భారత ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించి వేగవంతంగా చర్యలు తీసుకోవడం వల్ల కొవిడ్-19 కేసులను తక్కువ సంఖ్యకే పరిమితం చేయగలిగిందని మన దేశంలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) రాయబారి డేవిడ్ నబారో స్పష్టం చేశారు. అయితే, కేసుల సంఖ్య జులైలో గరిష్ఠ స్థాయి(పీక్)కి చేరుతుందని అంచనా వేశారు. అంతకంటే ముందు కొన్నిరోజుల పాటు కొత్త కేసుల సంఖ్య స్థిరంగా నమోదవుతాయని తెలిపారు. ప్రముఖ జాతీయ మీడియాతో ఈ విషయాలను వెల్లడించారు.
పెరిగినా..భయపడాల్సిన అవసరం లేదు
లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత కేసుల సంఖ్య కొంతకాలం పెరుగుతుందని.. అయినా భయడపడాల్సిన అవసరం లేదని నబారో స్పష్టం చేశారు. అక్కడక్కడ పెరిగినప్పటికీ.. క్రమంగా కట్టడిలోకి వస్తుందని తెలిపారు. లాక్డౌన్ సత్ఫలితాలిచ్చిందనీ.. దీనివల్ల వైరస్ను కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయగలిగామని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో తీవ్రత ఎక్కువగా ఉండడంపై నబారో ఆందోళన వ్యక్తం చేశారు.