిపించడానికే ఈ నా ప్రయత్నం." - సంకల్ప్​, జబల్​పుర్​ రైతు

జపాన్​లో ఈ మామిడి పండ్ల ఖరీదు.. కిలో అక్షరాలా రెండున్నర లక్షల రూపాయలు. కానీ, భారత్​లో పండించడం వల్ల ఎంతో సరసమైన ధరలకే దొరుకుతోంది. జపాన్​లో 'టాయియో నో టమాగోగా' పిలిచే ఈ మామిడిని ఆంగ్లంలో 'ఎగ్​ ఆఫ్​ సన్'​ అంటారు.

నిజానికి జబల్​పుర్​లో మామిడి తోటలు చాలా తక్కువ. సాధారణ మామిళ్లే పండని ఈ నేలలో ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి రకం సాగవుతోంది. విదేశాల్లో మాత్రమే దొరుకుతాయనుకునే పండ్లను భారతదేశంలోనూ పండించి విజయవంతమయ్యారు సంకల్ప్​. ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు.

ఇదీ చూడండి:ఔరా: యోగాతో 'పక్షి రాజు' తిరుగులేని సందేశం

Last Updated : Jul 14, 2019, 10:25 AM IST

ABOUT THE AUTHOR

...view details