కరోనా మహమ్మారిని అడ్డుకట్టేందుకు 21 రోజుల లాక్డౌన్ విధించింది ప్రభుత్వం. అయితే ఈ సమయంలో రీడింగ్ ఛాలెంజ్ను విసిరింది కేంద్ర మానవ వనరులు, అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఇందుకోసం బుక్ క్లబ్ను ఏర్పాటు చేసింది. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.
దేశవ్యాప్తంగా ప్రైమరీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు, అభ్యాసకులు ఈ లాక్డౌన్ సమయంలో నేషనల్ డిజిటల్ లైబ్రరీ (ఎన్డీఎల్)ను ఉపయోగించుకోవాలని కోరింది ఎమ్హెచ్ఆర్డీ.
ఈ-లైబ్రరీలో ఉచితంగా పుస్తకాలు
నేషనల్ డిజిటల్ లైబ్రరీలో 70 భాషల్లో 3 లక్షల మంది రచయితలు రాసిన 10 మిలియన్లకు పైగా పుస్తకాలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని తెలిపింది ఎమ్హెచ్ఆర్డీ. ఇవే కాకుండా మరో 60 రకాల వనరులు కూడా అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. వీటిలో ముఖ్యంగా పుస్తకాలు, థీసిస్, ఆడియో విజువల్ మెటీరియల్, వెబ్ కోర్సులు, సాహిత్యం , టెక్నాలజీ, ఫిలాసఫీ, నేచురల్ సైన్సెస్, లెక్కలు, తదితర అంశాలకు సంబంధించిన సమాచారం ఉంటుంది. వీటితోపాటు పాఠశాల అధ్యయనాలు, ఇంజినీరింగ్, సైన్స్, యూజీలోని ఇతర విభాగాలు, మేనేజ్మెంట్, లాకు సంబంధించిన పుస్తకాలూ ఉన్నాయి.
ఇదీ చదవండి:ఆగని కరోనా విజృంభణ- భారీగా పెరిగిన కేసులు