నేటి నుంచే 17వ లోక్సభ తొలి సమావేశాలు 17వ లోక్సభ తొలి సమావేశం నేడు ప్రారంభం కానుంది. రాజ్యసభ 249వ సెషన్ జూన్ 20న ప్రారంభం అవుతుంది. పార్లమెంటు సమావేశాలు జులై 26 వరకు సాగనున్నాయి.
40 రోజుల్లో లోక్సభ మొత్తం 30 రోజులు పనిచేయనుంది. రాజ్యసభలో 27 రోజులపాటు సభా కార్యకలాపాలు సాగనున్నాయి.
లోక్సభ సమావేశాల్లో మొదట నూతనంగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారాలు చేస్తారు. ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరగనుంది. జూన్ 19న 17వ లోక్సభ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. మరుసటి రోజు జూన్ 20న ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.
జులై 5న బడ్జెట్...
ఆర్థిక సర్వేను కేంద్రం జులై 4న పార్లమెంటు ముందు ఉంచనుంది. 2019-20 వార్షిక బడ్జెట్ను జులై 5 ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు.
ముమ్మారు తలాక్ సహా కీలక బిల్లుల్ని ఈ పార్లమెంటు సమావేశాల్లో ఆమోదింపచేసుకోవాలని కేంద్రం భావిస్తోంది. దాదాపు 46 బిల్లులు ఉభయ సభలు ఆమోదం పొందకుండానే 16వ లోక్సభ గడువు తీరింది. ఇవి వివిధ దశల్లో ఆగిపోయాయి. వాటిలో కొన్నింటిని పునరుద్ధరించి.. తిరిగి పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశముంది.
ఎలా ముందుకు...?
పార్లమెంటు సమావేశాలకు ముందు కేంద్రం అఖిలపక్షం భేటీ నిర్వహించింది. సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని అన్ని పార్టీల నేతలను కోరారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి.