తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విజయం: చంద్రయాన్​-2 ఆరంభం మాత్రమే..

జాబిల్లిపై పరిస్థితుల పూర్తిస్థాయి అధ్యయనం కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్​-2 విజయవంతమైంది. కోట్లాది భారత ప్రజల ఆశలు, ఆకాంక్షలను మోస్తూ నింగిలోకి దూసుకెళ్లింది జీఎస్​ఎల్​వీ-మార్క్​-3ఎం1 వాహకనౌక. 16 నిమిషాల 13 సెకన్ల తర్వాత ఉపగ్రహాన్ని భూ స్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 48 రోజుల అనంతరం.. చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి దిగనుంది చంద్రయాన్-2.

By

Published : Jul 22, 2019, 3:54 PM IST

Updated : Jul 22, 2019, 7:26 PM IST

చంద్రయాన్​-2 ప్రయోగం విజయవంతం...

విజయం: చంద్రయాన్​-2 ఆరంభం మాత్రమే..

మానవ మేధస్సుకు పట్టం కట్టే మహోజ్జ్వల ఘట్టానికి తెరలేచింది. భారత రెండో మూన్​ మిషన్​ చంద్రయాన్​-2 ఉపగ్రహాన్ని శ్రీహరికోట సతీశ్​ ధావన్​ అంతరిక్ష కేంద్రం(షార్​) నుంచి విజయవంతంగా ప్రయోగించింది ఇస్రో.

దాదాపు 3 వేల 850 కేజీల బరువున్న ఉపగ్రహంతో సరిగ్గా మధ్యాహ్నం 2 గంటల 43 నిమిషాలకు నింగికెగసింది జీఎస్​ఎల్​వీ మార్క్​-3ఎం1 వాహకనౌక. బయలుదేరిన 16 నిమిషాల 13 సెకన్ల అనంతరం... చంద్రయాన్​-2 ఉపగ్రహాన్ని 170కి.మీ X 39,059 కి.మీ.ల భూ స్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టింది వాహకనౌక. 5 రోజుల తర్వాత భూ నియంత్రిత కక్ష్యలోకి ప్రవేశిస్తుంది.

ఇదీ చూడండి:చంద్రయాన్​-2: విక్రమ్​, ప్రగ్యాన్​లే అసలు హీరోలు!

అవరోధాలను అధిగమించి...

రాకెట్లో సాంకేతిక సమస్యతో మొదట జులై 15న ప్రయోగం అర్ధంతరంగా ఆగిన అనంతరం.. నేడు మిషన్​ విజయవంతంతో ఊపిరి పీల్చుకున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఉపగ్రహాన్ని భూ స్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టగానే.. షార్​ అంతటా హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. శాస్త్రవేత్తలంతా ఒకరికొకరు అభినందనలు చెప్పుకున్నారు.

ప్రయోగ విజయాన్ని ప్రకటించిన ఇస్రో ఛైర్మన్​ కె. శివన్​.. ఇది చంద్రునివైపు భారత చరిత్రాత్మక ప్రయాణానికి ఆరంభం మాత్రమేనని తెలిపారు. మార్క్‌-3 విజయం కొత్త ఉత్సాహాన్నిచ్చిందన్నారు. వచ్చే నెలన్నర కీలకమని.. సెప్టెంబర్‌ మొదటివారంలో ల్యాండర్ చంద్రుడిపై దిగిన తర్వాత యాత్ర పూర్తవుతుందన్నారు.

''భారత శాస్త్ర, సాంకేతిక రంగానికి ఈ రోజు చారిత్రకం. జీఎస్​ఎల్​వీ మార్క్​-3 వాహకనౌక చంద్రయాన్​-2 ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉంది.
అయితే.. చంద్రునిపై భారత చారిత్రక ప్రయాణానికి ఇది ఆరంభం మాత్రమే. ఇంకా.. చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో దిగి.. విస్తృత సాంకేతిక పరిశోధనలు చేయనుంది. అయితే.. తీవ్రమైన సాంకేతిక సమస్యను గుర్తించాం. దానిని వెంటనే పరిష్కరించి.. ఇస్రో విజయవంతమైంది. వారం క్రితం సాంకేతిక సమస్యను గుర్తించి... పరిష్కరించేందుకు ఇస్రో బృందమంతా రంగంలోకి దిగింది. ఆ 24 గంటలూ అద్భుతంగా కష్టపడ్డారు.''
- కె. శివన్​, ఇస్రో ఛైర్మన్​

ఇదీ చూడండి: 'భారత శాస్త్రవేత్తల సత్తా విశ్వవ్యాప్తం'

దాదాపు రూ. 978 కోట్ల వ్యయంతో రూపొందిందీ చంద్రయాన్​-2 ప్రాజెక్టు. జాబిల్లి ఉపరితలంపై రోవర్​ మృదువుగా దిగనుంది. తద్వారా ఆ ఘనత సాధించిన నాలుగో దేశంగా అవతరించనుంది భారత్​.

15 కీలక ప్రక్రియలు..

రానున్న 48 రోజుల్లో.. 15 కీలక ప్రక్రియల తర్వాత చంద్రయాన్​-2 సెప్టెంబర్​ మొదటి వారంలో జాబిల్లి దక్షిణ ధ్రువంపైకి దిగనుంది. ఇది విజయవంతమైతే ఈ ఘనత సాధించిన తొలి దేశంగా చరిత్ర సృష్టించనుంది భారత్​.

ఇదీ చూడండి: చంద్రయాన్​-2: ఇస్రో ఏం చేసినా ప్రత్యేకమే..!

చంద్రయాన్​-2లోని ల్యాండర్​, రోవర్​ మాత్రం చంద్రుడి ఉపరితలంపైకి సున్నితంగా దిగుతాయి. ముఖ్యంగా రోవర్.. చంద్రుడి ఉపరితలంపై తిరుగాడుతూ.. నీటి జాడ, ఖనిజాలు, సౌరకుటుంబం పుట్టుక, ఆవాసానికి అవకాశాలు వంటి వాటిపై విస్తృత పరిశోధనలు చేయనుంది. స్వీయ పరికరాలతో ఫొటోలూ తీసి అక్కడి వివరాలను భూమికి పంపుతుంది.

ఇదీ చూడండి: చంద్రయాన్​-1 సూపర్​ హిట్​.. కానీ...

Last Updated : Jul 22, 2019, 7:26 PM IST

ABOUT THE AUTHOR

...view details