తెలంగాణ

telangana

By

Published : May 23, 2020, 4:58 PM IST

Updated : May 23, 2020, 5:46 PM IST

ETV Bharat / bharat

కరోనా కేసుల నమోదులో భారత్‌ @ టాప్‌-5

గత వారం రోజులుగా కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య ఐదారు వేలకు తగ్గడం లేదు. దీంతో ఒక్కరోజులో ఎక్కువగా కేసులు వెలుగు చూస్తున్న దేశాల జాబితాలో భారత్‌ టాప్‌-5లో నిలిచింది. అమెరికా, బ్రెజిల్‌, రష్యా తర్వాత అత్యధికంగా భారత్‌లోనే కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ గణాంకాలు ప్రస్తుతం కలవరపెడుతున్నాయి.

India now at top 5 in new corona cases
కరోనా కేసుల నమోదులో భారత్‌ @ టాప్‌-5

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వైరస్​ వ్యాప్తి నివారణకు లాక్​డౌన్ విధించి... కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఒక్కరోజులో కొత్త కేసుల నమోదులో ముందు వరుసలోకి చేరుకోవడం ఆందోళన కలిగిస్తుంది. మే నెల ప్రారంభంలో దేశంలో ఒకరోజు కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య 2,400 దాటింది. మే మొదటి వారం తర్వాత ఆ సంఖ్య 3 వేలు దాటింది. గత వారం రోజులుగా కొత్తగా వస్తున్న కేసుల సంఖ్య 5-6 వేల మధ్య (మే 19 మినహా) ఉంటోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 6,654 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఒక్కరోజు వ్యవధిలో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,25,101కి చేరింది. మృతుల సంఖ్య 3,720కి పెరిగింది.

ఆ దేశాల్లో దారుణంగా..

ఇతర దేశాల్లో చూసినప్పుడు.. రోజువారీ కొత్త కేసుల నమోదు విషయంలో అమెరికాదే అగ్రస్థానం. అక్కడ 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే మరణాలు 97వేలు దాటగా మొత్తం కేసుల సంఖ్య 16.32 లక్షలు దాటింది. బ్రెజిల్‌లో సైతం గత కొన్ని రోజులుగా 20వేల కేసులు నమోదు అవుతున్నాయి. ఈ విషయంలో బ్రెజిల్‌ రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం మొత్తం అక్కడ పాజిటివ్‌ 3.14 లక్షల పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. 20వేలకు పైగా మరణించారు. రష్యాలో 8 వేల వరకు కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.26 లక్షలు దాటగా.. మరణాల సంఖ్య 3,249కి చేరింది. ఆ తర్వాత స్థానంలో భారత్‌ నిలుస్తోంది. (డబ్ల్యూహెచ్‌వో లెక్కల ప్రకారం)

కరోనా కేసుల నమోదులో భారత్‌@ టాప్‌-5

ఇదీ ఓ కారణం..

దేశంలో కరోనా కేసుల సంఖ్య మొదట్లో తక్కువగా నమోదు కావడానికి పరీక్షల సంఖ్య కూడా ఓ కారణం. ఇటీవల కరోనా నిర్ధారణ పరీక్షలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ప్రస్తుతం రోజుకు లక్ష వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) వెల్లడించింది. గత నాలుగైదు రోజులుగా రోజుకు లక్షకు పైగా నిర్వహిస్తున్నట్లు శుక్రవారం పేర్కొంది. మే 9-10 తేదీల్లో మొత్తం పరీక్షల సంఖ్య 10 లక్షలుగా ఉండగా.. మే 22 నాటికి మొత్తం 27.55 లక్షల పరీక్షలు నిర్వహించడం కేసుల సంఖ్య పెద్ద ఎత్తున వెలుగు చూడ్డానికి ఓ కారణం.

ఇదీ ఊరట..

దేశంలో ప్రస్తుతం మొత్తం కరోనా కేసుల సంఖ్య 1.25 లక్షలకు చేరింది. అయితే దేశంలో కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడం గమనార్హం. ప్రస్తుతం కోలుకుంటున్న వారి రేటు 41.39గా ఉంది. ఇవాళ విడుదల చేసిన తాజా బులెటిన్‌లో 51,783 మంది కోలుకున్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. 69,597 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. 1.25 లక్షల కేసులు నమోదు అవ్వడానికి భారత్‌కు పట్టిన సమయం 115 రోజులు కాగా.. బ్రిటన్‌లో 53 రోజులు, అమెరికాలో 69, రష్యాలో 93 రోజులు పట్టడం గమనార్హం.

కరోనా కేసుల నమోదులో భారత్‌@ టాప్‌-5

మనం చేయాల్సిందిదీ..

దాదాపు రెండు నెలలుగా లాక్‌డౌన్‌ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. దీంతో ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు కేంద్రం చాలా వరకు సడలింపులు ఇచ్చింది. మే 31 తర్వాత మరిన్ని సడలింపులు వచ్చే అవకాశం ఉంది. అయితే, కరోనా బారిన పడకుండా ఉండాలంటే ఇప్పటికీ భౌతిక దూరం పాటించడమొక్కటే మన ముందున్న మార్గం. మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడడం ద్వారానే ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది. ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది కదా అని ఇష్టానుసారం వ్యవహరిస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది!

ఇదీ చూడండి:టిక్​టాక్​ కోసం పిల్లికి ఉరి- కిరాతకుడు అరెస్ట్​

Last Updated : May 23, 2020, 5:46 PM IST

ABOUT THE AUTHOR

...view details