తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటకీయం: కుమార 'పరీక్ష'కు ఎమ్మెల్యేల గైర్హాజరు?

రోజుకో పరిణామంతో ఉత్కంఠ రేపిన కర్ణాటక రాజకీయాలకు తెరపడేలా కనిపిస్తోంది. కాంగ్రెస్​-జేడీఎస్​ సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో.. వ్యవహారం విశ్వాస పరీక్షదాకా చేరుకుంది. ఈ నెల 18న విధానసభలో బల నిరూపణ చేసుకోనున్నారు కుమారస్వామి. అయితే ఈ కీలక ఘట్టానికి రెబల్​ ఎమ్మెల్యేలు గైర్హాజరు కానున్నారని సమాచారం.

By

Published : Jul 16, 2019, 6:10 AM IST

Updated : Jul 16, 2019, 8:35 AM IST

కర్ణాటకీయం: కుమార 'పరీక్ష'కు ఎమ్మెల్యేల గైర్హాజరు?

కర్ణాటకీయం: కుమార 'పరీక్ష'కు ఎమ్మెల్యేల గైర్హాజరు?

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం తుది అంకానికి చేరుకుంది. అధికార కూటమికి చెందిన 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో నెలకొన్న సంక్షోభం.. శాసనసభలో విశ్వాస పరీక్ష వరకూ వెళ్లింది. ఈ నేపథ్యంలో ఈ నెల 18న బల నిరూపణ చేసుకోనున్నారు ముఖ్యమంత్రి కుమారస్వామి. అయితే ఈ విశ్వాస పరీక్షకు ముంబయిలో ఉన్న రెబల్​ ఎమ్మెల్యేలందరూ గైర్హాజరు అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

రాజీనామాపై వెనక్కి తగ్గని నేతలందరూ.. వచ్చే గురువారం నాడు ముంబయి హోటల్​ గదికే పరిమితమవనున్నారని సమాచారం. ఒకవేళ అదే జరిగితే కన్నడ అసెంబ్లీలో.. కాంగ్రెస్​-జేడీఎస్​ కూటమి బలం 116 నుంచి 100కు పడిపోనుంది. ప్రతిపక్ష భాజపా అధికారం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి కుర్చీ కుమారస్వామికి దూరమయ్యే అవకాశాలూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని నిలుపుకునేందుకు కాంగ్రెస్​-జేడీఎస్​ నేతలు ఏం చేయనున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

మరోసారి బుజ్జగింపులు

కాంగ్రెస్​-జేడీఎస్​ ప్రభుత్వంపై నీలినీడలు కమ్ముకున్న తరుణంలో.. చివరిసారిగా రెబల్​ ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నాలు చేయనున్నారు కూటమి సీనియర్​ నేతలు. మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి కుమారస్వామితో పాటు మరికొందరు సీనియర్​ నేతలు ముంబయికి వెళ్లి రెబల్​ ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపే అవకాశముందని తెలుస్తోంది.

ఇదివరకే రెబల్​ ఎమ్మెల్యేలను పలుమార్లు బుజ్జగించినప్పటకీ ఫలించలేదు. ఈ తరుణంలో కీలకమైన విశ్వాస పరీక్షకు ముందు జరపాలని భావిస్తున్న మంతనాలు సఫలమయ్యేనో లేదో చూడాలి.

ఎవరితోనూ భేటీ వద్దు...

కాంగ్రెస్​ నేతల నుంచి తమకు ప్రాణహాని ఉందని.. అందుకే మల్లికార్జున ఖర్గే, గులాంనబీ ఆజాద్​తో పాటు ఎవరితోనూ భేటీ అవ్వాలనే ఆలోచనే లేదని ముంబయిలో ఉంటున్న రెబల్​ నేతలు ఇదివరకే పోలీసులకు లేఖ రాశారు.

గురువారం ఉదయం 11 గంటలకు...

సోమవారం కర్ణాటక శాసనసభ సమావేశాల ప్రారంభానికి ముందు బీఏసీ సమావేశమైంది. ఈ భేటీలో బలపరీక్ష కోసం ఒత్తిడి తెచ్చింది భాజపా. సుప్రీం కోర్టు విచారణ తర్వాత.. నిర్ణయం తీసుకుందామని సభ్యులకు సూచించారు స్పీకర్​. అయితే.. ఎంతకూ తగ్గని కాషాయ పార్టీ.. అవిశ్వాస తీర్మాన నోటీసును స్పీకర్​కు అందించింది. చివరకు.. ఈ నెల 18న సీఎం విశ్వాస పరీక్ష ఎదుర్కోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు సభాపతి. అనంతరం.. కాంగ్రెస్​ శాసనసభా పక్ష నేత సిద్ధరామయ్య దీనిపై స్పష్టతనిచ్చారు. 18న ఉదయం 11 గంటలకు విశ్వాస పరీక్షపై చర్చ ప్రారంభమవుతుందని వెల్లడించారు.

Last Updated : Jul 16, 2019, 8:35 AM IST

ABOUT THE AUTHOR

...view details